సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ/ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం జంట హత్యల కేసులో కీలక ఆధారాల కోసం పోలీసుల అన్వేషణ కొనసాగుతున్నది. సంఘటన తర్వాత స్థానికంగా వచ్చిన ఆరోపణలు, ఇతర అనుమానాలపై ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులకు దర్యాప్తులో ఎలాంటి ఆధారం లభించలేదు. దీంతో బుధవారం మరోసారి డాగ్ స్కాడ్, బాంబ్ స్కాడ్లను రంగంలోకి దింపి సంఘటన ప్రాంతంలో ఆధారాల కోసం అణువణువూ గాలించారు. ప్రాథమికంగా కర్ణంగూడలోని 18 ఎకరాల్లోని 8 ఎకరాలను వ్యవసాయ స్థలంగా మార్చి తిరిగి యజమానులకు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్న శ్రీనివాస్రెడ్డి, రాఘవేంద్రరెడ్డి స్థలం పక్కనే ఉన్న స్థల యజమాని మట్టారెడ్డి, మృతుడు శ్రీనివాస్రెడ్డి డ్రైవర్ కృష్ణ, అతని ప్రధాన అనుచరుడు హఫీజ్లను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకుని ఇంకా ప్రశ్నిస్తున్నారు. కేసును అతి త్వరగా ఛేదిస్తామని ధీమాతో ఉన్న పోలీసులు సరైన ఆధారాలు దొరకకపోవడంతో కొంత భంగపడ్డారు. దీంతో తేరుకున్న పోలీసులు మరికొన్ని కోణాల్లో దర్యాప్తును వేగవంతం చేశారు.
ఈ సంఘటనలో 7.65 ఎంఎం బుల్లెట్ను ఉపయోగించే తుపాకీ.. 12 బోరు బుల్లెట్ను ఉపయోగించే దేశవాళీ తుపాకీని దుండగులు ఉపయోగించినట్లు పోలీసులు ప్రాథమికంగా కొంత నిర్ధారణకు వచ్చారు. ఇలా రెండు తుపాకులతో దుండగులు వచ్చారని స్పష్టమవుతున్నది. మృతుల కారు డోర్ వెనకాల రక్తం ఎవరిది.. ఇలా అనేక వివరాలతో పోలీసులు, క్లూస్ అధికారులతో క్రైం సీన్ను రూపొందించుకున్నారు. అనుమానితుల ఫోన్ లొకేషన్లు.. ఇతర అంశాలను పోలీసులు విశ్లేషించుకున్నారు.
బుధవారం స్పెషల్ టీంలు బొంగుళూరు గేటు నుంచి కర్ణంగూడ గేటు వరకు సాగర్ రహదారిపై ఉన్న అన్ని సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తాలో అతి పెద్ద సీసీ కెమెరా ఉండటం వలన సీసీ టీవీ ఫుటేజీని కూడా పరిశీలించారు. అలాగే, ఎలిమినేడు వైపు నుంచి వచ్చే రోడ్డులో కూడా సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
లేక్విల్లా రిసార్ట్స్లో ప్లాట్లను కొనుగోలు చేసినవారు తమ పాట్లను కాపాడుకోవడం కోసం ఒక సంఘంగా ఏర్పడి గత సంవత్సర కాలంగా అనేక పాట్లు పడుతున్నారు. తమ ప్లాట్లను కొంతమంది అక్రమంగా ఆక్రమించుకుంటున్నారని గతంలో రాచకొండ కమిషనర్ను కలిసి స్వయంగా ఫిర్యాదు చేశారు. అలాగే, ఇబ్రహీంపట్నం పోలీస్స్టేషన్లో కూడా పలుమార్లు ఫిర్యాదు చేశారు. శ్రీనివాస్రెడ్డి తమ ప్లాట్లను అక్రమంగా ఆక్రమించుకుని వ్యవసాయభూమిగా మార్చుతున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలని పలుమార్లు పోలీసుల చుట్టూ తిరిగారు. అలాగే, ఇబ్రహీంపట్నానికి చెందిన కొంతమంది వ్యక్తులు ఇటీవల లేక్విల్లా ప్లాట్లల్లోనే కొన్నింటిని స్వాధీనం చేసుకుని తమను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ప్లాట్ల యాజమానులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పలువురిపై కేసు కూడా నమోదుచేశారు. ప్లాట్ల యజమానులు చాలా రోజుల తర్వాత తమ ప్లాట్ల వద్దకు రాకపోవడంతో ఈ సమస్యలు తలెత్తినట్లు స్థానికులు తెలిపారు. తాము ఫిర్యాదు చేసిన వెంటనే ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకుని ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదని ప్లాట్లు కొనుగోలు చేసిన వారు వాపోతున్నారు.
