ఇబ్రహీంపట్నం, జనవరి 27 : సీఎం కేసీఆర్ ప్రభుత్వం మన ఊరు -మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధనతోపాటు మౌలిక వసతుల కల్పనకు శ్రీకారం చుట్టింది. అయితే మంచాల మండలంలోని నోముల ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఈ కార్యక్రమం 2016 నుంచే అమలు అవుతున్నది. ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజిరెడ్డి ప్రత్యేక చొరవ… దాతల సహకారంతో మౌలిక వసతుల కల్పన, ఆంగ్ల మాధ్యమంలో బోధిస్తుండటం తో పాఠశాలకు విద్యార్థుల హాజరు గణనీయంగా పెరిగింది. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపించటం మానేశారు. గతంలో 70 మంది ఉన్న నోముల ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రస్తుతం 200 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. నోముల జనాభా ప్రకారం చిన్న గ్రామం. మొదట్లో ఒకటో తరగతిలో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెట్టడంతో విద్యార్థుల హాజరుశాతం బాగా పెరిగింది. దీంతో ఏడాదికి ఒక తరగతి చొప్పున పెంచుకుం టూ ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టారు. ప్రస్తుతం పాఠశాలలో ఏడు తరగతుల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధన జరుగుతున్నది. దీంతో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోనే నోముల ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థుల హాజరుశాతంలో అగ్రస్థానంలో నిలిచింది.
పాఠ్యపుస్తకాలను అందించిన ప్రభుత్వం
ఆంగ్ల మాధ్యమంలో బోధన కోసం నోముల పాఠశాలలో విద్యా కమిటీ, గ్రామ పంచాయతీ, ఉపాధ్యాయులతో కలిసి ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ప్రభుత్వపరంగా ఎలాంటి వసతులు కల్పించకున్నా తమ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమంలో బోధనను తాము ప్రారంభించుకుంటామని కమిటీ తీర్మానించి ప్రభుత్వానికి పంపింది. దీంతో ప్రభుత్వం ఇంగ్లిష్ బోధనకు అనుమతించి పాఠ్యపుస్తకాలను కూడా అందజేసింది. మిగిలిన వసతులను దాతల సహకారంతో సమకూర్చుకున్నారు. ఆంగ్ల మాధ్యమ బోధనలో నోముల పాఠశాల అంచెలంచెలుగా ఎదిగింది. దీని ఫలితంగానే ప్రస్తుతం గ్రామంలోని విద్యార్థుల్లో 95 శాతం విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకుంటున్నారు. పాఠశాలలో మౌలిక వసతులు కూడా పుష్కలంగా ఉండ టంతో విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా పూర్తి నమ్మకం కలిగింది.
సమష్టి కృషితోనే సాధించాం
నోముల పాఠశాలలో ఆంగ్ల మాధ్యమంలో బోధనను ప్రయోగాత్మకంగా ప్రారంభించాం. గ్రామ పంచాయతీ, విద్యాకమిటీ తమకు పూర్తి సహకారం అందించాయి. ఉపాధ్యాయ బృందం కూడా బోధించేందుకు ముందుకొచ్చారు. దీంతో అందరి సమష్టి కృషితోనే విజయాన్ని సాధించాం. ప్రస్తుతం నోముల గ్రామంలోని విద్యార్థులంతా ప్రైవేటు పాఠశాలలకు స్వస్తి చెప్పి ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకుంటున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన మన ఊరు – మన బడి కార్యక్రమం ద్వారా మరిన్ని మౌలిక వసతులను కల్పించుకుని ఇంగ్లిషు బోధనతో ముందుకెళ్తాం.
-రాజిరెడ్డి, నోముల పాఠశాల ప్రధానోపాధ్యాయుడు
ఇంగ్లిష్ మీడియంతో ప్రత్యేక గుర్తింపు
ఆంగ్ల మాధ్యమంలో బోధించడంతోనే నోముల పాఠశాలకు మండలంలోనే ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఉపాధ్యాయులు ముందుకు రావడంతో వారికి మేము సహకారాన్ని అందించాం. ప్రస్తుతం పిల్లలను తమ స్వగ్రామంలోనే చదివించుకోవటం ఎంతో సంతోషంగా ఉంది.