కులకచర్ల, నవంబర్ 19 : అభివృద్ధి, సంక్షేమం బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని పరిగి బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. ఆదివారం కులకచర్ల మండల పరిధిలోని పీరంపల్లి, బొంరెడ్డిపల్లి, బండవెల్కిచర్ల, రాంనగర్, ఎర్రగోవింద్తండా, చెల్లాపూర్, హన్మ్యనాయక్తండా, సాల్వీడ్, ఘనాపూర్, కామునిపల్లి, బోట్యనాయక్తండా గ్రామాల్లో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సేరి రాంరెడ్డి అధ్యక్షతన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు సంక్షేమ పథకాలను నేరుగా అందించిన ఘనత బీఆర్ఎస్ పార్టీకే, సీఎం కేసీఆర్కే దక్కుతుందని తెలిపారు. గతంలో గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కరువై ప్రజలు వివిధ రకాలుగా ఇబ్బందులు పడ్డ విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. నాడు చేయని అభివృద్ధి నేడు చేస్తామని గ్యారంటీలు అమలు చేస్తామని చెబితే ప్రజలు నమ్మే పరిస్థితిలేదన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకంతో చెరువులకు మరమ్మతులు చేయించి పూర్వవైభవం తీసుకొచ్చినట్లు గుర్తు చేశారు. క్లస్టర్ల వారీగా రైతువేదికలను ఏర్పాటు చేసి వారి సమస్యల పరిష్కారం కోసం కృషిచేస్తున్నదని తెలిపారు. మహిళా సంఘాలకు గ్రామగ్రామాన భవనాలు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు. అవసరమున్నచోట్ల బీసీ, ఎస్టీ, ఎస్సీ కమ్యూనిటీ భవనాలు నిర్మించేందుకు తనవంతుగా నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం అందించేందుకు చర్యలు తీసుకున్నదని, విద్య, వైద్యం పరంగా చాలా సంస్కరణలు తీసుకొచ్చినట్లు వివరించారు. కారు గుర్తుకు ఓటు వేసి మరోసారి పరిగి ఎమ్మెల్యేగా గెలిపిస్తే పరిగి నియోజక వర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు తనవంతు కృషిచేస్తానన్నారు. తన తండ్రి కొప్పుల హరీశ్వర్రెడ్డి ప్రజాసేవే పరమార్థంగా ప్రజల సమస్యల పరిష్కారం కోసం పరితపించేవారని ఆయన అడుగు జాడల్లో తాను కూడా నియోజకవర్గప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేస్తానని తెలిపారు.
పరిగి నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడం కోసం ప్రభుత్వం ద్వారా భారీగా నిధులను మంజూరు చేసేందుకు కృషిచేస్తానని అన్నారు. గ్రామ గ్రామాన పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడంతో పాటు కొత్తగా చేయాల్సిన పనులు ప్రారంభించి పూర్తయ్యేవిధంగా చర్యలు తీసుకుంటానని తెలిపారు. పరిగి ప్రాంతాన్ని మరింతగా అభివృద్ధి చేయాలంటే కేవలం బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తేనే సాధ్యం అవుతుందని, బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. మండల పరిధిలోని బండవెల్కిచర్ల పాంబండ రామలింగేశ్వర స్వామికి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పూజలు నిర్వహించారు. అనంతరం ప్రచారానికి బయలు దేరి వెళ్లారు.
ఆయా కార్యక్రమాల్లో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కొప్పుల అనిల్రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు సేరి రాంరెడ్డి, ఏఎంసీ చైర్మన్ హరికృష్ణ, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు పీరంపల్లి రాజు, మండల మాజీ అధ్యక్షుడు సారా శ్రీనివాస్, మాజీ ఎంపీపీ రాజప్ప, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి లక్ష్మయ్య, మండల కోఆప్షన్ సభ్యుడు జుబేర్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సునందా బుగ్గన్న యాదవ్, సర్పంచుల సంఘం అధ్యక్షుడు శంకర్నాయక్, గుండుమల్ల నర్సింహులు, లక్ష్మయ్య, బాలయ్య, బిచ్చయ్య, అంజిలయ్య, పీరంపల్లి గ్రామ సర్పంచ్ రాధికాసోమలింగం, బొంరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ అంజిలయ్య, గ్రామస్తులు చంద్రయ్య, బండవెల్కిచర్ల ఎంపీటీసీ జ్యోతీశ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ రాములు, సాల్వీడ్ మాజీ సర్పంచ్ కొండయ్య, చెల్లాపూర్ సర్పంచ్ చంద్రయ్య, ఘనాపూర్ ఎంపీటీసీ తనయుడు వెంకట్, కామునిపల్లి గ్రామ సర్పంచ్ మైపాల్రెడ్డి, మాజీ సర్పంచ్ బాలయ్య, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.