తాండూరు, అక్టోబర్ 22 : తెలంగాణ, కర్ణాటకకు అడుగు దూరంలో ఎంతో తేడా ఉంది. ఒక్క అడుగు తాండూరు వైపు వేస్తే పచ్చని పంటలు, 24 గంటల కరెంటు, వాగుల్లో పారుతున్న నీళ్లు, రైతుల పెట్టుబడికి సహాయం, ప్రమాదవశాత్తు రైతు మరణిస్తే రూ.5 లక్షల బీమా., మిషన్ కాకతీయ, మిషన్ భగీరథతో పుష్కలమైన నీళ్లు., మహిళల కోసం కల్యాణలక్ష్మి, షాదీముబారక్, గర్భిణులు, బాలింతలకు అమ్మఒడి, కేసీఆర్ కిట్, గృహలక్ష్మి, ఆరోగ్యలక్ష్మి పథకాలు అమలవుతున్నాయి.
బడుగు బలహీనవర్గాల సంక్షేమానికి ఆసరా పింఛన్లు, గ్రామజ్యోతి, గొర్రెల పంపిణీ, చేనేత లక్ష్మి, నేతన్న బీమా, దళిత బంధు, బీసీ బంధు, మైనార్టీబంధుతోపాటు బీఆర్ఎస్ సర్కార్ వైద్యానికి ప్రత్యేక నిధులు కేటాయించడంతో తాండూరు ప్రభుత్వ అసుపత్రిలో అన్ని సౌకర్యాలు సమకూర్చడంతో కార్పొరేట్కు దీటుగా ఉచితంగా మెరుగైన వైద్య చికిత్సలు అందుతున్నాయి. పేదలకు ఉన్నత విద్య అందించాలనే సంకల్పంతో ప్రత్యేక గురుకులాలు, మోడల్ స్కూళ్లతో పాటు ప్రభుత్వ బడుల బలోపేతానికి ‘మన ఊరు-మన బడి’ పేరుతో సకల సౌకర్యాలు, విద్యార్థులకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం సన్నబియ్యంతో కూడిన భోజనం.
అదే ఒక్క అడుగు కాంగ్రెస్ పాలిస్తున్న కర్ణాటక రాష్ట్రం వైపు వేస్తే ఎప్పుడు వస్తదో తెలువని కరెంటు. పేద రైతుల చేతిలో డబ్బు లేక సరైన పంటలు పండించని కష్టాలు. రైతు మరణిస్తే ఎలాంటి సహాయం అందని దుస్థితి. వ్యవసాయంతో పాటు పల్లెలో తాగునీటి ఇక్కట్లు. ఈడొచ్చిన కూతురుకు పెళ్లి కోసం డబ్బులు లేక తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు. గర్భిణులు, బాలింతలకు సరైన సౌకర్యాలు లేక పురుట్లో ఇబ్బందులు పడుతున్న మహిళలు, పసిపిల్లలు.
చదువుకున్నవారికి ఉపాధిలేక, వెనుకబడిన కులాల వారికి ప్రభుత్వం సహాయం అందించక ఇబ్బందులు పడుతున్న యువతరం.. ఇలా తెలంగాణ రాష్ట్రం తాండూరు నియోజకవర్గం సరిహద్దు ప్రాంతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటక గ్రామాల్లో ఇప్పుడు కనిపిస్తున్న సమస్యల దృశ్యాలివి. దీంతో తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు తమకూ కావాలని అక్కడి పాలకులకు కాంగ్రెస్ను డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తారని కాంగ్రెస్కు ఓటు వేస్తే ప్రజల జీవితాలతో కాంగ్రెస్ ఆటలాడుతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో‘కారు’ గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్నే గెలిపించాలని పేర్కొంటున్నారు. భవిష్యత్తులో దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ అధికారంలోకి రావాల్సిందేనని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలతో పాటు ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన ప్రజా సంక్షేమ పథకాలు అద్భుతంగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం తాండూరులో పుట్టిపెరిగిన నేను పెళ్లి తర్వాత కర్ణాటక రాష్ట్రం మదుకల్కు రావడంతో ఇక్కడి ప్రజల గోసలు స్వయంగా చూస్తున్నాను. కర్ణాటక ప్రజలకు మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకొని కాంగ్రెస్ అధికారం సొంతం చేసుకుంది. ఎన్నికలు ముగిసిన వెంటనే ఇచ్చిన మాటలను మరిచి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నది. అనేక మంది పేద ప్రజలు, రైతులు ఇబ్బందులతో అల్లాడిపోతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మోసపూరిత మాటలు నమ్మకుండా రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తున్న బీఆర్ఎస్ పార్టీకే ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకోండి. సంతోషంగా జీవించండి.
– గాయత్రి, మదుకల్, కర్ణాటక రాష్ట్రం
మా కర్ణాటక రాష్ట్రంలో కరెంటు కోతలతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాం. 24 గంటల్లో కేవలం 7 గంటలే విద్యుత్ ఉంటున్నది. ఒక్కోసారి మూడు రోజులైనా పంటలకు త్రీఫేజ్ కరెంటు రావడంలేదు. ఎప్పుడొస్తుందో ఎప్పుడు పోతుందో తెలుస్త లేదు. పంటలెట్ల పండించుకోవాలి? మా కష్టం ఎవరికి చెప్పుకోవాలి? పంట పెట్టుబడికి చేతిలో డబ్బులు లేకుంటే అప్పులు చేస్తున్నాం. పండిన పంట వాటికే పోతున్నది. తెలంగాణలో రైతులకు పంట పెట్టుబడి సహాయం, ప్రమాదవశాత్తు రైతు మరణిస్తే రూ.5 లక్షల బీమా, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథతో పుష్కలమైన నీళ్లు ఇవ్వడం చాలా బాగుంది. సీఎం కేసీఆర్లాంటి పాలన మా రాష్ట్రంలో ఉండాలని కోరుకుంటున్నాం. తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో బీఆర్ఎస్నే మళ్లీ గెలిపించుకోండి. కాంగ్రెస్, బీజేపీ మాటలు నమ్మి మోసపోకండి.
