ఇబ్రహీంపట్నం, జూలై 5: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణప్రగతి కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతీక్జైన్ అన్నారు. సోమవారం ఆయన ఆదిబట్ల, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీల్లో ఆకస్మికంగా పర్యటించి పట్టణప్రగతి పనులను పరిశీలించారు. పట్టణ ప్రగతికింద గత ఐదు రోజులుగా చేపట్టిన పనులపై ఆయన ఆరా తీశారు. హరితహారం కింద నాటిన మొక్కలను ఆయన పరిశీలించారు. పట్టణప్రగతి కార్యక్రమానికి సంబంధించిన పలు అంశాలను అధికారులను, ప్రజాప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. ఆదిబట్ల, శేరిగూడ, ఇబ్రహీంపట్నంలలో పచ్చదనం, పరిశుభ్రతను ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రతీక్జైన్ మాట్లాడుతూ పట్టణప్రగతి కార్యక్ర మం ద్వారా పేరుకుపోయిన సమస్యలు పరిష్కారానికి నోచుకుంటున్నాయన్నారు.
పట్టణ ప్రగతితో పట్టణాలు అభివృద్ధి పథంలో కొనసాగుతున్నాయన్నారు. పట్టణప్రగతిని ప్రణాళిక ప్రకారం చేపట్టాలని ఆయన సూచించారు. పచ్చదనాన్ని పెంపొందించడానికి యుద్ధ ప్రాతి పదికన మొక్కలు నాటాలన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పట్టణ ప్రగతిని ముందుకు తీసుకుపోవాలన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను సద్వి నియోగం చేసుకొని పట్టణాలను అభివృద్ధి చేయాలన్నారు. కార్యక్రమంలో ఇబ్రహీం పట్నం మున్సిపల్ చైర్పర్సన్ స్రవంతి, వైస్ చైర్మన్ యాదగిరి, ఆదిబట్ల మున్సిపల్ వైస్ చైర్పర్సన్ కళమ్మ, కమిషనర్ సరస్వతీ, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.