రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా శశాంక గురువారం బాధ్యతలు స్వీకరించగా.. అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. 2013వ బ్యాచ్ ఐఏఎస్కు చెందిన ఆయన మహబూబాబాద్ జిల్లా నుంచి బదిలీపై ఇక్కడికి వచ్చారు. వివాదరహితుడు అని, ప్రభుత్వ సంబంధిత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో శశాంక తనదైన మార్క్ను ప్రదర్శిస్తారన్న మంచి పేరు ప్రజల్లో ఉన్నది.
మహబూబాబాద్ జిల్లా కలెక్టర్గా పనిచేసిన సమయంలో శశాంక పోడు పట్టాల భూముల పంపిణీలో తనదైన పాత్ర పోషించారు. 2022లో భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగి రాకపోకలకు అంతరాయం కలిగిన సందర్భంలో గర్భిణులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ముందుగానే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడంలోనూ తనదైన శైలిలో చొరవ చూపారు.
రంగారెడ్డి జిల్లాలో కలెక్టర్గా విధులు నిర్వర్తించడం కత్తిమీద సాము లాంటిదే. నిబద్దత అధికారిగా మంచి పేరు ఉన్నవారు సైతం వివాదాస్పద అంశాల్లో ఇరుక్కుని అనతికాలంలోనే బదిలీపై వెళ్తున్నారు. ఏడాది క్రితం కలెక్టర్గా ఇక్కడకు వచ్చిన హరీశ్పై ఇటీవల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న కారణంతో ఆయనపై బదిలీ వేటు పడింది.
ఆయన స్థానంలో భారతీ హోళీకేరీకి ప్రభుత్వం కలెక్టర్గా బాధ్యతలు అప్పగించింది. అక్టోబర్ 13న ఆమె కలెక్టర్గా బాధ్యతలు తీసుకోగా ధరణి పోర్టల్లో వెలుగుజూసిన అక్రమాల నేపథ్యంలో ఆమెపై కూడా బదిలీ వేటు పడింది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా విధులు నిర్వర్తించిన 73 రోజుల వ్యవధిలోనే ఆమెపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఆ తర్వాత మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ పోట్రుకు ఇటీవలే పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించిన ప్రభుత్వం.. తాజాగా శశాంకకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ బాధ్యతలను అప్పగించింది.
ఇటీవల ధరణి పోర్టల్ అక్రమాల అంశం జిల్లాకు మాయని మచ్చగా ఉండిపోయింది. హైదరాబాద్ నగరంతో పోటీపడుతున్న రంగారెడ్డి జిల్లాలో భూముల ధరలు పెరగడంతో కబ్జాలు, ఇతరత్రా అక్రమాలు సైతం పెద్దఎత్తున చోటు చేసుకుంటున్నాయి. భూదాన్, వక్ఫ్ భూములు, దేవాదాయ శాఖ, అసైన్డ్ భూముల అన్యాక్రాంతం వంటివి పరిష్కరించడం కలెక్టర్ ముందున్న పెద్ద సవాలే. రాజకీయపరమైన ఒత్తిళ్లను ఎదుర్కొని ముందుకు సాగడం కత్తిమీద సామే.. త్వరలోనే పార్లమెంట్ ఎన్నికలు జరగనుండడం.. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలను సక్సెస్ చేయడం వంటి గురుతర బాధ్యతలు ప్రస్తుత కలెక్టర్పై ఉన్నాయి.
రంగారెడ్డి కలెక్టర్గా కె.శశాంక గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్కు వచ్చిన నూతన కలెక్టర్కు అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన శశాంకకు ఇన్చార్జి కలెక్టర్గా ఉన్న మేడ్చల్ కలెక్టర్ గౌతమ్ పోట్రు, అదనపు కలెక్టర్లు భూపాల్ రెడ్డి, ప్రతిమాసింగ్, జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది మర్యాదపూర్వకంగా పూల బొకేలు అందించారు.