– సీపీఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు రేపాకుల శ్రీనివాస్
బూర్గంపహాడ్, ఆగస్టు 08 : మతోన్మాదుల నుండి దేశాన్ని కాపాడుకుందామని సీపీఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యవర్గ సభ్యుడు రేపాకుల శ్రీనివాస్ ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం బూర్గంపహాడ్ మండల పరిధిలోని లక్ష్మీపురంలో సీపీఎం మండల స్థాయి రాజకీయ శిక్షణా తరగతులకు ఆయన ముఖ్య అతిధిగా హాజరై సీనియర్ నాయకుడు ఎస్కే జానిమియాతో కలిసి జెండా ఆవిష్కరించారు. మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రేపాకుల మతోన్మాదంను ఎదుర్కోవడం ఎలా అనే అంశంపై బోధించారు. దేశం విభిన్న సంస్కృతులకు నిలయమని, అన్నిరకాల సంస్కృతులు కలగలిపిన దేశాన్ని పాలించడం కోసం భారత రాజ్యాంగం అనేక హక్కులు కల్పించిందన్నారు. నేటి పాలకులు భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే పద్ధతులు అవలంభిస్తుందని, బీజేపీ దేశ లౌకిక విధానానికి తిలోదకాలిచ్చిందన్నారు.
బీజేపీ అధికారంలోకి వచ్చి 12 ఏళ్లయినా జీరో అకౌంట్ జీరోలోనే ఉందని, ఏడాదికి కోటి ఉద్యోగాల ఊసే లేదని ఫలితంగా దేశంలో నిరుద్యోగం తాండవిస్తుందన్నారు. ఉక్కు క్రమశిక్షణ కలిగిన సీపీఎం పార్టీని గ్రామ గ్రామాన పటిష్టంగా నిర్మించాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బాల నర్సారెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దోపిడీకి వ్యతిరేకంగా పోరాటాలు ఉధృతం చేయాలన్నారు. నీతి, నిజాయితీతో ప్రజా సమస్యలపై పోరాడే పార్టీ సీపీఎం అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యుడు గడ్డం స్వామి, మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు, పాండవుల రామనాథం, ఎస్కో.అబీద, పాపినేని సరోజిని, రాయల వెంకటేశ్వర్లు, కనకం వెంకటేశ్వర్లు, గుంటక కృష్ణ, సయ్యద్ హుస్సేన్, కమటం మరియమ్మ, మడకం లత, టేకులచెరువు సర్పంచ్ బోళ్ల సైదమ్మ పాల్గొన్నారు.