– నాగేంద్ర, కేరెల్లి, కర్ణాటక రాష్ట్రం
తెలంగాణలో దళిత బంధు పథకం చాలా బాగుంది. తెలంగాణలో ఉండి ఉంటే నాకు రూ.10 లక్షలు వచ్చేవి. దీంతో మంచి వ్యాపారం చేసుకునేవాడిని. ఇక్కడ నాలాంటి ఎంతో మంది ఇబ్బందులకు గురవుతున్నారు. బడుగు బలహీనవర్గాల సంక్షేమానికి తెలంగాణలో అమలవుతున్న పథకాలు కర్ణాటక రాష్ట్రంలో ఉండి ఉంటే నేను తాండూరుకు రోజూ వచ్చి పనిచేసుకునేవాడిని కాదు. కర్ణాటకలో సరైన ఉపాధి లేక ఉదయం రైల్లో తాండూరుకు వచ్చి బట్టలు కుట్టి రాత్రి రైలుకు వెళుతున్నా. రోజుకు రూ.600 నుంచి రూ.900 సంపాదిస్తున్నా. తాండూరులో బీఆర్ఎస్ పాలన ఉండడంతో ఇక్కడి ప్రజలు సంతోషంగా కనిపిస్తున్నారు.
– శరణప్ప, కుడుగుంట, కర్ణాటక రాష్ట్రం
కర్ణాటకలో పాలకుల నిర్లక్ష్యంతోనే ప్రజలు, నాలాంటి యువతరం ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రజా సంక్షేమానికి సరైన పథకాలు లేకపోవడంతో స్వయంగా పనులు చేసుకొని జీవనం కొనసాగిస్తున్నాం. తెలంగాణ రాష్ర్టానికి కూతవేటు దూరంలోనే ఉన్నాం. కానీ ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం సరైన అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేయకపోవడంతో చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. మాకు తెలంగాణ పాలన కావాలి. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ను మళ్లీ గెలిపించుకోండి. బంగారు భవిష్యత్తుకు బాసటగా నిలవండి.
– శివకుమార్, మిరియాన్, కర్ణాటక రాష్ట్రం
కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన బాగలేదు. మహిళలకు ఎలాంటి ఉపయోగం లేదు. అదే తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ప్రత్యేక పథకాలు ఉన్నాయి. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, గర్భిణులు, బాలింతలకు అమ్మ ఒడి, కేసీఆర్ కిట్, గృహలక్ష్మి, ఆరోగ్యలక్ష్మి పథకాలు అమలవుతున్నాయి. పేద మహిళలకు రూ.400లకే గ్యాస్, సౌభాగ్యలక్ష్మి పేరుతో ప్రతి నెలా రూ.3000లతో పాటు ప్రత్యేక పింఛన్లు ఇస్తామని ప్రకటించడం అభినందనీయం. ముఖ్యంగా సర్కార్ దవాఖానలో పురుడు పోసుకుంటే అమ్మాయి పుడితే రూ.13 వేలు, అబ్బాయి పుడితే రూ.12 వేలు ఇవ్వడం చాలా బాగుంది. పేదలకు ఈ పథకాలు ఎంతో మేలు చేస్తాయి. మేము ఏ పాపం చేశామో.. తెలంగాణలో పుట్టలేదు అనిపిస్తున్నది. కర్ణాటకలో ఇలాంటి మంచి సౌకర్యాలు లేక పురుటిలో మహిళలు ఎన్నో బాధలు అనుభవిస్తున్నారు.
– కమల, బట్గిరీ, కర్ణాటక రాష్ట్రం
తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అద్భుతంగా ఉన్నాయి. కాంగ్రెస్ అసమర్థత వల్లే కర్ణాటకలో ప్రజలకు కష్టాలు ఏర్పడ్డాయి. కాంగ్రెస్ ప్రభుత్వం తగినంత విద్యుత్ సరఫరా చేయడంలో విఫలమైనందున, రాష్ట్రవ్యాప్తంగా రైతులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ సరఫరా సరిగా లేకపోవడంతో మిర్చి, పత్తి, ఎర్రజొన్న, వరి పంటలు చాలా వరకు దెబ్బతింటున్నాయి. ఎన్నికల్లో నోటికి వచ్చినట్లు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ మాట నిలబెట్టుకోలేకపోతున్నది. ప్రజలను మోసం చేసి పాలన చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నది. తాండూరు నియోజకవర్గానికి మా ‘ఆడికి’ గ్రామం అనుకొని ఉండడంతో తెలంగాణలో అమలవుతున్న పథకాలు మాకు తెలుసు. చాలా బాగున్నాయి. అందుకు తాండూరు ప్రాంతం ప్రజలు మళ్లీ బీఆర్ఎస్నే గెలిపించుకోవడం మంచిది.
– తాయప్ప, ఆడికి, కర్ణాటక రాష్ట్రం