ఇబ్రహీంపట్నంరూరల్, మార్చి 30 : కాలం మారుతోంది.. కాలంతో పాటు వాతావరణం మారుతోంది..కాలుష్య కారకాలు మారుతున్నాయి.. మనిషి కూడా యాంత్రికంగా మారుతున్నాడు.. బిజీ లైఫ్లో మనుషులు తీసుకునే ఆహార నియమాలు మారుతున్నాయి.. మరి ఇన్ని మారుతున్నప్పుడు అవి ప్రభావం చూపే మనుషుల ఆరోగ్య పరిస్థితి ఎందుకు మారదు..? కచ్చితంగా మారుతుంది. అనేక రకాల వ్యాధులు, ఇతర అనారోగ్య సమస్యలతో అనేక మంది బాధపడుతున్నారు. వైరల్ ఫీవర్, మలేరియా, డెంగీ, ప్లేట్లెట్స్ పడిపోవటం వంటి జబ్బులతో ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. ఊబకాయం, రక్తపోటు, మధుమేహం, గుండె వ్యాధులు విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నాయి. వీటన్నింటికీ కారణం ఆహార నియమావళి అదుపు తప్పడం, శరీరానికి సరైన వ్యాయామం లేక పోవడమేనని అంటున్నారు ప్రముఖ వైద్య నిపుణులు శ్రీలేఖ.. పిల్లలు, పెద్దలు, వృద్ధులు, పురుషులు, స్త్రీలు, ధనికులు, సాధారణ, మధ్యతరగతి కుటుంబాలు అనే బేధాలు లేకుండా వారికున్న అనుకూలతను బట్టి వ్యాయామానికి సమయం కేటాయించాల్సిన అవసరం ఉంది. ఆరోగ్య పరిరక్షణకు చికిత్స, మందుల వాడకానికే పరిమితం కాకుండా వాకింగ్, జాగింగ్తో పాటు జిమ్, యోగా ఇతర మానసిక, శారీరక అలసటకు సంబంధించిన వ్యాయామాలు చేస్తూ పుష్టికరమైన సంతులిత ఆహారం, పండ్లు, పండ్ల రసాలు తదితర పదార్థాలు సమపాళ్లల్లో తీసుకుంటే ఎటువంటి ప్రాణాంతక వ్యాధులు, జబ్బులకైనా చెక్ పెట్టవచ్చనేది వైద్యులు, వ్యాయామ నిపుణుల అభిప్రాయం.
ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు వ్యాయామంతో పాటు పౌష్టికాహారం తప్పనిసరిగా తీసుకోవాలి. నిత్యం తీసుకునే ఆహార పదార్థాల విషయాల్లో ఎటువంటి నియమాలు, పరిమితులు పాటించడంలేదనేవి జగమెరిగిన సత్యం. పౌష్టికాహార నియమాలు పాటించని 90శాతం శరీరాలు విభిన్నరోగాలు, వ్యాధుల బారిన పడుతున్నట్లు ఆరోగ్యసంస్థ నివేదికలు చెబుతున్నాయి. సమతుల్య ఆహారానికి ప్రాధాన్యం ఇచ్చినట్లయితే శరీరాన్ని రోగాల బారినుంచి కాపాడుకోవచ్చు. ముఖ్యంగా నూనె పదార్థాలు పరిమితంగా వాడటం, మాంసకృతులు, ప్రొటీన్లు, కార్బొహైడ్రెట్లు సమపాళ్లలో లభించేలా పప్పుదినుసులు, కూరగాయలు, పండ్లు, తదితర పదార్థాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. మాంసాహారులు పప్పుదినుసుల స్థానంలో అప్పుడప్పుడు గుడ్డు, చేపమాంసం తీసుకుంటే ఎంతో మంచిది.
అందమైన ఆరోగ్యానికి శాశ్వత సంజీవని యోగా అంటారు. మానసిక ప్రశాంతత ఈ యోగాతోనే సాధ్యం. మధుమేహం, రక్తపోటు, గుండెజబ్బులు, కీళ్లనొప్పులు, వెన్నునొప్పి, తదితర సమస్యలన్నింటికీ చక్కని పరిష్కార మార్గం యోగా. దీర్ఘకాలిక, మొండి వ్యాధులను తగ్గించే శక్తి యోగాకు ఉందని నిపుణులు అంటున్నారు. జీర్ణకోశ వ్యాధులు, నీరసం, నిద్రలేమి, నరాల బలహీనత వంటి రుగ్మతల నుంచి తేలికగా బయటపడే వీలు ఉంటుంది. ఉదయం 5గంటల నుంచి 7గంటల లోపు 45నిమిషాల పాటు క్రమం తప్పకుండా యోగా చేయడంతో పాటు అరచేతులు, అరికాళ్లపై తగిన విధంగా మర్థనా చేస్తే అంతుచిక్కని వ్యాధులు మాయమైపోతాయని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
ప్రతి ఒక్కరికీ ఆరోగ్యంపై శ్రద్ధ ఉంటుంది. వ్యాధులను అధిగమించాలనే ఆసక్తి, లక్ష్యం ఉంటాయి. వీటన్నింటికీ ఒకటే మార్గంగా వాకింగ్, జాగింగ్ చేస్తూ క్రీడా మైదానాలు, పార్కుల వైపు పరుగులుతీస్తున్నారు. ఆరోగ్యంగా ఉండాలనుకునే వారు కొంతమందికి చలి వాతావరణం అనుకూలించక పోవడం, వయస్సు తదితర కారణాలతో బయటి ప్రాంతాలకు రాకుండా ఇంటి వరండాలు, వాకిళ్లు, డాబాలపై వాకింగ్, జాగింగ్ చేస్తున్నారు. మరికొంతమంది సంపన్న వర్గాలు పని ఒత్తిడి వల్ల తమకున్న ఖాళీ సమయంలో కొంత వెసులుబాటు కల్పించుకుని వ్యాయామం చేస్తున్నారు. హోమ్ జిమ్లను ఏర్పాటు చేసుకుని కుటుంబ సమేతంగా కరసత్తు చేస్తున్నారు.
చిన్నారులు ఎదుగుతున్న కొద్దీ వారి దేహానికి, బుద్ది వికాసానికి కావాల్సినంత పౌష్టికాహారాన్ని అందించాలి. ఇలా అధిక పోషకాహార విలువలు కలిగిన ఆహారం అందించినప్పుడు అప్పుటే పుట్టినబిడ్డ బరువు కేవలం ఐదు నెలల్లో రెట్టింపు అవుతుంది. ఏడాది నిండే సరికి మూడురెట్లు బరువు పెరుగుతుంది. రెండో ఏడాదిలో 7నుంచి 8సెంటీమీటర్ల ఎత్తు పెరుగుతారు. కౌమర దశలో అడుగు పెట్టినప్పటి నుంచి వారిలో అనేక శారీరక, మానసిక మార్పులు కనిపిస్తాయి. ఇది కీలకమైన దశ, ఈ దశలో ఉన్న పిల్లలకు సరిపడా సమతుల్య ఆహారాన్ని అందించాలి. ముఖ్యంగా కాల్షియం సమృద్ధ్దిగా అందించాలి. ప్రతి మనిషికి రోజుకు 600నుంచి 800గ్రాముల క్యాల్షియం అవసరమవుతుంది. పాల ద్వారా క్యాల్షియం సమృద్ధిగా లభించే అవకాశం ఉంది. మార్కెట్లో లభించే చిరుతిండికి పిల్లలను అలవాటు చేయొద్దు. చిన్నతనం నుంచే పౌష్టికాహారంపై చిన్నారులకు అవగాహన కల్పిస్తూ ఇంటిలో ఉడికించిన పదార్థాలకు అలవాటు చేయాలి. లావు అవుతారనే ఆలోచనతో ఆహారం అందించే విషయంలో వెనుకాడకుండా, వారి సామర్థ్యాన్ని బట్టి శారీరక శ్రమకు సమయాన్ని కేటాయించేలా రోజు ఆటలు, వ్యాయామాల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలి. చిన్నారులకు ఆహార నిమమాలు, శారీరక శ్రమతో పాటు రోజుకు కనీసం 8నుంచి 10గంటలు నిద్ర తప్పనిసరి అవసరం. అంతేకాకుండా పిల్లలకు చిన్నప్పటి నుంచే వ్యాయామం తప్పనిసరిగా అలవాటు చేయాలి.
