ఇబ్రహీంపట్నం రూరల్, మే 19: స్వయం సహాయక సంఘాల(ఎస్హెచ్జీ) మహిళలకు బ్యాంకుల ద్వా రా రుణాలు అందించటంతోపాటు రికవరీలోనూ ఇబ్రహీంపట్నం మండలం రంగారెడ్డిజిల్లాలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఈ మండలంలోని 14 గ్రామపంచాయతీల్లో 792 డ్వాక్రా సంఘాలకు రూ. 30.93 కోట్ల రుణాలను అందించేందుకు అధికారు లు లక్ష్యంగా నిర్దేశించుకొని 718 సంఘాలకు రూ. 32.51 కోట్ల రుణాలను లక్ష్యానికి మించి అందించి.. సంఘాల నుంచి డబ్బుల రికవరీలోనూ మండలం మేటిగా నిలువడంతో తెలంగాణ ప్రభుత్వం ఇబ్రహీంపట్నం మండలాన్ని రాష్ట్రస్థాయి ఉత్తమసేవా అవార్డుకు ఎంపిక చేసింది. బుధవారం నగరంలోని బంజారాహిల్స్లో ఉన్న మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఈ అవార్డును ఇబ్రహీంపట్నం ఐకేపీ ఏపీఎం రవీందర్కు అందజేశారు. మహిళలు స్వయం సహాయక సంఘాల ద్వారా తీసుకున్న రుణాలను వృథా చేయకుండా వారు చిన్నతరహా పరిశ్రమలను ఏర్పా టు చేసుకునేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. తద్వా రా ఆర్థికాభివృద్ధి సాధించేలా చూస్తున్నది.
మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం బ్యాంకుల ద్వారా పెద్ద ఎత్తున రుణాలను అందజేస్తున్నది. ఆ రుణాలను సద్వినియోగం చేసుకునేందుకు ఇబ్రహీంపట్నం ఐకేపీ ఏపీఎం రవీందర్ మండలంలోని అన్ని గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి మహిళలకు అర్థమయ్యేలా వివరించి అవగాహన కల్పిస్తున్నారు. తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించడం ద్వారా కలిగే లాభాలను వివరించి వారిని ప్రోత్సహిస్తున్నారు. దీంతో మండలంలోని 14 గ్రామాల్లోని 792 సంఘాల్లో ఉన్న మహిళలు రుణా లను తీసుకోవటంతోపాటు వాటిని సక్రమంగా తిరిగి బ్యాంకులకు చెల్లిస్తూ అభివృద్ధి చెందుతున్నారు. ప్రభుత్వం అందిస్తున్న రుణాలతో కుట్టుమిషన్లు, అల్లికలు తదితర చిన్నతరహా పరిశ్రమలను ఏర్పాటు చేసుకుని తాము ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నామని వారు పేర్కొంటున్నారు.
కాగా శంషాబాద్ మండలంలోని కెనరా బ్యాంక్ నర్కుడ బ్రాంచ్కు కూడా రాష్ట్రస్థాయి ఉత్తమసేవా అవార్డు వరించింది. ఈ సందర్భంగా డీఆర్డీఏ ప్రభా కర్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ అమయ్కుమార్ ప్రోత్సాహం, అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ సూచనల మేరకు ఈ లక్ష్యాన్ని సాధించినట్ల్లు చెప్పారు. ఇదే స్ఫూర్తితో అన్ని ప్రభుత్వ పథకాలను ముందుకు తీసుకెళ్తామన్నారు.
కడ్తాల్ మండల మహిళా సమాఖ్యకు రాష్ట్రస్థాయిలో ఉత్తమ అవార్డు వరించినట్లు ఐకేపీ ఏపీఎం రాజేశ్వరి తెలిపారు. కడ్తాల్ మహిళా సమాఖ్య క్లస్టర్ పరిధిలోని మహిళా సంఘాలకు వంద శాతం రుణాలను ఇప్పించడంతోపాటు.. సకాలంలో డబ్బుల ను రికవరీ చేసినందుకు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ అవా ర్డు వచ్చినట్లు ఆమె చెప్పారు. బుధవారం హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చేతుల మీదుగా అవార్డును అందుకున్నట్లు తెలిపారు. మం డల మహిళా సమాఖ్యకు ప్రోత్సాహం అందించిన డీఆర్డీఏ ప్రభాకర్కు మహిళా సమాఖ్య సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ఇబ్రహీంపట్నం మండలానికి రాష్ట్రస్థాయి ఉత్తమసేవా అవార్డు రావడం సంతోషకరం. మండలంలోని 14 గ్రామపంచాయతీల్లో ఉన్న మహిళా సంఘాల సభ్యులు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను సకాలంలో తిరిగి చెల్లిస్తుండటంతో ఇబ్రహీంపట్నం రంగారెడ్డి జిల్లాలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఇబ్రహీంపట్నం తరహాలోనే జిల్లాలోని అన్ని మండలాలు కూడా రుణాల చెల్లింపుల్లో ముందుండాలి.
– ప్రభాకర్, డీఆర్డీఏ
మండలంలోని 14 గ్రామాల్లో ఉన్న మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకుల ద్వారా రుణాలను అందించటంతోపాటు తీసుకున్న రుణాలను తిరిగి సకాలంలో చెల్లించేలా నెలలో సుమారు నాలుగైదుసార్లు సమావేశాలు నిర్వహించి వారికి అవగాహన కల్పిస్తున్నాం. మా సేవలను గుర్తించి రాష్ట్రస్థాయి ఉత్తమసేవా అవార్డుకు మండలాన్ని ఎంపిక చేసిన ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు. రానున్న రోజుల్లో మహిళా సంఘాల అభ్యున్నతికి మరింత కృషి చేస్తా.
-రవీందర్, ఐకేపీ ఏపీఎం ఇబ్రహీంపట్నం