తెలంగాణ సర్కార్ అన్ని మతాల పండుగలకు సమ ప్రాధాన్యమిస్తూ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది. పేదలు పండుగలను సంతోషంగా జరుపుకోవాలన్న ఉద్దేశంతో ఏటా బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్ కానుకలను పంపిణీ చేస్తున్నది. ఇందులోభాగంగా ఈ నెల 22వ తేదీన రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని నిరుపేద ముస్లింలకు రంజాన్ కిట్ల పంపిణీకి అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఇప్పటికే వికారాబాద్ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు 8500 రంజాన్ గిఫ్ట్ ప్యాక్లు చేరుకోగా.. త్వరలోనే ఎమ్మెల్యేలు వాటిని లబ్ధిదారులకు అందజేయనున్నారు. అంతేకాకుండా జిల్లాలోని 17 మసీదుల్లో ఇఫ్తార్ విందులు ఏర్పాటుకు ప్రభుత్వం రూ.17 లక్షలను విడుదల చేసింది.
-బొంరాస్పేట, ఏప్రిల్ 14
బొంరాస్పేట, ఏప్రిల్ 14 : బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని మతాల పండుగలను సమానంగా గౌరవిస్తున్నది. పండుగలను పేదలు సంతోషంగా జరుపుకోవాలన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కొన్నేండ్ల నుంచి బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్ పండుగలకు పేదలకు దుస్తులను పంపిణీ చేస్తున్నారు. పండుగలకు కొన్ని రోజుల ముందు ప్రజాప్రతినిధులు, అధికారులు వీటిని పేదలకు పంపిణీ చేస్తుంటారు. ఇందులో భాగంగా ఈ నెల 22వ తేదీన జరుపుకునే రంజాన్ పర్వదినాన్ని పుర్కరించుకుని నిరుపేద ముస్లింలకు ఈ ఏడాది పంపిణీ చేసే రంజాన్ కానుకలు మండల కేంద్రాలకు చేరాయి. వికారాబాద్ జిల్లాలోని వికారాబాద్, తాండూరు, కొడంగల్, పరిగి నియోజకవర్గాలకు ప్రభుత్వం 8500 రంజాన్ గిఫ్ట్ ప్యాక్లను కేటాయించింది. ఇటీవల జిల్లా కేంద్రానికి చేరుకున్న ఈ ప్యాక్లను జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులు నియోజకవర్గాలకు తరలించారు. నియోజకవర్గ కేంద్రాల నుంచి మండలాలకు అధికారులు తరలించారు. త్వరలో వీటిని ఎమ్మెల్యేల చేతుల మీదుగా పేదలకు పంపిణీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా జిల్లాలోని 17 మసీదుల్లో ఇఫ్తార్ విందులు ఇవ్వడానికి ఒక్కో మసీదుకు రూ.లక్ష చొప్పున 17 మసీదులకు ప్రభుత్వం రూ.17 లక్షలను విడుదల చేసింది.
జిల్లాకు 8500 గిఫ్ట్ ప్యాక్లు
వికారాబాద్ జిల్లాకు ప్రభుత్వం ఈ ఏడాది 8500 రంజాన్ గిఫ్ట్ ప్యాక్లను కేటాయించింది. తాండూరు నియోకవర్గానికి 2500, వికారాబాద్ నియోజకవర్గానికి 2500, పరిగి నియోజకవర్గానికి 2000, కొడంగల్ నియోజకవర్గానికి 1500 గిఫ్ట్ ప్యాక్లను ప్రభుత్వం కేటాయించింది. అదేవిధంగా రంజాన్ పండుగను పురస్కరించుకుని జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల పరిధిలోని 17 మసీదుల్లో ఇఫ్తార్ విందుల నిర్వహణకు ప్రభుత్వం రూ.17 లక్షలను విడుదల చేసింది. తాండూరు నియోజకవర్గంలోని 5 మసీదులకు రూ.5 లక్షలు, వికారాబాద్ నియోజకవర్గంలోని 5 మసీదులకు రూ.5 లక్షలు, పరిగి నియోజకవర్గంలోని 4 మసీదులకు రూ.4 లక్షలు, కొడంగల్ నియోజకవర్గంలోని 3 మసీదులకు రూ.3 లక్షలను ఇఫ్తార్ విందుల నిర్వహణ కోసం ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిధులను మసీదు కమిటీల ఖాతాల్లో జమచేస్తారు. తాసిల్దార్లు ఒక్కో మసీదు పరిధిలో 500 మంది పేదలను గుర్తించి వారికి రంజాన్ గిఫ్ట్లను పంపిణీ చేస్తారు. అదేవిధంగా ఇఫ్తార్ విందులో పాల్గొనే విధంగా చర్యలు తీసుకుంటారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసే ఒక్కో రంజాన్ గిఫ్ట్ ప్యాక్లలో ఒక చీర, జాకెట్, పంజాబీ డ్రెస్ మెటీరియల్, లాల్చీ పైజామలను ప్యాక్ చేశారు.
అధికారులతో కమిటీ
రాష్ట్ర ప్రభుత్వం, మైనార్టీ సంక్షేమశాఖ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం రంజాన్ కానుకల పంపిణీకి పేదలను గుర్తించడానికి, వాటిని సజావుగా పంపిణీ చేసేందుకు, ఇఫ్తార్ విందుల నిర్వహణకు మసీదులను ఎంపిక చేయడానికి కలెక్టర్ ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అదనపు కలెక్టర్ చైర్మన్గా, జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి కన్వీనర్గా, ఆర్డీవోలు సభ్యులుగా, తాసిల్దార్లు ప్రత్యేక అధికారులుగా కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ నిరుపేదలను గుర్తించి వారికి కానుకలను పంపిణీ చేయడానికి చర్యలు తీసుకుంటారు.
నియోజకవర్గాలకు తరలించాం
ఈ ఏడాది వికారాబాద్ జిల్లాకు ప్రభుత్వం 8500 రంజాన్ గిఫ్ట్ ప్యాక్లను కేటాయించింది. వీటిని జిల్లాలోని నాలుగు నియోజకవర్గ కేంద్రాలకు తరలించాం. అధికారులు పేదలను గుర్తించి వారికి ఎమ్మెల్యేల చేతుల మీదుగా త్వరలో వీటిని పంపిణీ చేస్తారు. అదేవిధంగా ఇఫ్తార్ విందుల నిర్వహణ కోసం జిల్లాలోని 17 మసీదులకు రూ. లక్ష చొప్పున రూ.17 లక్షలను విడుదల చేసింది. వీటిని కూడా మసీదు కమిటీల ఖాతాల్లో జమచేస్తాం.
-సుధారాణి, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి