మొయినాబాద్, మే 26 : ఖరీఫ్ పంటల సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు రైతులు దుక్కులు దున్ని పొతం చేస్తున్నారు. విత్తనాలు విత్తేందుకు పెట్టుబడులు కూడా రెడీగా ఉంచుకున్నారు. జూన్ మొదటి వారంలో నైరుతి రుతుపవనాలు వస్తాయని సకాలంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. సకాలంలో వర్షాలు కురిస్తే రైతులు పత్తి, మక్కతో పాటు ఇతర విత్తనాలు విత్తడానికి సమాయత్తమవుతున్నారు. చాలా మంది రైతులు ఇప్పటి నుంచే తమకు కావాల్సిన కంపెనీ విత్తనాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
దీంతో పలువురు వ్యాపారులు ఆ విత్తనాల లభ్యత తక్కువగా ఉందంటూ ఎక్కువ మొత్తంలో వసూలు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇలాంటి వదంతులు వస్తున్న నేపథ్యంలో అధికారులు ముందుగానే అప్రమత్తమై చేవెళ్ల డివిజన్లోని వివిధ ఫెర్టిలైజర్ దుకాణాల్లో తనిఖీలు చేయడం ప్రారంభించారు. ఆయా దుకాణాల్లో విత్తనాల నాణ్యతను పరిశీలిస్తున్నారు.
ఎమ్మార్పీకే విత్తనాలు విక్రయించాలని.. ఎక్కువ ధరకు ఎవరైనా విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని వ్యవసాయ అధికారులు హెచ్చరిస్తున్నారు. నకిలీ విత్తనాలు అమ్మితే దుకాణాల లైసెన్స్ను రద్దు చేస్తామంటున్నారు. అన్నదాతల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని విత్తన కంపెనీలకు చెందిన ప్రతినిధులు వ్యాపారులతో కుమ్మక్కై గ్రామాల్లో సంచరించే అవకాశం కూడా ఉందని వ్యవసాయ అధికారులు రైతులను అప్రమత్తం చేస్తున్నారు. రైతులు ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా పెట్టిన పెట్టుబడి, పంట కాలం వృథా అయ్యే ప్రమాదం ఉన్నది.
రైతులు విత్తన ఎంపికలో జాగ్రత్తలు పాటించకుంటే మొదటికే మోసం వస్తుంది. వర్షాలు ప్రారంభమైతే రైతులు హడాహుడిగా నగరానికి చేరుకుని షాపుల్లో విత్తనాలు కొనుగోలు చేస్తుంటారు. ఇదే అదునుగా భావించి వ్యాపారులు తక్కువ ధరకు నాణ్యత లేని విత్తనాలను విక్రయిస్తారు. కొరత ఉందనే ప్రచారం జరుగుతుండటంతో ఇప్పటికే చాలా మంది రైతులు ఆయా దుకాణాలకు చేరుకొని విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు.
అయితే క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ అధికారులు విత్తన ఎంపికపై రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించడంతో పాటు వ్యాపారులు నకిలీ విత్తనాలు అమ్మకుండా ఉండేందుకు ఫెర్టిలైజర్ దుకాణాలను కూడా తరచుగా తనిఖీలు చేయాల్సిన అవసరం చాలా ఉన్నది. ఏదైనా మొలక శాతం రాక, పంట దిగుబడిలోప్రతికూలత ఎదురైతే రైతులు నష్టపోయే ప్రమాదం ఉంటుంది, కాబట్టి రైతులు విత్తనాల నాణ్యతను పరిశీలించాలి. ప్రధానంగా చేవెళ్ల డివిజన్లో పత్తి, మక్క వంటి పంటల సాగు ఉంటుంది. రైతులకు ఈ విత్తనాలు నాణ్యమైనవి లభిస్తున్నాయా..? లేదా పరిశీలించాల్సిన బాధ్యత వ్యవసాయ అధికారులపైనే ఉంటుందని రైతులు అంటున్నారు. రైతులు విత్తనాల ఎంపికలో అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఈ ఏడాది వర్షాలు అధికంగా ఉంటాయని వాతావరణ శాఖ చెబుతున్నది. అదేవిధంగా సన్న రకం వరికి బోనస్ కూడా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో ఈ ఖరీఫ్లో సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉన్నది. గత ఏడాది ఖరీఫ్లో మొయినాబాద్ మండలంలో 17 వేల ఎకరాల్లో పంటలు సాగు చేశారు. వరి 5500, పత్తి 900 ఎకరాల్లో సాగు చేయగా.. మిగిలిన విస్తీర్ణంలో కంది, మొక్కజొన్న, కూరగాయల పంటలు సాగు చేశారు.
ఈ ఏడాది సకాలంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని, భూగర్భజలాలు పెరగవచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే గత ఏడాది కంటే మరో 1000 ఎకరాల్లో సాగు విస్తీర్ణం పెరిగి 18 వేల ఎకరాల్లో పంటల సాగు ఉంటుందని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. వరి 6500 ఎకరాల్లో సాగయ్యే అవకాశమున్నదని పేర్కొంటున్నారు. వర్షాలు అధికంగా ఉన్నాయని చెప్పడంతో పాటు సన్న రకం వరి ధాన్యానికి బోనస్ ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో రైతులు వరిని ఎక్కువ సాగు చేయవచ్చని వ్యవసాయ అధికారులు అంచనాలు వేస్తున్నారు.
విత్తనాల ఎంపికపై రైతులను అప్రమత్తం చేయడానికి వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల్లో పర్యటించి అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 25 నుంచి వ్యవసాయ అధికారులు విత్తనాల కొనుగోలుపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. మొదటి రోజు(మే 25న) ఎన్కేపల్లి, నక్కలపల్లి, ఎతుబార్పల్లి గ్రామాల్లో రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించారు.
ఈ నెల 27న చిలుకూరు, అప్పోజిగూడ, హిమాయత్నగర్, తోలుకట్టా, అప్పారెడ్డిగూడ, 28న రెడ్డిపల్లి, మోత్కుపల్లి, చందానగర్, కేతిరెడ్డిపల్లి, చాకలిగూడ, సజ్జన్పల్లి, 29న మేడిపల్లి, చిన్నమంగళారం, కనకమామిడి, వెంకటాపూర్, 30న అజీజ్నగర్, నాగిరెడ్డిగూడ, ముర్తుజాగూడ, పెద్దమంగళారం, ఎల్కగూడ, 31న అమ్డాపూర్, కాశీంబౌలి, నజీబ్నగర్, శ్రీరాంనగర్, సురంగల్ గ్రామాల్లో రైతులకు విత్తనాల కొనుగోలుపై అవగాహన సదస్సులు నిర్వహించడానికి వ్యవసాయ అధికారులు షెడ్యూల్ తయారు చేసుకున్నారు.
విత్తనాల ఎంపికలో రైతులు వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలి. అప్రమత్తంగా ఉండి నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేయాలి. తక్కువ ధరకు వస్తున్నాయని విత్తనాలను గుర్తింపు లేని కంపెనీల ప్రతినిధుల వద్ద కొనుగోలు చేయరాదు. లైసెన్స్లు ఉన్న దుకాణాల్లో మాత్రమే కొనుగోలు చేయాలి. లూజుగా ఉన్న బస్తాల నుంచి విత్తనాలు కొనుగోలు చేస్తే మోసపోయే అవకాశం ఉంటుంది.
లైసెన్సులు ఉన్న దుకాణాల్లో మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలి. నాణ్యతలేని విత్తనాలు విక్రయించినవారిపై చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే దుకాణాలను తనిఖీ చేస్తున్నాం. క్షేత్రస్థాయిలోకి వెళ్లి విత్తన కొనుగోలుపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. విత్తనాలు కొనుగోలు చేసిన చోట తప్పకుండా రశీదు తీసుకోవాలి. వాటిని భద్రపరుచుకుంటే పంట నష్టపోయినప్పుడు పరిహారం వచ్చే అవకాశం ఉంటుంది.
– రాగమ్మ, వ్యవసాయ అధికారి, మొయినాబాద్