ఆమనగల్లు, ఫిబ్రవరి 17 : సీఎం కేసీఆర్ ఆశీస్సులతో కల్వకుర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని, పనులకు అడ్డంకులు సృష్టిస్తే ప్రజలే తరిమికొడతారని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నియోజకవర్గానికి చెందిన ఒక నాయకుడు రాజ్యాంగం ద్వారా జాతీయ స్థాయిలో పదవి పొంది అట్టి పదవిని దుర్వినియోగం చేస్తున్నాడని విమర్శించారు. నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులకు తామే నిధులు తెచ్చామంటూ ఉత్తరకుమార పలుకులు పలుకుతున్నాడని ఎద్దేవా చేశాడు. బీజేపీ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలన్నారు. ఆమనగల్లు ప్రభుత్వ దవాఖానను కమ్యూనిటీ హెల్త్ దవాఖానగా మార్చడంతో పాటు రోగులకు ఇబ్బందులు లేకుండా కొత్త భవన నిర్మాణం, తలకొండపల్లి, మాడ్గుల మండలాల్లో నాలుగులేన్ల రోడ్లకు నిధుల మంజూరు, ప్రభుత్వ జూనియర్ కళాశాల, గ్రంథాలయాల భవనాలకు నిధులు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం డీ-82 కాల్వలకు నిధులు, డబుల్బెడ్రూం, దళితబంధు లాంటి పథకాలు అమలు అవుతున్నట్లు చెప్పారు. ఆమనగల్లు మున్సిపాలిటీ అభివృద్ధి విషయంలో తాను కట్టుబడి ఉన్నానని, మండల షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని త్వరలో చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన శాసన సభ్యుడికి పూర్తి అధికారులు నియోజకవర్గంలో ఉంటాయన్నారు. ఇది గుర్తెరిగి బీజేపీ నాయకులు మాట్లాడాలని ఆయన చురకలంటించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వెంటే ప్రజలంతా ఉన్నారన్నారు. ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
కడ్తాల్ : అంబేద్కర్ అందరికీ ఆదర్శప్రాయుడని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద చేపట్టిన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. రాజ్యాంగ రచనలో అంబేద్కర్ ప్రధాన భూమికను పోషించారని, సమసమాజ నిర్మాణానికి ఆయన పునాదులు వేశారని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు శ్రీనివాస్రెడ్డి, జడ్పీటీసీ దశరథ్నాయక్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా, ఎంపీటీసీలు లచ్చిరాంనాయక్, గోపాల్, ఉప సర్పంచ్ రామకృష్ణ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పరమేశ్, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు అంజి, గౌరవాధ్యక్షుడు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.