రాష్ర్టావతరణ ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. మంగళవారం రంగారెడ్డి జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో శేరి లింగంపల్లి, ఎల్బీ నగర్లోని ఆటోనగర్, మహేశ్వరంలోని ఫ్యాబ్ సిటీ, షాద్నగర్ పరిధిలోని కొత్తూరు, రాజేంద్రనగర్లోని కాటేదాన్, చేవెళ్ల పరిధిలోని చందనవెల్లిలో పారిశ్రామిక ప్రగతి వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఇందులో భాగంగా మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపాలిటీ ఫ్యాబ్సిటీలో జరిగిన కార్యక్రమంలో మంత్రి సబితారెడ్డి పాల్గొని జ్వోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించి మాట్లాడారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో పారిశ్రామిక ప్రగతిలో రంగారెడ్డి జిల్లా ముందంజలో ఉందన్నారు. పలుచోట్ల జరిగిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, సుధీర్రెడ్డి, ప్రకాశ్ గౌడ్, అంజయ్య యాదవ్, కాలె యాదయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు టీఎస్-ఐ పాస్ చట్టంపై అవగాహన కల్పించారు. జిల్లాలో ప్రత్యేకంగా నిలిచిన పలు పరిశ్రమల నిర్వాహకులకు కలెక్టర్ హరీశ్ మహేశ్వరంలో అవార్డులను అందజేశారు.
బడంగ్పేట, జూన్ 6 : ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో పారిశ్రామిక ప్రగతిలో రంగారెడ్డి జిల్లా ముందంజలో ఉందని, అన్ని రంగాల్లో సమ్మిళిత అభివృద్ధితో దేశంలోనే నంబర్ వన్గా తెలంగాణ ఉందని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పారిశ్రామిక శాఖ ఆధ్వర్యంలో మంగళవారం తుక్కుగూడ మున్సిపాలిటీ ప్యాబ్సిటీలో జరిగిన పారిశ్రామిక ప్రగతి కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు స్టాళ్లను, ఫొటో ఎగ్జిబిషన్ను తిలకించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ స్వరాష్ట్రంలో గడిచిన తొమ్మిదేండ్ల కాలంలో పారిశ్రామిక రంగంలో ప్రభుత్వం సింగిల్ విండో విధానం ద్వారా అందిస్తున్న తోడ్పాటు, సులభతరంగా అనుమతుల మంజూరు తదితర అంశాలను ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు విశదపరిచారు.
టీఎస్-ఐపాస్ ద్వారా..
పరిశ్రమలు నెలకొల్పే వారికి అనుకూలంగా ఉండేలా ప్రభుత్వం టీఎస్-ఐపాస్ ద్వారా సరళీకృత విధానాలను అమలు చేస్తుండడంతో రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి గణనీయంగా వృద్ధి చెందుతున్నదని మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. పరిశ్రమల స్థాపనకు తెలంగాణ స్వర్గధామంగా మారిందని మంత్రి హర్షతిరేకాలు మధ్య వ్యక్తం చేశారు. ప్రభుత్వ సరళీకృత విధానాలకు పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేదని, పవర్ హాలీడేలతో అనేక పరిశ్రమలు మూతబడ్డాయని సమైక్య పాలన నాటిదైన్య స్థితిని మంత్రి గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశ్రమల అనుమతుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే నిర్ధిష్ట గడువులోపు అనుమతులు మంజూరు చేసేలా చర్యలు తీసుకున్నారని తెలిపారు. మరో ఐటీ హబ్గా మహేశ్వరం మారబోతున్నదని ఆమె పేర్కొన్నారు. ఇప్పటికే 50 కంపెనీలకు పైగా వచ్చాన్నారు. ఈ ప్రాంత్ర యువతీ యువకులకు ఉదోగ్యాలు లభించే అవకాశాలు మెరుగుపడే అవకాశం ఉందన్నారు.
వెంటనే అనుమతులు మంజూరు
కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ టీఎస్-ఐపాస్ ద్వారా పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చే వారికి వెంటనే అనుమతులు మంజూరు చేస్తామన్నారు. ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అనుమతులు అందిస్తున్నదని తెలిపారు. కొంగర్కలాన్లో ఫాక్స్ కాన్ టెక్నాలజీస్ ప్లాంట్ ఏర్పాటు కోసం భూమిపూజ చేసినట్లు తెలిపారు. ఫాక్స్ కాన్ సంస్థ తన ఉత్పత్తులను ప్రారంభించడం ఎలక్ట్రానిక్స్ రంగంలో దేశంలోకి వచ్చిన అతి పెద్ద పెట్టుబడుల్లో ఇది అత్యంత కీలకమైనదన్నారు. అనంతరం పారిశ్రామిక రంగంలో అభివృద్ధి సాధిస్తున్న పలువురు పారిశ్రామిక వేత్తలకు శాలువాలు కప్పి మెమోంటోలు అందించి మంత్రి సన్మానించారు. అంతర్జాతీయ పెట్టబడులు రావడంతో మహేశ్వరం ప్రాంతం వేగంగా అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. తద్వారా ప్రజలకు ఉపాది అవకాశాలు మెరుగుపడుతాయన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్, జడ్పీ చైర్పర్సన్ తీగల అనితాహరినాథ్రెడ్డి, పరిశ్రమల శాఖ జిల్లా జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, తుక్కుగూడ మున్సిపల్ కమిషనర్ వెంకట్రామ్, మున్సిపల్ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
మరో హైటెక్ సిటీగా మహేశ్వరం
మరో హైటెక్సిటీని తలపించే విధంగా మహేశ్వరం మారుతున్నదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రోడ్లు, రవా ణా వసతిని మెరుగుపరుస్తూ, నీటి సౌకర్యం, 24 గంటల నాణ్యమైన విద్యుత్ శాంతి భద్రతల నెలకొని ఉండేలా పోలీసింగ్ వ్యవస్థను మెరుగుపర్చినట్లు తెలిపారు. ఫలితంగా తొ మ్మిదేండ్ల స్వల్ప వ్యవధిలోనే తెలంగాణలో మూడు లక్షల కోట్ల పెట్టుబడులతో 20వేల కంపెనీలు నెలకొల్పారని వివరించారు. తద్వారా 24 లక్షల మందికి కొత్తగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయని మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన గూగుల్, అమెజాన్, మైక్రోసాప్ట్ వంటి దిగ్గజ కంపెనీలన్నీ తమ ముఖ్య కార్యాలయాలను హైదరాబాద్లో ఏర్పాటు చేశాయన్నారు. 2014 లో ఐటీ ఎగుమతులు రూ. 57 వేల కోట్లకు పరిమితమై ఉండగా, ప్రభుత్వ కృషితో ప్రస్తుతం రూ.2.44 లక్షల కోట్ల కు చేరాయని నాలుగింతలు వృద్ధి చెందాయన్నారు.