షాద్నగర్రూరల్, మే19 : సంపూర్ణ అక్షరాస్యతతోనే రాష్ట్రం మరింత పురోగతి చెందుతుందని సర్కార్ విద్యావ్యవస్థకు పెద్దపీట వేసింది. విద్యావ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు సర్కార్ వివిధ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. దీంతో నేడు అక్షరాస్యత శాతం గణనీయంగా పెరిగింది. దీనికి తోడు ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేసే దిశగా సర్కార్ అడుగులు వేస్తుండడంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని మౌలిక వసతులతో పాటు నాణ్యమైన విద్యను అందిస్తున్నది.
ప్రభుత్వం పాఠశాలలను మరింత బలోపేతం చేసే దిశగా ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి పాఠశాలల రూపురేఖలతో పాటు నాణ్యమైన విద్యను అందించేలా కృషి చేసింది. మన ఊరు.. మన బడి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి పాఠశాలల్లో మరుగుదొడ్లు, ప్రహరీ, నూతన గదుల నిర్మాణం, వంట గదులు, డైనింగ్ హాల్, గ్రీన్ బోర్డులు, పెయింటింగ్, విద్యుత్, ఫర్నిచర్, తాగునీటి వసతి, ల్యాబ్ ఇలా ఎన్నో మౌలిక వసతులను సమకూర్చుతున్నది. అదే విధంగా విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి 1నుంచి 8వరకు ఆంగ్ల బోధనలో విద్యను బోధించే విధంగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలో అన్ని మౌలిక వసతులను సమకూర్చేలా సమావేశాలను ఏర్పాటు చేశారు. ముందుగా ఎంపికైన పాఠశాలల్లో కొరవడిన మౌలిక వసతులను గుర్తించి వాటికి ఎంత ఖర్చు అవుతుందో నివేదికను తయారు చేశారు. దీనికి సంబంధించి పనులను పూర్తి చేసేందుకు మొదటి ప్రాధాన్యత ఎస్ఎంసీ చైర్మన్, రెండో ప్రాధాన్యత సర్పంచ్, మూడో ప్రాధాన్యత ఇతరులకు కల్పించి అందరి సమక్షంలో నిర్ణయాలు తీసుకున్నారు. దీనికి కాంట్రాక్టర్లను సైతం ఎంపిక చేశారు. ఈ మౌలిక వసతులకు రూ. 30లక్షల వరకు కాంట్రాక్టర్లు పనులను పూర్తి చేస్తారని, రూ. 30లక్షలు దాటితే టెండర్ల ప్రక్రియ ఉంటుందని తెలిపారు. మన ఊరు..మన బడి కార్యక్రమానికి ఎంపికైన పాఠశాలల ప్రకారం ప్రభుత్వం నుంచి నిధుల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. త్వరలోనే ఆయా పాఠశాలల అకౌంట్లలో ప్రభుత్వం నగదు జమ చేయనున్నది. ప్రైవేట్కు దీటుగా నాణ్యమైన విద్యతో పాటు ఆధునిక హంగులతో అన్ని మౌలిక వసతులతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారనున్నాయి.
ఫరూఖ్నగర్ మండలంలో మన ఊరు.. మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారనున్నాయి. మండలంలో మొత్తం 98పాఠశాలలకు మొదటి విడుతలో 34పాఠశాలలు ఎంపికైనట్లు మండల విద్యాధికారి తెలిపారు. ఇందులో 15పాఠశాలలు అర్బన్, 19రూరల్ పాఠశాలలు ఉన్నాయి. ఫరూఖ్నగర్ మండలం మొగిలిగిద్ద, కొత్తకాలనీ, వెల్జర్ల, కిషన్నగర్, పెద్దపలుగుట్టతండా, విఠ్యాల, రాయికల్, బూర్గుల, కాశిరెడ్డిగూడెం, మధురాపూర్, చటాన్పల్లి, రామ్నగర్కాలనీ, తోలగేరి, ఫరూఖ్నగర్, ఆర్టీసీకాలనీ, సులేమాన్కాలనీ, ఉర్ధూమీడియం, పటెల్రోడ్డు ఉర్దుమీడియం, వేంకటేశ్వరకాలనీ, క్రిస్టియన్కాలనీ, రైల్వేస్టేషన్రోడ్డు ప్రాథమిక పాఠశాలతో పాటు ఎలికట్ట, కందివనం, కంసాన్పల్లి, గంట్లవెల్లి ప్రాథమికోన్నత పాఠశాలు, మొగిలిగిద్ద, కిషన్నగర్, చించోడ్, రాయికల్, బూర్గుల, షాద్నగర్ కుంట బడి, ఫరూఖ్నగర్ ఉర్ధుమీడియం, బాలికల ఉన్నత పాఠశాలు, ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఎంపికైనట్లు తెలిపారు.
మన ఊరు.. మన బడి కార్యక్రమంలో ఎంపికైన అన్ని పాఠశాలల్లో మౌలిక వసతులు పూర్తిస్థాయిలో సమకూరనున్నాయి. ఇప్పటికే ఎంపికైన పాఠశాలల్లో చేయాల్సిన పనులను గుర్తించాం. వాటికి సంబంధించిన నివేదికను ఉన్నతాధికారుల సమర్పించడంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. దీంతో ఎంపికైన పాఠశాలలో పనులు ప్రారంభం కానున్నాయి. పాఠశాల అభివృద్ధికి దాతలు సైతం ముందుకురావాలి.
-శంకర్రాథోడ్, మండల విద్యాధికారి షాద్నగర్
ప్రభుత్వం నాణ్యమైన విద్యతో పాటు పాఠశాలలో అన్ని మౌలిక వసతులు సమకూరుస్తున్నది. ప్రతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలోనే చదివేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.
-కట్ట వేంకటేశ్గౌడ్, కిషన్నగర్ ఫరూఖ్నగర్ మండలం షాద్నగర్