సిటీబ్యూరో, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): చినుకుపడితే చాలు గ్రేటర్లో చీకట్లు అలుముకుంటున్నాయి. గాలివానకు తరచూ విద్యుత్ అంతరాయాలు ఏర్పడుతున్నాయి. నగర శివారు ప్రాంతాల్లో అడుగడుగునా కరెంట్ పోతే.. నగరం నడిమధ్యలో ఉన్న పలు కాలనీల్లో గంటల తరబడి సరఫరా నిలిచిపోతున్నది. పునరుద్ధరణ విషయంలో ఎక్కువ సమయం పట్టడంతో రాత్రంతా జాగారం చేయాల్సిన పరిస్థితి ఉంటున్నదని పలు కాలనీల వాసులు సోషల్మీడియాలో డిస్కం అధికారులపై మండిపడుతున్నారు. సాయంత్రం నుంచి రాత్రి వరకు కురిసిన వర్షాలకు చాలా చోట్ల ఫీడర్లు బ్రేక్డౌన్లు అవుతుండటంతో వాటిని మరమ్మతులు చేసే క్రమంలో కొన్ని చోట్ల సిబ్బంది వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పనిచేస్తుంటే.. మరికొన్ని చోట్ల కొందరు తమకేం పట్టనట్లు వ్యవహరిస్తున్నారం టూ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
క్షేత్రస్థాయి సిబ్బంది సరిపడా లేక..
క్షేత్రస్థాయి సిబ్బంది సరిపడా లేకపోవడం, ఒకవేళ ఉన్నా కొన్నిచోట్ల వర్షంలో స్తంభాలు ఎక్కడానికి ముందుకు రాకపోవడం, ఒక్కో ఫీడర్ కిలోమీటర్ పొడవు ఉండడంతో సమస్య ఎక్కడ తలెత్తిందో గుర్తించడంలో జాప్యం జరుగుతున్నదని విద్యుత్ అధికారులు చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరించకుండానే మరమ్మతులు పూర్తయినట్లు ఇంజినీర్లు చెప్పడంతో అటువంటి పరిస్థితుల్లో ఫీడర్ ఔట్ మేనేజ్మెంట్ సిస్టం ఎందుకు రెడ్మార్క్ చూపిస్తున్నదంటూ ఉన్నతాధికారులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది.
సరఫరా పునరుద్ధరణలో నిర్లక్ష్యం..!
కరెంట్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితిలో హైదరాబాద్ సెంట్రల్తో పాటు పలు సర్కిళ్ల పరిధిలోని వినియోగదారులు బిక్కుబిక్కుమంటూ కాలంగడిపారు. మూడునాలుగు రోజుల నుంచి కురిసిన వర్షాల కారణంగా కరెంట్ సరఫరా లేక కాలనీలు, బస్తీల్లో చాలామంది ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మింట్కాంపౌండ్లోని టీజీఎస్పీడీసీఎల్ ప్రధానకార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న కాలనీలలో కూడా గంటలకొద్దీ కరెంట్ పోవడంతో ప్రజలు నరకయాతన అనుభవించారు.
సైఫాబాద్ సబ్ డివిజన్ రాష్ట్రంలోనే కీలకమైన విద్యుత్ విభాగాల్లో ఒకటి కాగా సెక్రటరియేట్, శాసనసభ, విద్యుత్ సౌధ తదితర కార్యాలయాలన్నీ ఈ సబ్డివిజన్లోనే ఉండగా తరచూ అంతరాయాలతో వినియోగదారులలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. సీఎం డీ జితేష్వీపాటిల్ ఈ ప్రాంతంలో పర్యటించి పరిస్థితులను సమీక్షించినా క్షేత్రస్థాయిలో ఎలాంటి మార్పులు లేవని స్థానికులు చెప్పారు. విపత్తులు తలెత్తినప్పుడు అన్ని విభాగాలు కలిసి యుద్ధప్రాతిపదికన చేయాలిన పనులను ఆయా డివిజన్లలో విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యంతో సరఫరా పునరుద్దరణలో ఆలస్యంతో వినియోగదారులు కరెంటు లేక నానాపాట్లు పడ్డారు. విపత్తుల సమయంలో అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలి. కానీ ఈ వారంలో కురిసిన గాలివానల సమయంలో దెబ్బతిన్న ప్రాంతాల్లో డిస్కం పరంగా ఇవేవీ కనిపించలేదు.
అవసరమైతే సమీప డివిజన్లు, సర్కిళ్ల నుంచి సిబ్బందిని వినియోగించుకోవలసిన చోట తమ సిబ్బందితోనే అవసరమైనంత మేర పనిచేద్దామనుకున్న అధికారులు ఆ పనులు ముందుకుసాగకవినియోగదారులను ఇబ్బందులకు గురిచేశారు. ఇదిలా ఉంటే ఫిర్యాదుల కోసం టీజీఎస్పీడీసీఎల్ వినియోగదారులకు విద్యుత్ హెల్ప్లైన్ నెంబర్ 1912 ఏర్పాటు చేసింది. దక్షిణ డిస్కం పరిధిలోని వినియోగదారులు తమ ఫిర్యాదులను ఈ నెంబర్కు కాల్ చేసి చెబుతారు. స్కాడా ఆధ్వర్యంలో పనిచేసే ఈ హెల్ప్లైన్ కేంద్రంలో పరిమిత సంఖ్యలోనే సిబ్బంది ఉండడంతో గాలివానతో అంతరాయాలు ఏర్పడితే లైన్లు కలవడం లేదనే ఫిర్యాదులు వినియోగదారులనుంచి ఎక్కువగా వస్తున్నాయి. లైన్లు కలిసి ఫిర్యాదు చేసిన వినియోగదారుల అనుభవం మరోలా ఉంది. తమ ఫిర్యాదు పరిష్కా రం కాకముందే పరిష్కారమైనట్లు మొబైల్కు మెసేజ్లు వస్తున్నాయని పలువురు వినియోగదారులు చెబుతున్నారు.
అంధకారంలో మగ్గాల్సిందే..
నగరంలో ఈనెల 3న రాత్రి కురిసిన వర్షానికి పలుచోట్ల చెట్లు కూలడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. కరెంటు తీగలు తెగిపడటంతో కాలనీల్లో అంధకారం అలుముకున్నది. వర్షానికి మూసారాంబాగ్ శాలివాహననగర్లో 14 గంటలపాటు విద్యుత్ సరఫరా లేదు. సరఫరా పునరుద్ధరణకు ఇంత సమయమా అంటూ వినియోగదారులు, స్థానికులు మండిపడ్డారు. రెండు నెలల కిందట జూన్ 9,12 తేదీల్లో ఈదురుగాలులు, భారీ వర్షం కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. హైదరాబాద్ సెంట్రల్ సర్కిల్ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో గంటల కొద్దీ కరెంట్ పోగా, మరికొన్ని చోట్ల రోజున్నర పాటు అంధకారంలో మగ్గాల్సిన పరిస్థితి వచ్చింది. ఎస్పీడీసీఎల్ సిబ్బంది మాత్రం సరఫరా పునరుద్ధరణలో నిర్లక్ష్యంగా ఉండడమే ఇందుకు కారణమని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.