కొత్తూరు, మార్చి 10 : ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య బోధిస్తుండటంతో ఈ విద్యా సంవత్సరంలో నూతన ప్రవేశాలు భారీగా పెరిగాయి. తెలంగాణ ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాముఖ్యత ఇస్తుండటంలో గవర్నమెంట్ స్కూళ్లకు విద్యార్థులు క్యూ కడుతున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం పెద్దపీట వేసింది. అంతేకాకుండా నిష్ణాతులైన ఉపాధ్యాయులతో శిక్షణ ఇస్తుండటంతో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదివేందుకు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుండటంతోపాటు ప్రైవేటు పాఠశాలలో ఫీజుల మోత భరించలేమని విద్యార్థుల తల్లిదండ్రులు నాణ్యమైన విద్యను అందిస్తున్న ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులను చదివించేందుకు ఇష్టపడుతున్నారు. ఉమ్మడి కొత్తూరు మండలంలో 2020-2021 సంవత్సరంలో 4,785 మంది విద్యార్థులు విద్యనభ్యసించగా 2021-2022 సంవత్సరానికి ఆ సంఖ్య 6,203కు పెరిగింది. అంటే ఈ విద్యా సంవత్సరంలో ఉమ్మడి కొత్తూరు మండలంలో 1,446 మంది విద్యార్థులు కొత్తగా అడ్మిషన్లు పొందారు.
కొత్తూరు మండలంలో 2021 సంవత్సరంలో 700 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. ఇంతకు ముందు ప్రతి ఏటా విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వస్తుంటే ఈ ఏడు మాత్రం అమాంతంగా పెరిగింది. ముఖ్యంగా కొత్తూరు మండలంలోని ఎంపీపీఎస్ కొత్తూరులో 75 మంది, అలాగే ఎంపీయూపీఎస్ తిమ్మాపూర్లో 63 మంది, జడ్పీహెచ్ఎస్ సిద్ధాపూర్లో 45, ఎంపీపీఎస్ సిద్ధాపూర్లో 45 మంది, ఎంపీపీఎస్ తీగాపూర్లో 30 మంది, ఎంపీపీఎస్ ఇన్ముల్నర్వలో 20 మంది విద్యార్థులు అడ్మిషన్లు తీసుకున్నారు.
నందిగామ మండలంలో 2021 సంవత్సరంలో 746 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. అయితే జడ్పీహెచ్ఎస్ నందిగామలో 98 మంది, ఎంపీపీఎస్ నర్సప్పగూడలో 86 మంది, ఎంపీపీఎస్ నందిగామలో 68 మంది, జడ్పీహెచ్ఎస్ చేగూర్లో 66 మంది, ఎంపీపీఎస్ మేకగూడలో 49 మంది, ఎంపీపీఎస్ రంగాపూర్లో 43 మంది కొత్తగా అడ్మిషన్లు పొందారు.
ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య అందుతుందన్న నమ్మకంతో విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. అంతేకాకుండా కరోనా సమయంలో పేదలు ఆర్థికంగా చితికిపోవడంతో ప్రైవేటు పాఠశాలలకు పంపే పరిస్థితి లేకుండా పోయింది. ఇలాంటి సమయంలో ప్రభుత్వ పాఠశాలల సిబ్బంది పేదల్లో మనోధైర్యాన్ని నింపారు. ప్రైవేటు కంటే ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతున్న నమ్మకాన్ని వారికి కల్పించారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించడానికి ముందుకు వస్తున్నారు.
– కృష్ణారెడ్డి, కొత్తూరు, నందిగామ ఇన్చార్జి ఎంఈవో
ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య అందుతుందనే నమ్మకాన్ని విద్యార్థుల తల్లిదండ్రుల్లో కల్పించగలిగాం. అంతేగాకుండా ప్రైవేటు కంటే హై క్వాలీఫైడ్ టీచర్లు ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉన్నారని, దానివల్ల ఉత్తమ విద్య తొరుకుతుందనే విషయం విద్యార్థులకు కూడా స్పష్టమైంది. కరోనాతో పేదలు ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజులు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది.
– భాగ్యమ్మ, ప్రధానోపాధ్యాయురాలు, జడ్పీహెచ్ఎస్ కొత్తూరు