కేంద్ర ప్రభుత్వం యాసంగి వడ్లు కొనబోమని ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర సర్కార్ అన్నదాతలను అప్రమత్తం చేసింది. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులను చైతన్యపర్చేందుకు పడిన శ్రమ ఫలించింది. సీఎం కేసీఆర్ సూచనల మేరకు రైతన్నలు ఇతర పంటల వైపు మొగ్గు చూపారు. వ్యవసాయ శాఖ అధికారులు ఊరూరా తిరిగి ఆరుతడి పంటల సాగు విధానాలు, మెళకువలపై అవగాహన కల్పించారు. అధికారుల సలహాలు, సూచనల మేరకు మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను అధికంగా సాగు చేశారు. గత ఏడాది యాసంగిలో 1.15లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, ఈ యాసంగికి 23,766 ఎకరాలే సాగైంది. రంగారెడ్డి జిల్లాలో జొన్న, గోధుమ, శనగ, నువ్వులు, వేరుశనగ, పొద్దుతిరుగుడు, పెసర, మినుములు, మొక్కజొన్న, కంది, టమాట, మిరప, వంకాయ, బెండ వంటి పంటలను అధికంగా సాగు చేశారు. చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్ నియోజకవరాల్లో 55,105 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగైనట్లు అధికారులు పేర్కొంటున్నారు.
– షాబాద్, మార్చి 1
యాసంగి వరిపంట సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. వడ్లను కొనుగోలు చేయబోమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో వ్యవసాయశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో రైతు బంధు సమితి ప్రతినిధులతో కలిసి ఇతర పంటల సాగుపై గ్రామాలవారీగా రైతు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. వరికి బదులు ఆరుతడి పంటలు సాగు చేయాలని రైతులను ప్రోత్సహించారు. ఈ క్రమంలో అత్యధికంగా రైతులు వరిని పక్కన పెట్టి ఇతర పంటల సాగుపై దృష్టి సారించారు. యాసంగి వరిసాగు చేసే గడువు చివరి దశకు చేరుకోవడంతో సంబంధిత వ్యవసాయశాఖ అధికారులు రైతులు సాగుచేసిన పంటల వివరాల సేకరణ చేపట్టారు. ఆయా గ్రామాల్లో సర్వే నంబర్లవారీగా పంటల వివరాలను వ్యవసాయశాఖ విస్తరణ అధికారులు ఆన్లైన్లో నమోదు చేశారు. గతేడాది యాసంగి సీజన్లో 1.15లక్షల ఎకరాల్లో వరిసాగు చేయగా, ప్రస్తుతం 23,766 ఎకరాల్లో మాత్రమే వరిసాగు చేశారు. సగానికంటే ఎక్కువగా ఈసారి వరిసాగు తగ్గినట్లు అధికారులు చెబుతున్నారు.
రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్ నియోజకవర్గాల పరిధిలోని మండలాల్లో ఈ ఏడాది యాసంగి సీజన్లో 55,105 ఎకరాల్లో రైతులు వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు. అందులో 23,766వేల ఎకరాల్లో రైతులు వరిపంటను సాగుచేసినట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. గతేడాది యాసంగిలో 1.15లక్షల ఎకరాల్లో రైతులు వరిపంటను సాగు చేయగా, ఖరీఫ్లో 1.70లక్షల ఎకరాల్లో సాగు చేశారు. యాసంగిలో పండించిన వడ్లు కొనుగోలు చేసేది లేదని కేంద్రం తేల్చిచెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఇతర పంటల వైపు మళ్లించేందుకు చేసిన ప్రయత్నం ఫలించింది. అధికారులు ఊరూరా చేపట్టిన అవగాహన కార్యక్రమాలతో రైతుల్లో చైతన్యం కనిపించింది. రైతులు మార్కెట్లో డిమాండ్ ఉన్న ఇతర పంటలను ఎంచుకున్నారు.
యాసంగిలో వరికి బదులు ఇతర పంటలు సాగు చేయాలని తెలంగాణ ప్రభుత్వం పక్కా ప్రణాళికలు రూపొందించింది. ఆ మేరకు జిల్లాలో రికార్డు స్థాయిలో వరిసాగు తగ్గించి ఇతర పంటల వైపు మొగ్గుచూపారు. నాడు జిల్లాలో అత్యధికంగా సాగయ్యే పంటనే రైతులు ఈ యాసంగిలో వేసేందుకు ఆసక్తి చూపారు. ప్రస్తుత సీజన్లో మిశ్రమ పంటలకు రైతులు ప్రాధాన్యమిచ్చారు. వరిసాగు చేస్తే నష్టపోతామని భావించిన రైతులు అధికారుల సూచనల మేరకు ఇతర పంటలను సాగు చేస్తున్నారు. జొన్న, గోధుమ, శనగ, నువ్వులు, వేరుశనగ, పొద్దుతిరుగుడు, పెసర, మినుములు వంటి పంటలను మిశ్రమంగా సాగు చేశారు. అదేవిధంగా మరికొంత మంది రైతులు మక్కజొన్న, కంది పంటలతోపాటు కూరగాయ పంటలైన టమాట, మిరప, వంకాయ, బెండ పంటలను సాగు చేస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఈ పంటల సాగులో మంచి లాభాలు వస్తున్నాయని రైతులు చెబుతున్నారు.
– గీతారెడ్డి, రంగారెడ్డి జిల్లా వ్యవసాయశాఖాధికారి
జిల్లాలో రైతులు ఈ యాసంగి సీజన్లో వరికి బదులుగా ఇతర ఆరుతడి పంటలు సాగు చేశారు. ప్రభుత్వ ఆదేశానుసారం గ్రామాల్లో రైతు బంధు సమితి సభ్యులతో కలిసి ఆరుతడి పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాం. గతేడాది యాసంగిలో జిల్లావ్యాప్తంగా 1.15లక్షల ఎకరాల్లో వరిసాగు చేయగా, ఈ ఏడాది ఇప్పటివరకు 23,766 ఎకరాల్లో మాత్రమే వరిసాగయ్యింది. పంట మార్పిడిపై గ్రామాల్లో రైతులకు విసృత్తంగా అవగాహన కల్పించడంతో ఆరుతడి పంటలపై రైతులు దృష్టి సారించారు.
– అంజయ్య, రైతు, రేగడిదోస్వాడ
యాసంగిలో వరిపంటను పక్కన పెట్టి ఆరుతడి పంటలు సాగు చేస్తున్నాను. టమాట, మిరప, క్యారెట్ పంటలు వేశాను. ప్రస్తుతం పంట దిగుబడి వస్తున్నది. తక్కువ పెట్టుబడితో పంటలు సాగు చేశాను. మార్కెట్లో నేను వేసిన పంటలకు మంచి డిమాండ్ ఉంది. సీఎం కేసీఆర్ సూచించిన విధంగా వరికి బదులుగా ఇతర పంటలు సాగుచేసుకుని మంచి లాభాలు పొందుతున్నాం.