వృద్ధులకు విశ్రాంతి, మానసిక ప్రశాంతత, శారీరక బలం అవసరం. వయస్సు మీద పడుతున్న కొద్దీ ప్రతి వ్యక్తికి సాధారణంగానే కొన్ని సమస్యలు పెరుగుతూ ఉంటాయి. వృద్ధాప్యంలో శారీరక శ్రమ ఎక్కువగా ఉండదు. కాలరీల సామర్థ్యం తగ్గుతున్నది. సాధారణ వ్యక్తులకు రెండువేల కాలరీల సామర్థ్యం అవసరం. వృద్ధాప్యంలో ఉన్నవారికి మాత్రం 1,800 క్యాలరీలు సరిపోతుంది. ఆహార పదార్థాల విషయానికొస్తే వృద్ధాప్యంలో నూనె, నెయ్యి, వెన్న, వనస్పతి వాడకం దాదాపుగా తగ్గించుకోవాలి. పాలు, పప్పు ధాన్యాలు, కోడిగుడ్డు తెల్లసొన మేలు చేస్తాయి. రోజుకు 200 నుంచి 300 మిల్లీలీటర్ల పాలు, పాల ఉత్పత్తులు ఆరోగ్యానికి ఎంతో ఉపయుక్తం కనీసం 400 గ్రాముల కూరగాయలు, పండ్లు తినాలి. ఉప్పు, మసాలాలు బాగా తగ్గించాలి. కాల్షియం, విటమిన్ -ఏ, జింక్ వృద్ధాప్య సమస్యలను అధిగమించటంతో సహాయ పడతాయి. వైద్యుల సహకారంతో వ్యాయామ పద్ధతులు ఎంచుకోవాలి.
కుర్రకారు సిక్స్ప్యాక్, పర్ ఫెక్టు బాడీలతో వెర్రిత్తించాలనే ఆసక్తితో జిమ్లు, ఫిట్నెస్ సెంటర్లకు పరుగులు తీస్తున్నారు. యువత ఉత్సాహానికి అనుగుణంగా వ్యాయామ కేంద్రాలూ పెరిగాయి. శారీరాకృతికి అనువైన ఫిట్నెస్ పరికరాల వినియోగం పెరిగింది. ఉమ్మడి జిల్లాలోని పట్టణాల్లో జిమ్ సెంటర్లు వెలిశాయి. యువత అభిరుచులకు అనుగుణంగా అధునాతనమైన పరికరాలతో అక్కడ వ్యాయామాలు చేస్తున్నారు.
ఉరుకులు.. పరుగుల జీవితంలో ప్రజలు ఆహారం విషయంలో సరైన జాగ్రత్తలు పాటించకపోవటంతో పాటు సమయానికి సరైన ఆహారం తీసుకోకపోవటం వలన అనారోగ్య సమస్యలు తీవ్రమవుతున్నాయి. వీటన్నింటినీ అధిగమించేందుకు కోసం ప్రతిరోజూ వ్యాయామం, జిమ్, జాగింగ్లు చేయటంతో పాటు ఆహారం విషయంలో సరైన జాగ్రత్తలు పాటిస్తే ఎలాంటి వ్యాధులు దరిచేరవు. ప్రతిరోజు మనిషికి యోగా ఎంతో అవసరం. యోగా చేయటం వలన ఎలాంటి రోగాలు దరిచేరవు.
– శ్రీలేఖ, ప్రముఖ వైద్య నిపుణురాలు