రంగారెడ్డి, జూలై 12, (నమస్తే తెలంగాణ) : జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. రానున్న 12 గంటల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో జిల్లా యంత్రాంగం ప్రజలను అప్రమత్తం చేస్తున్నది. అవసరమైతే తప్ప బయటకు రావద్దని, వాగులు, వరదల వద్ద నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని అధికారులు సూచిస్తున్నారు. సోమవారం నుంచి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కంట్రోల్ రూం కొనసాగుతున్నది. వర్షాలు, వరదలతో జిల్లాలోని ప్రజానీకానికి ఇబ్బందులు ఏర్పడితే సహాయం నిమిత్తం కలెక్టరేట్లో 23235642, 23235643 టోల్ ఫ్రీ నంబర్లను ఏర్పాటు చేశారు.
మరోవైపు జిల్లావ్యాప్తంగా మేఘావృతమై నిరాంతరాయంగా వర్షం కురుస్తూనే ఉంది. జిల్లా అంతటా ఎడతెరపి లేకుండా ముసురు వాన కురుస్తున్నది. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలో నాలుగు ఇండ్లు పూర్తిగా నేలమట్టంకాగా, మరో 16 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఎవరికీ ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోలేదని అధికారులు వెల్లడించారు. వర్షాలతో మూడు బర్రెలు మృత్యువాత పడినట్లు అధికారులు తెలిపారు.
మొయినాబాద్ వద్ద గండిపేట చెరువులోకి ప్రవహిస్తున్న వరదనీరు