రంగారెడ్డి, జనవరి 27, (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పాఠశాలలకు మన ఊరు-మన బడి కార్యక్రమంతో మహర్దశ రానున్నది. విద్యాశాఖలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చు ట్టారు. రానున్న మూడేండ్ల కాలంలో రాష్ట్రంలోని అన్ని బడుల్లో మౌలిక వసతులను మెరుగుపర్చనున్నారు. ముందుగా అధిక విద్యార్థులు ఉన్న సర్కా రు బడుల్లో సౌకర్యాలను కల్పించనున్నారు. విద్యార్థులు ఎక్కువ మంది ఉన్న ప్రభుత్వ పాఠశాలలతోపాటు జిల్లా పరిషత్ పాఠశాలలను పరిగణనలోకి తీసుకోనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల్లో భాగంగా నీటి వసతితో కూడిన మరుగుదొడ్లు, విద్యుద్దీకరణ, అన్ని పాఠశాలలకు తాగునీటి సరఫరా, ఫర్నిచర్, పాఠశాలలకు రంగులు, పాఠశాల భవనాలకు మరమ్మతులు, చాక్బోర్డులు, ప్రహరీలు, వంటగది షెడ్లు, శిథిలావస్థకు చేరిన గదుల స్థానంలో కొత్తవి నిర్మించనున్నారు. కాగా జిల్లాలోని ప్రభుత్వ, జడ్పీహెచ్ఎస్లలో అవసరమైన మౌలిక వసతులకు సంబంధించి జిల్లా విద్యాశాఖ అధికారులు ఇప్పటికే ప్రతిపాదనలను సిద్ధం చేశారు. సర్కారు బడుల్లో సౌకర్యాల కల్పనకు రూ.200 కోట్ల నిధులు అవసరమని అంచనా వేశారు. అంతేకాకుండా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఒకటి నుంచి పదో తరగతి వరకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బడుల్లో ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో నిరుపేదలకు ఆంగ్లం అందనుండటంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అన్ని బడుల్లో ప్రహరీలు, టాయిలెట్ల నిర్మాణం
మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారనున్నాయి. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని అమలుచేయడంతోపాటు అవసరమైన మౌలిక వసతులను కూడా కల్పించనున్నారు. ఈ కార్యక్రమం కింద జిల్లాలోని మూడు ప్రభుత్వ పాఠశాలలను ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి మౌలిక వసతులను కల్పిస్తున్నారు. జిల్లాలోని శివరాంపల్లి, జిల్లెలగూడ, సరూర్నగర్ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల పనులు 40 శాతం వరకు పూర్తయ్యాయి. మరోవైపు జిల్లాలోని మిగతా పాఠశాలల్లోనూ రానున్న మూడేండ్లలో పూర్తిస్థాయిలో వసతులు కల్పించనున్నారు. కాగా ఈ వసతుల కల్పనకు రూ.200 కోట్లు అవసరమని ఇప్పటికే జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేశారు. ఆ నిధుల నుంచి జిల్లాలోని అన్ని బడుల్లో ప్రహరీలు, మరుగుదొడ్లను నిర్మించేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. జిల్లావ్యాప్తంగా 554 ప్రభుత్వ పాఠశాలల్లో (1,10,189 రన్నింగ్ మీటర్ల) ప్రహరీలను నిర్మించాలని గుర్తించిన అధికారులు ఒక్కో రన్నింగ్ మీటరుకు రూ.7వేల చొప్పున రూ.77.13 కోట్ల నిధులు అవసరమని అంచనా వేశారు. అదేవిధంగా 245 మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.5.14 కోట్ల నిధులు అవసరమని అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేశారు.
పరిగి, జనవరి 27: సర్కారు బడుల్లో సకల సదుపాయాల కల్పనే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. ఇందుకోసం మన ఊరు-మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వికారాబాద్ జిల్లాలో ప్రహరీలు లేని పాఠశాలలు 480 ఉండగా, 294 పాఠశాలల్లో మరుగుదొడ్ల్ల నిర్మాణం చేపట్టాల్సి ఉన్నది. ఈ కార్యక్రమం ద్వారా ఈ ఏడాది విద్యార్థులు అధికంగా ఉన్న 35 శాతం ప్రభు త్వ బడుల్లో మౌలిక వసతుల ను ప్రభుత్వం కల్పించనుం ది. ఇందుకు సంబంధించి ఎస్ఐఎస్ యాప్ ద్వారా వచ్చిన సమాచారం మేర కు ఏ పాఠశాలలో ఏఏ వసతులను కల్పించాలన్న దానిపై ఒక అంచనాకు వచ్చిన విద్యాశాఖ అధికారులు ఆయా వసతుల కల్పనకు ఎన్ని నిధులు అవసరం అవుతాయన్న దానిపై లెక్కలు తేలుస్తున్నారు. మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.200 కోట్లు ఖర్చు చేయనుండగా, ప్రహరీల నిర్మాణానికి సంబంధించి ఆయా పాఠశాలల స్థలం ఆధారంగా నిధుల ను కేటాయించనున్నారు. జిల్లా పరిధిలో ప్రాథమిక పాఠశాలలు-764, ప్రాథమికోన్నత పాఠశాలలు-116, ఉన్నత పాఠశాలలు- 174 , టీఎస్ఎంఎస్-9, కేజీబీవీలు-18, టీఎస్ గురుకులా లు-26 ఉన్నాయి. వాటిలో సుమారు లక్షా10వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రస్తు తం జిల్లాలోని ఆయా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మరుగుదొడ్లను నిర్మించనున్నారు. అలాగే అన్ని పాఠశాలలకు ప్రహరీల నిర్మాణం చేపట్టనున్నారు.
