బొంరాస్పేట, ఫిబ్రవరి 27 : ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు చెబుతున్న మాటలు సత్యదూరంగా ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి విద్యాశాఖ ఎఫ్ఎల్ఎన్ తొలిమెట్టు తదితర అనేక రకాలైన కార్యక్రమాలను అమలు చేస్తున్నది. కానీ పాఠశాలల్లో సరిపోను ఉపాధ్యాయులు లేక ఇటువంటి కార్యక్రమాల అమలు ప్రశ్నార్థకంగా మారింది. బొంరాస్పేట మండలంలోని ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయుల సమస్య పట్టి పీడిస్తున్నది. నిబంధనల ప్రకారం ఉండాల్సిన వారి కంటే తక్కువ సంఖ్యలో ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. ప్రాథమిక పాఠశాలలను ప్రభుత్వం యూపీఎస్లుగా అప్గ్రేడ్ చేసింది కానీ వాటికి కొత్తగా ఉపాధ్యాయ పోస్టులను మంజూరు చేయడం మరిచిపోయింది. దీంతో యూపీఎస్లలో విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత వేధిస్తుండడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు బాట పట్టిస్తున్నారు. ఉపాధ్యాయుల నియామకానికి ప్రభుత్వం త్వరలో కొత్త డీఎస్సీని ప్రకటించనున్న నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డి తన సొంత నియోజకవర్గం బొంరాస్పేట మండంలోని యూపీఎస్లకు కొత్తగా ఉపాధ్యాయ పోస్టులను మంజూరు చేసి భర్తీచేస్తే పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు.
15 యూపీఎస్లు, 38 మంది టీచర్లు
బొంరాస్పేట, దుద్యాల మండలాల్లో 15 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 268 మంది విద్యార్థులు చదువుతున్నారు. విద్యాశాఖ నిబంధనల ప్రకారం ఒక యూపీఎస్లో ముగ్గురు ఎస్జీటీలు, ఒక స్కూల్ అసిస్టెంట్ గణితం లేదా సైన్స్, ఒక బాషా పండితుడు తెలుగు లేదా హిందీ కలిపి మొత్తం ఐదుగురు టీచర్లు ఉండాలి. కానీ మండలంలోని ఏ ఒక్క యూపీఎస్లో కూడా ఐదు మంది టీచర్లు లేదు. పండిత్లు, ఎస్ఏలు ఏ పాఠశాలలోనూ లేరు. నిబంధనల ప్రకారం 15 యూపీఎస్లలో ఐదు మంది టీచర్ల చొప్పున 75 మంది టీచర్లుండాలి. కానీ 47 పోస్టులు మంజూరు ఉంటే అందులోనూ 38 మందే పని చేస్తున్నారు. వీటిలోనూ 9 ఖాళీలు ఉన్నాయి. బొంరాస్పేట మండలంలోని కొత్తూరు యూపీఎస్లో మూడు పోస్టులకుగాను ఇద్దరు, వడిచెర్లలో మూడింటికి ముగ్గురు, ఎనికేపల్లిలో మూడింటికి ఇద్దరు, మహంతీపూర్లో రెండు పోస్టులకు ఇద్దరు, సాలిండాపూర్లో రెండింటికి ఒకరు, మదన్పల్లిలో ఒక పోస్టుకు ఒకరు, బురాన్పూర్లో మూడింటికి ముగ్గురు, నాందార్పూర్లో నాలుగు పోస్టులకు నలుగురు, ఏర్పుమళ్లలో ఐదింటికి నలుగురు ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. దుద్యాల మండలంలోని ఈర్లపల్లి యూపీఎస్లో మూడింటికి ముగ్గురు, గౌరారంలో మూడింటికి ఇద్దరు, లగచెర్లలో మూడింటికి ఇద్దరు, దుద్యాల ఉర్దూ మీడియంలో నాలుగు పోస్టులకు ఇద్దరు, అల్లికాన్పల్లిలో మూడింటికి ఇద్దరు టీచర్లు పని చేస్తున్నారు. ఒక్క చిల్ముల్మైలారం యూపీఎస్లో మాత్రం ఐదు పోస్టులు మంజూరు ఉండగా ఐదుమంది టీచర్లు పని చేస్తున్నారు.
యూపీఎస్లకు పోస్టులు మంజూరు చేయాలి
మండలంలోని యూపీఎస్లకు చాలా ఏండ్ల నుంచి కొత్తగా పోస్టులు మంజూరు కాలేదు. పీఎస్లను యూపీఎస్లుగా ప్రభుత్వం అప్గ్రేడ్ చేసింది కానీ పోస్టులను మాత్రం మంజూరు చేయలేదు. దీంతో యూపీఎస్లలో చదువుకునే విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. టీచర్ల కొరత కారణంగా విద్యార్థులు కూడా యూపీఎస్లలో చేరడంలేదు. ప్రభుత్వం ఇప్పడైనా యూపీఎస్లకు కొత్త పోస్టులను మంజూరు చేసి వాటన్నింటినీ డీఎస్సీతో భర్తీ చేస్తే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుంది.
– బాకారం చంద్రశేఖర్, తపస్ మండల అధ్యక్షుడు