నందిగామ, జూన్1 : ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతున్నదని జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్ అన్నారు. నందిగామ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు దినేశ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బడి బాట కార్యక్రమానికి సర్పంచ్ జిల్లెల వెంకట్రెడ్డితో హాజరై మాట్లాడారు. నందిగామ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో తన సొంత డబ్బుతో సరస్వతీ దేవి విగ్రహ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని నందిగామ సర్పంచ్ జిల్లెల వెంకట్రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు చంద్రపాల్రెడ్డి, కుమారస్వామిగౌడ్, విద్యా కమిటీ చైర్మన్ రాములు, అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
బడి బాటకు సిద్ధమైన ప్రభుత్వ బడి
ఆదిబట్ల : ప్రభుత్వ పాఠశాలలకు వేసవి సెలవులు ముగుస్తుండటంతో ప్రభుత్వ పాఠశాలలను పాఠశాలల సిబ్బంది శుభ్రం చేస్తున్నారు. పాఠశాలల ఆవరణలో చెత్తా చెదారం పేరుకుపోయి ఉండటం, కలుపు మొక్కలు ఎదగడంతో గురువారం ఆదిబట్ల ప్రభుత్వ పాఠశాలను సిబ్బంది శుభ్రం చేశారు. తరగతి గదులను శుభ్రపరిచారు. ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు తెరుచుకున్నాయి. ఉపాద్యాయు లు స్థానికంగా ఉన్న తల్లిదండ్రులతో మాట్లాడి విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. ఆదిబట్ల ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లతో సమావేశం ఏర్పాటు చేశారు.
విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి
ఇబ్రహీంపట్నంరూరల్ : విద్యార్థులను తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని ప్రధానోపాధ్యాయుడు పాండురంగం అన్నారు. మండల పరిదిలోని పోల్కంపల్లి ఉన్నత పాఠశాలలో గురువారం విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులతో బడిబాట కార్యక్రమంలో భాగంగా సమావేశం నిర్వహించారు. దండుమైలారం, ఎలిమినేడు, రాయపోల్ తదితర పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులతో సమావేశాలు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు.