పారిస్: ఫ్రాన్స్లో దావానలం(France Wildfires) వ్యాపిస్తున్నది. క్యాప్ ఫెర్రట్ ద్వీపకల్పంలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో అక్కడ ఉన్న వందలాది మందిని బోట్లలో సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నారు. బోర్డియాక్స్కు పశ్చిమంగా ఉన్న టూరిస్టు స్పాట్ నుంచి ఇప్పటికే వేల సంఖ్యలో జనాన్ని మరో ప్రాంతానికి తరలించారు. గిరోండే ప్రాంతంలో ఎగిసిపడుతున్న అటవి మంటల్ని ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది గత కొన్ని రోజుల నుంచి ప్రయత్నిస్తున్నది. సౌమోస్ ప్రాంతంలో మంగళవారం అటవీ మంటలు వ్యాపించాయి. అక్కడ కార్చిచ్చు వల్ల ఇప్పటికే సుమారు 21 వేల ఎకరాల అటవీ దగ్దమైంది. క్యాప్ ఫెర్రట్ ద్వీపకల్పం నుంచి ఇప్పటికే 4 వేల మందిని తరలించినట్లు ఫ్రెంచ్ మంత్రి లారెంట్ నూనెజ్ తెలిపారు. సుమారు 80 ఇండ్లు దగ్ధం అయ్యాయి. మరో 50 ఇండ్లు ధ్వంసం అయ్యాయి. మరో వైపు స్పెయిన్లో జాతీయ ఎమర్జెన్సీ ప్రకటించారు. దేశ రాజధాని మాడ్రిడ్కు సమీపం వరకు కూడా మంటలు కనిపిస్తున్నాయి.