పూడూరు, అక్టోబర్ 19: తెలంగాణ రాష్ర్టాభివృద్ధి సీఎం కేసీఆర్తోనే సాధ్యమని పరిగి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి అన్నారు. గురువారం పూడూరు మండలం మన్నెగూడ జేకే ఫంక్షన్ హాల్లో పార్టీ మండల అధ్యక్షుడు మహిపాల్రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిగి నియోజక వర్గంలో ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అందించడంతో పాటు పలు అభివృద్ధి పనులను చేసినట్లు గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాకే గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా తాగు నీరు సరఫరా చేయడంతో మహిళలకు ఇబ్బందులు తప్పాయని తెలిపారు. రైతులకు ఉచిత విద్యుత్, రైతు బీమా, రైతు బంధు, వృద్ధులకు పింఛన్లు , కల్యాణలక్ష్మి, షాదీమూబారక్, కేసీఆర్ కిట్ వంటి అనేక పథకాలను ప్రభుత్వం అమలు చేసిందన్నారు.
మరోసారి అధికారం అప్పగిస్తే మ్యానిఫెస్టోలోని అంశాలతో పాటు మరిన్ని పథకాలు అమలు చేయనున్నట్లు తెలిపారు. పార్టీ నాయకులు ఎలాంటి విభేదాలు లేకుండా కలిసికట్టుగా పని చేసి విజయానికి కృషి చేయాలని పిలుపునిచారు. కాంగ్రెస్ , బీజేపీలు చెప్పే మాయ మాటలకు మోసపోవద్దన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను ఓటర్లకు నాయకులు వివరించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న ఆరు గ్యారంటీ పథకాలు ప్రజలను మోసం చేసే ప్రయత్నమన్నారు. పక్క రాష్ట్రమైన కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలేదన్నారు.
కాంగ్రెస్ ఇస్తున్న గ్యారంటీకి ఎలాంటి వారంటి లేదన్నారు. సమావేశానికి ముందుగా మన్నెగూడ చౌరస్తా నుంచి పార్టీ నాయ కులు, కార్యకర్తలు భారీ ర్యాలీ తీశారు. కష్టపడి పార్టీని గెలిపిస్తే రాబోయే రోజుల్లో అందరికీ పలు అవకాశాలు దక్కుతాయని తెలిపారు. కారుగుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీ తీసుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మల్లేశం, జడ్పీటీసీ మేఘమాల, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కె.అనిల్రెడ్డి, రైతుల బంధు సమితి మండల కన్వీనర్ రాజేందర్రెడ్డి, అజీం, రాంరెడ్డి, పరిగి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అజారుద్దీన్, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు అనంతరెడ్డి, సర్పంచ్లు వినోద్గౌడ్, శ్రీధర్గుప్తా, గోవర్ధన్రెడ్డి, సైయాద్ అధిల్, నర్సింహారెడ్డి, ఎ.వెంకటయ్య, ఉప సర్పంచ్ టి.రాజేందర్, సత్యనారాయణరెడ్డి, ఆయా గ్రామాల నాయకులు, మహిళలు తదితరులు ఉన్నారు.