షాబాద్, మార్చి 17 : గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు కంటి వెలుగు కార్యక్రమం ఓ వరంలా మారింది. ప్రభుత్వం నిర్వహిస్తున్న క్యాంపులకు కంటి సమస్యలతో వచ్చిన వారికి వైద్యసిబ్బంది కంటి పరీక్షలు నిర్వహించి కండ్ల అద్దాలు, మందులు అందజేస్తున్నారు. రంగారెడ్డిజిల్లా వ్యాప్తంగా శుక్రవారం 80 బృందాల ద్వారా కంటి వెలుగు క్యాంపులు నిర్వహించారు. జిల్లాలో మొత్తం 15,099 మందికి కంటి పరీక్షలు చేశారు.
జిల్లా వ్యాప్తంగా..
రంగారెడ్డిజిల్లా వ్యాప్తంగా చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలో మొత్తం 80 బృందాల ద్వారా ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాల్లో 15,099 మందికి కంటి పరీక్షలు చేశారు. ఇందులో 1,129 మందికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. 934 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాల కోసం ఆర్డర్ చేశారు.
వికారాబాద్ జిల్లాలో 5088 మందికి..
బొంరాస్పేట : జిల్లాలోని 42 కంటి వెలుగు కేంద్రాల్లో వైద్య బృందాలు పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకునే విధంగా ప్రజలను చైతన్యం చేస్తున్నారు. శుక్రవారం జిల్లాలో 5088 మందికి కంటి పరీక్షలు చేశారు. వీరిలో 687 మందికి రీడింగ్ గ్లాసులు పంపిణీ చేయగా, 749 మందికి అద్దాలను ఆర్డరిచ్చారు. ఇదిలా ఉండగా జిల్లాలో ఇప్పటి వరకు 243 గ్రామాలు, 51 వార్డుల్లో కంటి వెలుగు వైద్య శిబిరాలు నిర్వహించినట్లు డీఎంహెచ్వో పాల్వన్కుమార్ తెలిపారు.