కడ్తాల్, ఫిబ్రవరి 16 : కడ్తాల్ పట్టణం రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి సాధించనున్నదని హైదరాబాద్ రీజియన్ పట్టణాభివృద్ధి శాఖ డైరెక్టర్ నర్సింహారెడ్డి అన్నారు. బుధవారం కడ్తాల్ మండల కేంద్రంలో శాఖ అధికారులు, సర్పంచ్ లక్ష్మీనర్సింహారెడ్డితో కలిసి ఆయన పర్యటించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని కడ్తాల్ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరిచే విధంగా ప్లాన్ తయారు చేయాలని పట్టణాభివృద్ధి శాఖ అధికారులను సర్పంచ్ కోరారు. కడ్తాల్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో కడ్తాల్ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించడానికి స్థలాలు, కట్టడాలను గుర్తించారు. కడ్తాల్ గ్రామం రెవెన్యూ పరిధికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు. అనంతరం గ్రామంలోని ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు, రహదారులను పరిశీలించి సర్వే నంబర్లు సేకరించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ నర్సింహారెడ్డి మాట్లాడుతూ భవిష్యత్లో ప్రజల అవసరాలను పరిగణనలోకి తీసుకొని రహదారులు, ట్రాఫిక్కి అనుగుణంగా నివాస, వాణిజ్య పరిశ్రమలు, పబ్లిక్, సెమీ పబ్లిక్, వ్యవసాయ సెక్టార్ల పరిధి మొత్తాన్ని గుర్తించి, వాటికి సంబంధించిన వివరాలను ఐఎల్యూపీ (ఇండికేటివ్ లాండ్ యూస్ ప్లాన్) మాస్టర్ ప్లాన్ ద్వారా అందుబాటులో ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రార్థన మందిరాలకు సంబంధించిన వివరాలను ఇందులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. పూర్వపు కడ్తాల్ గ్రామ పంచాయతీని కలిపి ముసాయిదాను సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఆ శాఖ అధికారులు ఏడీ సత్యభామ, టీపీఏ శేఖర్, భార్గవీ, ఏడీఏం కళ్యాణి, ఉప సర్పంచ్ రామకృష్ణ, వార్డు సభ్యులు నరేందర్రెడ్డి, భిక్షపతి, ఏఎంసీ డైరెక్టర్ లాయక్అలీ, నాయకులు రాంచంద్రయ్య, పంచాయతీ కార్యదర్శి రాంచంద్రారెడ్డి పాల్గొన్నారు.