ఇబ్రహీంపట్నం, నవంబర్ 14 : ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాదసభకు భారీ ఎత్తున ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు హాజరయ్యారు. పార్టీ శ్రేణులు పెద్దఎత్తున జనసమీకరణ చేయడంతో ఇబ్రహీంపట్నం గులాబీమయమైంది. నియోజకవర్గంలోని 319 బూత్ల నుంచి ముఖ్యమైన నాయకులు, కార్యకర్తలు బహిరంగసభకు తరలివచ్చారు. ప్రతి బూత్ నుంచి సభకు ప్రజలు తరలిరావడంతో సభ అనుకున్నదానికంటే మంచి సక్సెస్ అయ్యింది. ముఖ్యమంత్రి అనుకున్న సమయానికి బహిరంగ సభకు హాజరై ప్రసంగించారు. ఆయన ప్రసంగానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ఎమ్మెల్యే కిషన్రెడ్డి సెంటిమెంట్ ప్రకారం ఖానాపూర్గేటు సమీపంలో బహిరంగసభను ఏర్పాటు చేశారు. గత ఎన్నికల ముందు కూడా ఇక్కడే బహిరంగసభ ఏర్పాటుచేసి ముఖ్యమంత్రి కేసీఆర్ను తీసుకువచ్చారు. ఈసారి కూడా సెంటిమెంట్ను కొనసాగించారు. బహిరంగసభలో ముఖ్యమంత్రి ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి అనేక వరాలు కురిపించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డిని గెలిపించి నియోజవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలని ఆయన ప్రజలను కోరారు. నియోజకవర్గానికి శివన్నగూడ రిజర్వాయర్ నుంచి ఎత్తిపోతల ద్వారా సాగునీరు అందిస్తామని.. ఎలిమినేడు, తాళ్లపల్లిగూడ, మొండిగౌరెల్లి గ్రామాల్లో పరిశ్రమలను ఏర్పాటు చేయించి నిరుద్యోగ సమస్యను నివారిస్తామని హామీ ఇచ్చారు. బీఎన్రెడ్డినగర్ నుంచి మాల్ వరకు సాగర్ రహదారిని నాలుగు లైన్ల రోడ్డుగా మారుస్తామని ఇచ్చిన హామీ కూడా ప్రజల్లో మనోధైర్యాన్ని నింపుతున్నది. 23 శాతం దళితులున్న ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో స్పెషల్ కేస్ కింద 10వేల మందికి దళిత బంధు ఇస్తామని పేర్కొన్నారు. నియోజకవర్గంలో కలెక్టర్ కార్యాలయంతోపాటు ఫాక్స్కాన్ వంటి అంతర్జాతీయ సంస్థలు ఇక్కడే ఏర్పాటు చేశామన్నారు. వైద్యరంగంలో కూడా ఇబ్రహీంపట్నాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామన్నారు. ముఖ్యంగా ఇబ్రహీంపట్నంలో వంద పడకల ఆస్పత్రి ఏర్పాటు చేస్తామని, మీరఖాన్పేట్ వద్ద మహేశ్వరం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల మధ్యలో మెడికల్ కళాశాల కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దఎత్తున హామీలు ఇవ్వడంతో ప్రజల్లో మరింత మనోధైర్యాన్ని నింపింది.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అందరికంటే ముందుగానే ప్రచారం ప్రారంభించింది. ఇప్పటికే గ్రామాల్లో ధూంధాం కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డి గ్రామాల్లో పర్యటిస్తూ.. ఇంటింటికీ వెళ్లి బీఆర్ఎస్ను గెలిపించాలంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. మరోవైపు కార్యకర్తలు, నాయకులు కూడా గ్రామాల్లో ఇంటింటికీ ప్రచారాన్ని నిర్వహిస్తూ.. ఇతర పార్టీలకంటే ముందంజలో ఉన్నారు. దీనికితోడు ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనతోపాటు ప్రసంగం కూడా పార్టీ శ్రేణుల్లో మరింత జోష్ నింపింది. మంచిరెడ్డి కిషన్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తే ఇబ్రహీంపట్నం ముఖచిత్రాన్ని మారుస్తామని.. ఇప్పటికే అభివృద్ధిలో దూసుకుపోతున్న ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మరింత అభివృద్ధి సాధించాలంటే కిషన్రెడ్డి గెలుపు ఎంతో అవసరమన్నారు. సీఎం కేసీఆర్ ప్రసంగం ప్రజలను ఆద్యంతం ఆకట్టుకున్నది.
సభ సంగతులు..