జిల్లాలో 1,084 పాఠశాలలు
వికారాబాద్ జిల్లా పరిధిలో 1,084 పాఠశాలలు ఉండగా అందులో 480 పాఠశాలలకు ప్రహరీలు లేవు. పరిగి నియోజకవర్గంలో 153 పాఠశాలలు, కొడంగల్లో 131స్కూళ్లు, తాండూరు లో 89 పాఠశాలలు, వికారాబాద్లో 88 స్కూ ళ్లు, చేవెళ్ల నియోజకవర్గంలోని నవాబుపేట్ మం డలంలో 19 పాఠశాలలకు ప్రహరీలు లేవని విద్యాశాఖ అధికారులు గుర్తించారు. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలల పనివేళల తర్వా త పశువులు, మేకలు సైతం ప్రాంగణంలోకి రా వడం, సాయంత్రం సమయంలో మందుబాబులకు అడ్డాగా స్కూళ్లు మారుతున్నాయి. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో జిల్లాలోని అన్ని సర్కారు బడులకు ప్రహరీలను నిర్మించనున్నా రు. తద్వారా పాఠశాలల స్థలం కబ్జా కాకుండా సంరక్షించడంతోపాటు పరిసరాలు శుభ్రంగా ఉంటాయి.
294 స్కూళ్లలో మరుగుదొడ్ల నిర్మాణం
మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని అన్ని సర్కారు బడుల్లో నీటి వసతితో కూడిన మరుగుదొడ్లను నిర్మించనున్నారు. ముం దుగా టాయిలెట్ల వసతి లేని పాఠశాలల్లో పనులను చేపడుతారు. జిల్లా పరిధిలో మొత్తం 294 పాఠశాలల్లో మరుగుదొడ్లు అవసరమని అధికారులు గుర్తించారు. ఇందులో బాలికలకు 101, బాలురకు 193 టాయిలెట్లను నిర్మించను న్నా రు. ఈ కార్యక్రమంలో భాగంగా 20 మంది విద్యార్థులకు ఒకటి చొప్పున మూత్రశాలలు, 40 మంది విద్యార్థులకు ఒక మరుగుదొడ్డిని నిర్మిస్తా రు. బాల, బాలికలకు వేర్వేరుగా నాలుగు చొప్పు న వెస్ట్రన్ టాయిలెట్లను ఏర్పాటు చేస్తారు. ఈ టాయిలెట్లకు నీటి వసతితోపాటు నిరంతరం కరెంటు సరఫరా ఉండేలా విద్యుత్ కనెక్షన్, స్విచ్బోర్డులను ఏర్పాటు చేయిస్తారు. ఒక్కోదానికి సుమారు రూ.3లక్షల వరకు ఖర్చవుతాయని అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే ఉన్న మరుగుదొడ్లలో పాతవాటిని తొలగించి, వెస్ట్రన్ టాయిలెట్లను ఏర్పాటు చేయడంతోపాటు టైల్స్ బిగిస్తారు. తద్వారా అన్ని స్కూళ్లలోనూ టాయిలెట్లు అందుబాటులోకి రానున్నాయి.
గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఎంతో మేలు
బషీరాబాద్, జనవరి 27: సీఎం కేసీఆర్ ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని బోధిస్తామని తీసుకున్న నిర్ణయంతో మారుమూల ప్రాంత విద్యార్థులకు ఎంతో మేలు జరగనుంది. వీరారెడ్డి సర్పంచ్, ఇందర్చేడ్
విద్యార్థుల ఇబ్బందులు తీరుతాయి
తెలంగాణ ప్రభుత్వం పాఠశాలల అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నది. అన్ని బడుల్లో ప్రహరీలు, మరుగుదొడ్లను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నది. గత ఉమ్మడి ప్రభుత్వాల పాలకులు పాఠశాలలను పట్టించుకోలేదు. ప్రహరీలు, మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయితే విద్యార్థులకు ఇబ్బందులు తీరుతాయి.
వర్కాల పరమేశ్, ప్రధానోపాధ్యాయుడు, ఇబ్రహీంపట్నం