విద్యార్థులు వ్యాపార రంగాల్లో నైపుణ్యం పెంపొందించుకుంటే కొత్త ఒరవడులను సృష్టించవచ్చని జేఎన్టీయూ హైదరాబాద్ వైస్ చాన్సలర్ కట్టా నర్సింహారెడ్డి అన్నారు. మండల పరిధిలోని చిలుకూరు రెవెన్యూలో గల అరిస్టాటిల్ పీజీ కళాశాలలో అంతర్జాతీయ వ్యాపార అభివృద్ధి-నైపుణ్యం అనే అంశంపై రెండు రోజులపాటు నిర్వహించే అంతర్జాతీయ సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిశోధన, మేనేజ్మెంట్ రంగాల్లో విద్యార్థులు వ్యాపార నైపుణ్యం పెంచుకుంటేనే నూతన ఆవిష్కరణలు, వ్యాపార విస్తరణకు నాంది పలుకడానికి అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు.
కొవిడ్-19 తరువాత ప్రపంచంలోనే వ్యాపార రంగం చాలా ఒడిదుడుకులను ఎదుర్కొందని చెప్పారు. దాన్ని అధిగమించడానికి మేనేజ్మెంట్ విద్యార్థులు తమ నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు తమ ఉన్నత విద్య పూర్తయిన తరువాత ఉపాధి పొందడం కాదని.. వ్యాపారాలను స్థాపించి నలుగురికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేస్థాయికి ఎదుగాలని చెప్పారు. ఇలాంటి అంతర్జాతీయ సదస్సులతో మంచి వ్యాపార నైపుణ్యాన్ని మెరుగుపర్చుకోవడంతోపాటు కొత్త విషయాలు, కొత్త పరిచయాలు పెరుగుతాయన్నారు. ఉన్నత విద్యను పూర్తి చేస్తున్న విద్యార్థులు ఓ లక్ష్యం పెట్టుకుని సమాజంలోకి అడుగుపెట్టాలని చెప్పారు. పెట్టుకున్న లక్ష్యం నెరవేరాలంటే భవిష్యత్ ప్రణాళికతో ముందుకు వెళ్లినప్పుడే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి అవకాశం ఉంటుందని తెలిపారు.
ఈ సందస్సుకు వివిధ దేశాల నుంచి 150 రీసెర్చ్ పేపర్లు, 250కి పైగా రిజిస్ట్రేషన్లు వచ్చాయి. ఈ సందర్భంగా సావనీర్ విడుదల చేశారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. సదస్సులో ఉస్మానియా యూనివర్సిటీ మేనేజ్మెంట్ విభాగాధిపతి శ్రీరాములు, అధ్యాపకుడు రమాల నాగేశ్వర్రావు, యూకో బ్యాంక్ చీఫ్ మేనేజర్ ప్రశాంత్రెడ్డి, కళాశాల చైర్మన్ కె.కృష్ణారెడ్డి, డైరెక్టర్ రోహిత్రెడ్డి, ప్రిన్సిపాల్ ఎల్.శ్రీనివాస్రెడ్డి, కేజీరెడ్డి కళాశాల ప్రిన్సిపాల్ జాగీర్దార్ పాల్గొన్నారు.