రంగారెడ్డి, జనవరి 7(నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమంలో ‘అభయ హస్తం’ దరఖాస్తులు పోటెత్తాయి. ఎనిమిది రోజులపాటు నిర్వహించిన ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపలిటీలు, కార్పోరేషన్ల పరిధిలో మొత్తం 5,53,277 దరఖాస్తులు వచ్చాయి.
ఎక్కువగా గృహ జ్యోతి, మహాలక్ష్మి, రేషన్ కార్డులకు సంబంధించిన దరఖాస్తులే ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ నెల 17 వరకు దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో అధికార యంత్రాంగం కుస్తీ పడుతోంది. రూరల్ ప్రాంతాల్లో వచ్చిన దరఖాస్తుల కోసం 500 మంది ఆపరేటర్లతో దరఖాస్తుల డేటాను ఎంట్రీ చేయిస్తున్నారు. ఆదివారం సెలవు దినం అయినప్పటికీ ఈ ప్రక్రియ కొనసాగింది. అయితే ఐదు పథకాలు కాకుండా ఇతర సమస్యలపై వచ్చిన దరఖాస్తుల్లోని వివరాలను ప్రస్తుతం ఎంట్రీ చేయడం లేదు. వీటిపై ప్రభుత్వం ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు.
జిల్లాలో 21 మండలాల్లోని 558 గ్రామ పంచాయతీల నుంచి 2,91,470 దరఖాస్తులు, 16 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల నుంచి 2,61,807 దరఖాస్తులు వచ్చాయి. లక్షల్లో వచ్చిన దరఖాస్తులను ఈనెల 17లోపుగా ఆన్లైన్లో నమోదు చేయడం సవాల్గా మారింది. ఉపాధిహామీ, సెర్ప్, మండల, రెవిన్యూ, విద్యాశాఖతోపాటు ఇతర ప్రభుత్వ విభాగాల్లో పనిచేసే కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న జూనియర్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లను డేటా ఎంట్రీకి ఎంపిక చేశారు. దరఖాస్తుల కంప్యూటరీకరణకు ఇంకా ఆపరేటర్లు అవసరం పడుతుండడంతో ప్రైవేటు వారిని కూడా తీసుకుంటున్నారు.
ప్రతి ఆపరేటర్కు ఒక ఐడీ, పాస్వర్డ్ను కేటాయించారు. ప్రత్యేకంగా లాగిన్ కేటాయించి ఫోన్కు వచ్చే ఓటీపీ సాయంతో డేటా ఎంట్రీ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా, మండల స్థాయి అధికారుల పర్యవేక్షణలో కంప్యూటరీకరణ జరుగుతున్నది. దరఖాస్తు నమోదు పూర్తయిన వెంటనే దరఖాస్తు దారుని ఫోన్కు రిజిస్ట్రేషన్ నంబరుతో సందేశం వస్తుందని అధికారులు చెబుతున్నారు. దరఖాస్తులోని 27 అంశాలను పథకాల వారీగా నమోదు చేసేందుకు ఒక్కో దరఖాస్తుకు 7 నిమిషాలకు పైనే పడుతున్నది. గడువులోగా ఈ ప్రక్రియ పూర్తి కావాలంటే ప్రతి రోజు యాభై వేల దరఖాస్తులను ఎంట్రీ చేయాల్సి ఉంటుంది.
జిల్లాలో ఉన్న కుటుంబాల సంఖ్య కంటే దరఖాస్తులే ఎక్కువగా వచ్చాయి. అర్బన్ ప్రాంతంలో 2,88,361 కుటుంబాలు ఉంటే, రూరల్ ఏరియాలో 2,46,626 కుటుంబాలు ఉన్నాయి. ఒకే ఇంటి కుటుంబ సభ్యులైనప్పటికీ చాలామంది వేర్వేరుగా దరఖాస్తులు చేసుకోవడం, తెల్ల రేషన్ కార్డులేని వారు సైతం దరఖాస్తు చేసుకున్నారు. అయితే దరఖాస్తుల్లో ఎక్కువగా మహాలక్ష్మి, గృహ జ్యోతి పథకాలకే దరఖాస్తులు ఎక్కువగా వచ్చినట్లు తెలుస్తోంది.
మహాలక్ష్మి పథకంలో మహిళలకు రూ.2,500, రూ.500కే గ్యాస్ బండను అందించనున్నారు. గృహ జ్యోతిలో ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా ఇవ్వనున్నారు. తదుపరి ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, చేయూత దరఖాస్తులున్నట్లు తెలుస్తోంది. అభయహస్తం ఐదు పథకాలతోపాటు రేషన్ కార్డు, ఇతర వ్యక్తిగత లబ్దికి సంబంధించి తెల్లకాగితంపై విజ్ఞప్తులు వచ్చాయి. ఈ తరహా దరఖాస్తులు అర్బన్ ఏరియాలో 47,551 దరఖాస్తులు, రూరల్ ఏరియాలో 48,335 దరఖాస్తులు కలిపి మొత్తం 95,886 వచ్చాయి.
ఇందులో అత్యధికంగా కొత్త రేషన్ కార్డుల కోసమే వచ్చినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. అభయ హస్తం దరఖాస్తులను ప్రత్యేక వెబ్సైట్లో నమోదు చేస్తుండగా..ఇతర సమస్యలపై వచ్చిన దరఖాస్తుల విషయమై ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పష్టత లేకపోవడంతో వాటిని అధికారులు ఎంట్రీ చేయక పక్కన బెట్టారు. అభయ హస్తం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తయి ఆన్లైన్ ప్రక్రియ కొనసాగుతుండగా..ఇప్పటివరకు అర్హుల ఎంపికకు సంబంధించి ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రాలేదు. మార్గదర్శకాలు వచ్చాక మరో దఫా సర్వే చేసి అర్హుల పేర్లను పోర్టల్లో ఉంచుతారని అధికారవర్గాలు చెబుతున్నాయి