సిద్దిపేట, జూలై 26: నలభై ఏండ్లు దాటిన మహిళలు క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరానికి హాజరై పరీక్షలు చేయించుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు సూచించారు.ఈ నెల 29న సిద్దిపేట విపంచి కళానిలయంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు హైదరాబాద్లోని సింధూ క్యాన్సర్ దవాఖాన సహకారంతో ఉచిత క్యాన్సర్ స్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్యాన్సర్ అంటే ఒక నిమిషం భయం..ఆందోళన కానీ భయపడాల్సిన అవసరం లేదని ఆలస్యం చేయడమే ప్రమాదమన్నారు.
ముందస్తు పరీక్ష మీ ప్రాణానికి రక్ష.. ఒక రోజు సమయం తీసుకొని క్యాన్సర్ స్రీనింగ్ టెస్ట్ చేయించుకోవాలని సూచించారు. ఒకో సారి ప్రారంభ దశలో లక్షణాలు కనిపించవు కానీ స్రీనింగ్ టెస్ట్లో ఆ లక్షణాలు భయటపడతాయని చెప్పారు. 40 ఏండ్లు దాటిన ప్రతి మహిళ ఈ శిబిరానికి హాజరై పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. గతంలో కార్పొరేట్ దవాఖానల ఆధ్వర్యంలో స్రీనింగ్ పరీక్షలు నిర్వహించగా కొంతమందికి లక్షణాలు ఉన్నట్లు తేలాయని, అప్పటికప్పుడు వారు చికిత్స ప్రారంభించడంతో ప్రాణాలతో భయటపడ్డారని గుర్తుచేశారు.