వికారాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలని.. ఆ పార్టీని గెలిపిస్తే టేక్ ఇట్ ఈజీ గ్యారెంటీ అంటారని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని నర్సింగ్ ఫంక్షన్ హాల్లో వికారాబాద్ నియోజకవర్గ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే ప్రజలు ఊరుకోరని, ఎక్కువ రోజులు కాంగ్రెస్ ప్రభుత్వం మనుగడ సాగదన్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కారుకు స్పీడ్ బ్రేకర్ మాత్రమే పడిందని ఆయన స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ పదేండ్ల పాలనలో సంక్షేమం, అభివృద్ధిపైనే దృష్టిని కేంద్రీకరించి పార్టీ గురించి పట్టించుకోలేదని.
ఇంటింటికీ తాగు,సాగు నీరు, విద్యుత్తు అందించేందుకు ప్రతిరోజూ 24 గంట లపాటు పని చేశామని.. రాజకీయాలకతీతంగా ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలను చేర్చామన్నారు. పథకాల అమల్లో కార్యకర్తలకు ప్రాధాన్యమివ్వకపోవడం పార్టీకి నష్టం చేసిందని, పార్టీ పరంగా, పథకాల పరంగా తెలిసో, తెలియకో చేసిన తప్పులతో నష్టం జరిగిందన్నారు. అదేవిధంగా 119 సీట్లలో మూడో భాగం 39 మందిని ప్రజలు గెలిపించారని, సోషల్ మీడియా ద్వారా కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు ప్రచారం చేసి గెలిచిందన్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లో ముందంజలో ఉందంటే అది కేసీఆర్ క్రెడిటేనని స్పష్టం చేశారు.
కేసీఆర్ ప్రభుత్వానికి నీతి అయోగ్ సంస్థ ఎన్నో ప్రశంసలు ఇచ్చిందని.. పల్లెలు, హైదరాబాద్ నగరం ఎంతో అభివృద్ధి చెందిందని.. ఐటీలో ఎక్కువ ఉద్యోగాలు కల్పించి అన్ని రంగాల్లో తెలంగాణను నంబర్ వన్గా నిలబెట్టిన పార్టీ బీఆర్ఎస్ అని ఆయన గుర్తు చేశారు. అదేవిధంగా ప్రగతిభవన్లో 150 బెడ్రూంలు కట్టారని హస్తం పార్టీ నాయకులు తప్పుడు ప్రచారం చేశారని.. ఇప్పుడు ప్రగతిభవన్లో ఉంటున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 150 బెడ్రూం, బంగారు నల్లాలను చూపించాలని డిమాండ్ చేశారు. ప్రగతిభవన్కు ఇనుప కంచెలు వేశారని జరిగిన ప్రచారం కూడా శుద్ధ తప్పేనని.. కిరణ్కుమార్రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే ఏర్పాటు చేశారని ఎంత చెప్పినా ప్రజల్లోకి తప్పుడు సమాచారమే వెళ్లిందన్నారు.
ఏ పార్టీకైనా, నాయకుడికైనా కార్యకర్తలే పట్టుకొమ్మలని.. కష్టమొచ్చినా, నష్టమొచ్చినా కలిసే ముందుకు పోవాలన్నారు. ఓడిపోయినందున కుట్రలను ఎదుర్కొని పార్టీని బతికించుకోవాలని బీఆర్ఎస్ శ్రేణులకు సూచించారు. పార్టీలో గ్రూపులు వద్దని.. అసెంబ్లీ ఎన్నికల్లో తగిలిన దెబ్బకు రానున్న లోక్సభ ఎన్నికల్లో ప్రతీకారం తీర్చుకోవాలని..అందుకోసం చేవెళ్ల ఎంపీగా మరోసారి రంజిత్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుందామన్నారు. బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ రాష్ట్రం కోసమని.. చంద్రబాబు, వైఎస్సార్లాంటి వారిని ఎదుర్కొని 15 ఏండ్లు పోరాటం చేసి రాష్ర్టాన్ని సాధించిన ధీరుడు కేసీఆర్ అని పేర్కొన్నారు.
రేవంత్రెడ్డికి పీసీసీ పదవి, సీఎం పదవి బీఆర్ఎస్ పార్టీ లేకుంటే, పోరాటం చేయకుంటే వచ్చేదా అని వేముల ప్రశాంత్రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు ప్రొటోకాల్ పాటించాలని లేకుంటే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు సూచించారు. అవసరమైతే 39 మంది ఎమ్మెల్యేలం వచ్చి ధర్నా చేస్తామన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ చిత్తు చిత్తుగా ఓడిపోతుందని.. బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎవరూ పోటీ చేసినా గెలుస్తారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సమావేశంలో వికారాబాద్ నియోజకవర్గంలోని ఎంపీపీలు, జడ్పీటీసీలు, పార్టీ మండలాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగేందర్గౌడ్ మాట్లాడుతూ అడవులను నరికి, రేడియేషన్కు గురిచేసే నేవీ రాడార్ సెంటర్ వద్దే..వద్దు. సీఎం రేవంత్రెడ్డి జిల్లాకు చెందిన వాడు కాదు.. జిల్లా ప్రజలను మోసం చేస్తున్నాడు. సుపరిపాలన అందించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జిల్లాలను కుదిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొంటున్నది. వికారాబాద్ జిల్లా కోసం ఎన్నో ఏండ్లు పోరాటం చేశాం. జిల్లా నుంచి ఒక్క గ్రామాన్ని తొలగించినా ప్రభుత్వానికి తగిన బుద్ధి తప్పదు. పార్లమెంట్ ఎన్నికల్లో రంజిత్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేసే వరకూ పోరాటం చేద్దాం.
‘కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలయ్యే వరకూ ప్రజల తరఫున పోరాడుదాం. బీఆర్ఎస్ శ్రేణులు తలుచుకుంటే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో రంజిత్రెడ్డి సులువుగా విజయం సాధిస్తా రు. తాగు, సాగు నీరందించిన మహానుభావుడు కేసీఆర్. సమన్వయ లోపంతోనే వికారాబాద్ నియోజకవర్గంలో ఓటమి చేద్దాం. జరిగిన నష్టాన్ని పూడ్చుకొని పార్టీని మరింత బలోపేతం చేద్దాం’ అని జడ్పీ వైస్ చైర్మన్ బైండ్ల విజయ్కుమార్ అన్నారు.