వికారాబాద్ మే 26 : బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్యాంపు కార్యాలయం(సిరిసిల్ల)పై కాంగ్రెస్ గూండాలు దాడి చేయడంతో.. అడ్డుకోబోతున్న బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జి చేయడంపై తీవ్రంగా మండిపడ్డారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ శ్రేణులు గుండాల్లా వ్యవహరిస్తున్నారన్నారు. వారికి క్యాంప్ కార్యాలయంపై దాడి చేయాల్సినంత అవసరమేముందని ప్రశ్నించారు. పోలీసుల ఉదాసీనతను ఆసరాగా చేసుకుని గతంలో కూడా మాజీ మంత్రి హరీశ్రావు క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణులు రెచ్చిపోయి దాడి చేశారని గుర్తు చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఇప్పటికే కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీ, రాహుల్గాంధీ నిందితులుగా ఉండగా.. తాజాగా కోర్టుకు సమర్పించిన ఛార్జిషీట్లో రేవంత్ రెడ్డి పేరు కూడా చేర్చడం జరిగిందన్నారు.
దీని నుంచి తెలంగాణ ప్రజల దృష్టిని మార్చడానికి, మిస్ ఇంగ్లండ్ మిల్లా మాగీకి జరిగిన అవమానాన్ని బయటపెట్టడంతో దాని నుంచి కూడా ప్రజల దృష్టిని మార్చడానికి ఇలాంటి కుట్రలు పన్ని ఉద్దేశపూర్వకంగా దాడులకు ప్రేరేపిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల క్యాంప్ కార్యాలయాలపై దాడులు జరగలేదన్నారు.
అహంకారంతో విర్రవీగిన శిశుపాలుడు తనకు తిరుగులేదని.. తప్పుమీద తప్పు చేసుకుంటూ పోయినట్టు.. అధికారం రాగానే రేవంత్రెడ్డి తన ఇష్టం వచ్చినట్టుగా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ తప్పులమీద తప్పులు చేస్తూనే ఉన్నారన్నారు. కాంగ్రెస్ నాయకులు చేసే ప్రతి తప్పును రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారని, సరైన సమయంలో తగిన గుణపాఠం నేర్పుతారన్నారు. ఇప్పటికైనా మీ వక్రబుద్ధి మానుకొని ప్రజలకు సేవ చేయడంపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.