మహేశ్వరం, ఫిబ్రవరి 27: మహేశ్వరంలో సోమవారం నుంచి నిర్వహించే శ్రీరాజరాజేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు శివగంగ పుణ్యక్షేత్రం ముస్తాబైంది. సోమవారం ప్రారంభమవుతున్న ఉత్సవాలు నాలుగో తేదీ వరకు కొనసాగనున్నాయి. అన్ని శాఖల అధికారులు బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఉత్సవాలకు ఇతర రాష్ర్టాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు రానున్న నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులను దృష్టిలోపెట్టుకుని ఆర్టీసీ వివిధ ప్రాంతాల నుంచి ఈ నాలుగు రోజులపాటు ప్రత్యేకంగా బస్సులను నడిపిస్తున్నారు. చిన్న పిల్లలకు ఆహ్లాదకరంగా ఉండేందుకు సర్కస్, ఎగ్జిబిషన్లను ఏర్పాటు చేస్తున్నారు. కరోనా నిబంధనలను పాటిస్తూ ఈసారి బ్రహ్మోత్సవాలు మహేశ్వరం దేవస్థాన కమిటీ ప్రతినిధులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 150 మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే ప్రజలు ఇబ్బంది పడకుండా పార్కింగ్కు ప్రత్యేకంగా ఏర్పాట్లు పోలీసు అధికారులు చేస్తున్నట్లు తెలిపారు. మహేశ్వరం నుంచి వచ్చే వాహనాలకు అక్షిత వెంచర్ రైతు వేదిక వద్ద, మన్సాన్పల్లి, మహేశ్వరం నుంచి వచ్చే వాహనాలకు ఆంజనేయస్వామి వద్ద ప్రత్యేక పార్కింగ్ను ఏర్పాటు చేస్తున్నారు.