పోలీసులు ఇప్పుడు కర్ణంగూడ భూవివాదంతోపాటు శ్రీనివాస్రెడ్డి, రాఘవేంద్రరెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభం చేసినప్పటి నుంచి ఇప్పటివరకు వివాదాలు దారితీసిన అంశాలను ఆరా తీసి ప్రత్యర్థులు, బాధితుల నుంచి వివరాలను సేకరిస్తున్నారు. ఎవరెవరికి నేర చరిత్ర ఉంది.. శ్రీనివాస్రెడ్డి, రాఘవేంద్రరెడ్డి ఆర్థిక లావాదేవీలు ఇతర వ్యవహరాలకు సంబంధించిన లావాదేవీలు, బ్యాంక్ ఖాతాలు, మృతుల మొబైల్ ఫోన్లలోని సమాచారాన్ని పోలీసులు సేకరిస్తున్నారు. శ్రీనివాస్రెడ్డి కొనుగోలు చేసిన ఆస్తులను డ్రైవర్ కృష్ణ, హఫీజ్లను బినామీలుగా వాడుకుని వారి పేర్లపైనే చేయించేవారని తెలిసింది. శ్రీనివాస్రెడ్డి, రాఘవేందర్రెడ్డి హత్యలు కర్ణంగూడ సమీపంలోని భూములకు సంబంధించినవా.. లేక, నగరంతో పాటు నగరశివారుల్లో జరిగిన లావాదేవీలకు సంబంధించినవా అనే కోణంలో విచారణ వేగవంతం చేశారు.
కర్ణంగూడలో జరిగిన జంట హత్యలు సుపారీ గ్యాంగ్ పనిగా పోలీసులు భావిస్తున్నారు. ప్రొఫెషనల్ కిల్లర్లు ఈ హత్యల్లో పాల్గొని ఉంటారని భావిస్తూ పోలీసులు ఆవైపు విచారణను వేగవంతం చేశారు. సుపారీ గ్యాంగును ఎవరు పంపారనే దానిపై కూడా పోలీసులు దృష్టి సారించారు. గన్లు వాడటంలో అత్యంత చాకచక్యంగా ఉన్నవారిని ఈ హత్యలకు ఉపయోగించారు. హత్య చేసిన నిందితులు తుపాకులను అతి సమీపం నుంచి వాడారు. దీంతో గతంలో హత్యలు చేసినవారే సుపారీ తీసుకుని హత్య చేశారనే కోణంలో పోలీసులు దృష్టి సారించారు. రెండు రోజులుగా డబుల్ మర్డర్లపై రాచకొండ పోలీస్కు చెందిన క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్స్, మెటల్ డిటెక్టర్, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐదు టీంలు హత్యల కేసును ఛేదించడం కోసం పెద్దఎత్తున విచారణ కొనసాగిస్తున్నారు.
జంట హత్యల కేసులో సంఘటనా స్థలంలో సమీపంలో ఉన్న గుడిసెవాసులే ఇప్పుడు కీలకంగా మారారు. బీహార్ రాష్ర్టానికి చెందినవారు ఇక్కడ పలు పనుల నిమిత్తం గుడిసెలను వేసుకుని నివాసం ఉంటున్నారు. మొత్తం 15 కుటుంబాలు ఈ గుడిసెల్లో నివాసం ఉంటున్నాయి. మంగళవారం ఉదయం కాల్పులు జరిగినప్పుడు వీరిలో కొంతమంది గొడవను ప్రత్యక్షంగా చూశారని పోలీసులు తెలుసుకున్నారు. దీంతో వారి నుంచి వివరాలను రాబట్టేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం నుంచే పోలీసులు వారితో మాట్లాడినా.. వారు తాము ఏమీ చూడలేదని జవాబు రావడంతో పోలీసులు తలలు పట్టుకున్నారు. చివరకు బుధవారం వారందరినీ సీసీఎస్ కార్యాలయానికి తరలించి అక్కడ ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. వీరిలో ఓ కూలీ ఈ సంఘటనలో ఐదారుగురు ఉన్నారని చెప్పాడు. ఒక బైక్.. కారులో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి అక్కడక్కడ పరుగులు పెట్టిన దృశ్యాలను చూశామని.. కాని వారిని గుర్తుపట్టలేమని తేల్చిచెప్పినట్లు సమాచారం.
