హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లైసెన్స్ సర్వేయర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిషరించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోల్ లీడర్ హరీశ్రావు డిమాండ్ చేశారు. బీటెక్, ఎంటెక్, సివిల్ ఇంజినీరింగ్ వంటి ఉన్నత విద్యను అభ్యసించిన యువతను ఉద్దేశించి ఐఏఎస్ అధికారి లోకేశ్కుమార్ బాధ్యతారహితంగా మాట్లాడటం దుర్మార్గమని విమర్శించారు. తమ సమస్యలను చెప్పుకొనేందుకు వెళ్లిన సర్వేయర్లపై మంత్రి పొంగులేటి చేతిలో ఉన్న వస్తువులతో కొట్టడానికి ప్రయత్నించడం ప్రభుత్వ అహంకారానికి, అణచివేతకు నిదర్శనమని మండిపడ్డారు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆరువేల మంది సర్వేయర్లు, వారి కుటుంబాలు ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు.
లైసెన్స్ సర్వేయర్లతో తెలంగాణభవన్లో బుధవారం ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సర్వేయర్ల సమస్యలు తెలుసుకొని వారిపై ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ హకుల సాధన కోసం ధర్నా చేసిన 6,000 మంది లైసెన్స్ సర్వేయర్లను పోలీసులు పశువుల్లా ఈడ్చుకెళ్లి, ఠాణాల్లో నిర్బంధించి అన్నం కూడా పెట్టకుండా హింసించారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకులను ఎందుకు కలుస్తున్నారంటూ సర్వేయర్లను ప్రభుత్వం బెదిరించడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వం స్పందించనప్పుడే ప్రజలు ప్రతిపక్షం వద్దకు వస్తారని, బాధితులకు అండగా నిలువడమే బీఆర్ఎస్ ధ్యేయమని స్పష్టంచేశారు. సీఎంవో స్పెషల్ సెక్రటరీతో చిన్నారెడ్డి లౌడ్ స్పీకర్లో మాట్లాడితే సీఎం ఈగో దెబ్బతిని వారిని వెళ్లగొట్టుమనడం ప్రజాస్వామ్యాన్ని పరిహసించడమేనని విమర్శించారు. సీఎం పదవి ప్రజలిచ్చిన భిక్ష అని, అధికారుల జీతాలు ప్రజల పన్నుల నుంచే వస్తున్నాయని గుర్తుచేశారు.
లంచాలు వసూలు చేయాలనడం దివాలాకోరుతనం
కనీస వేతనం, టీఏ,డీఏలు, హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోవడంతో సర్వేయర్లు తమ సొంత డబ్బులతో విధులకు వెళ్లాల్సి వస్తున్నదని హరీశ్ ఆవేదన వ్యక్తంచేశారు. వంద రూపాయల పెట్రోల్ పోయించుకొని, కేవలం రూ.60 పొందుతూ జీవనం సాగించడం సాధ్యం కాక, అప్పులపాలై ఇద్దరు సర్వేయర్లు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరమని పేరొన్నారు. సమస్యలను కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్తే లంచాలు వసూలు చేసుకోవాలని సూచించడం ఈ ప్రభుత్వ దివాలాకోరుతనానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 70 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నవన్నీ పచ్చి అబద్ధాలని ఎండగట్టారు.
కేసీఆర్ హయాంలో నోటిఫికేషన్లు ఇచ్చి, పరీక్షలు నిర్వహించి, ఫలితాలు వెల్లడిస్తే.. ఈ ప్రభుత్వం నియామక పత్రాలు అందించి తమ ఖాతాలో వేసుకుంటున్నదని విమర్శించారు. ఇప్పుడు 6 వేల మంది లైసెన్స్ సర్వేయర్లను కూడా ఉద్యోగాల ఖాతాలో చూపిస్తూ మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. లైసెన్స్ సర్వేయర్లు ఎవరూ అధైర్యపడి ప్రాణాలు తీసుకోవద్దని, బీఆర్ఎస్ పూర్తి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో సర్వేయర్ల సమస్యలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తామని, అన్ని జిల్లాల్లో జరిగే ఆందోళనల్లో బీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్యేలు ప్రత్యక్షంగా పాల్గొంటారని తెలిపారు. యువత తిరగబడే పరిస్థితి రాకముందే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సర్వేయర్లను వెంటనే చర్చలకు పిలిచి వారి సమస్యలను పరిషరించాలని డిమాండ్ చేశారు.