బొంరాస్పేట : యాసంగిలో రైతులు వరి పంటలు సాగు చేయరాదని ఇతర పంటలను సాగు చేయాలని జిల్లా వ్యవసాయాధికారి గోపాల్ అన్నారు. మంగళవారం మండలంలోని బురాన్పూర్లో ప్రత్యామ్నాయ పంటల సాగుపై ఆయన రైతులకు అవగాహన కల్పించారు. యాసంగిలో సాగు చేసే ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనబోమని తేల్చి చెప్పడంతో రైతులు వరిసాగును మానుకోవాలని సూచించారు. యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా ఉండవన్నారు. వరికి బదులుగా రాగులు, పెసర, వేరుశనగ, మినుములు, బెబ్బెర్లు వంటి పంటలను రైతులు సాగు చేసుకోవాలని మినుములను పండిస్తే ప్రభుత్వం వాటిని కొనుగోలు చేస్తుందని డీఏవో అన్నారు.
ఒక ఎకరా వరి పంటను పండించే నీటితో మూడు ఎకరాల ఆరుతడి పంటలను సాగు చేయవచ్చని, ఆరుతడి పంటలతో లాభాలు ఉంటాయన్నారు. ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసుకునే రైతులకు విత్తనాలను అందుబాటులో ఉంచుతున్నామని గోపాల్ అన్నారు. చెరువుల కింద రైతులు వరిసాగు చేస్తే సన్న రకాలను సాగు చేసుకోవాలని వాటిని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయరాదని, మిల్లింగ్ చేసుకుని బియ్యం అమ్ముకుంటే రైతులకు లాభదాయకంగా ఉంటుందన్నారు. బోర్ల కింద మాత్రం ఎట్టి పరిస్థితులలో వరి సాగు చేయరాదని డీఏవో గోపాల్ స్పష్టం చేశారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన..
మండలంలోని బురాన్పూర్, నాగిరెడ్డిపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను డీఏవో గోపాల్ సందర్శించి ధాన్యం కొనుగోళ్లను, తేమ శాతాన్ని పరిశీలించారు. తూకం చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని సూచించారు. రైతుల ఆధార్కార్డులను యంత్రాల్లో నమోదు చేస్తే రైతులకు ఓటీపీ నంబరు వెళ్తుందని, కానీ వివరాలు మాత్రం డిస్ప్లే కావడం లేదని, దీనివల్ల జాప్యం జరుగుతుందని కొందరు రైతులు డీఏవో దృష్టికి తెచ్చారు. స్పందించిన గోపాల్ వెంటనే పౌర సరఫరాల శాఖ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు.
బురాన్పూర్ కొనుగోలు కేంద్రం పరిధిలోకి దుప్చెర్ల గ్రామాన్ని చేర్చడం వల్ల కేంద్రంలో ధాన్యం ఎక్కువగా వచ్చి రద్దీ పెరిగిందని, దుప్చెర్ల గ్రామాన్ని బొంరాస్పేట కేంద్రం పరిధిలోకి మార్చాలని ఎంపీటీసీ సుదర్శన్రెడ్డి, రైతులు డీఏవోను కోరారు. కార్యక్రమంలో మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు మహేందర్రెడ్డి, ఏవో రాజేశ్కుమార్, ఏఈవో భార్గవి పాల్గొన్నారు.