ఇబ్రహీంపట్నం/ఇబ్రహీంపట్నంరూరల్, మార్చి 3 : ఇబ్రహీంపట్నం సమీపంలోని కర్ణంగూడలో జరిగిన జంట హత్యల విషయంలో భూరికార్డుల అవకతవకలు జరిగాయనడంలో వాస్తవం లేదని ఇబ్రహీంపట్నం ఆర్డీవో వెంకటాచారి అన్నారు. బుధవారం ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. లేక్విల్లా రిసార్ట్స్ యాజమాన్యం కొనుగోలుచేసిన భూమికి, మృతులు శ్రీనివాస్రెడ్డి, రాఘవేందర్రెడ్డి అగ్రిమెంట్ చేసుకున్న భూమికి ఎలాంటి సంబంధం లేదన్నారు. మండల పరిధిలోని చర్లపటేల్గూడ గ్రామానికి చెందిన కంబాలపల్లి రమాదేవి, కంబాలపల్లి ఆండాళమ్మల సర్వే నంబర్ 1369, 1370, 1371, 1372లో పురుషోత్తంరెడ్డి, ఇంద్రారెడ్డి, శాంతకుమారి కలిసి గతంలో 58.04ఎకరాల భూమి కొనుగోలు చేశారని, ఇట్టిభూమిలో లేక్విల్లా రిసార్ట్స్కు 16.28ఎకరాలు మాత్రమే విక్రయించారని, మిగిలిన భూమిలో నుంచి ఈ నెల 2, 3 తేదీల్లో పురుషోత్తంరెడ్డి, శాంతకుమారి శ్రీనివాస్రెడ్డి డ్రైవర్ కృష్ణ పేరుపై 14.10 ఎకరాలు లీజ్ అగ్రిమెంట్ చేశారన్నారు. ఆ భూమిని శ్రీనివాస్రెడ్డి వ్యవసాయ భూమిగా మార్చుకుని వ్యవసాయం చేస్తున్నాడన్నారు. కాగా, మిగిలిన భూమి కొనుగోలుదారుల వద్దనే ఉందన్నారు. కాని, ఇంద్రారెడ్డి, పురుషోత్తంరెడ్డి, శాంతకుమారి పేర్లపై ఉన్న భూమి గతంలోనే విక్రయించగా భూరికార్డుల ప్రక్షాళనలో మళ్లీ వారిపేర్లు వచ్చాయని, ఆ భూమిని వీరికి విక్రయించడం వల్ల వివాదం తలెత్తి ఈ హత్యలకు దారితీసిందనడంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. లేక్విల్లా రిసార్ట్స్ యాజమాన్యం కొనుగోలు చేసిన 16.28 ఎకరాల భూమిపై ఆర్డీవో నుంచి కాని, తహసీల్దార్ నుంచి కాని వ్యవసాయేతర భూమిగా మార్చకుండానే ప్లాట్లుగా చేసి విక్రయించారని, ఇది చట్టరీత్యా నేరమన్నారు. దీనిపై విచారణ జరిపి లేక్విల్లా యాజమాన్యంపై తగు చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ తెలిపారు. ఈ భూమి కొంతభాగం ఇబ్రహీంపట్నం పెద్దచెరువు ఎఫ్టీఎల్లో ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని.. ఈ విషయంపై విచారణ జరిపి ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న ప్లాట్ల రిజిస్ట్రేషన్లను రద్దుచేస్తామని ఆర్డీవో తెలిపారు.