హనుమకొండ, సెప్టెంబర్ 16 : తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవానికి హనుమకొండలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ ముస్తాబైంది. వేడుకలను ఘనంగా నిర్వహించేదుకు జిల్లా యంత్రాంగం అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. ముఖ్యఅతిథిగా చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఆయన ఉదయం 9గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తారు. తర్వాత జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యాక్రమాలపై సందేశాన్ని ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా వివిధ పాఠశాలల విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టనున్నారు.
వరంగల్ చౌరస్తా : సమైక్యతా దినోత్సవానికి వరంగల్ జిల్లా ఉన్నతాధికారులు సమీకృత కలెక్టరేట్ కార్యాలయ (ఐడీవోసీ) స్థలంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం ఉదయం 9గంటలకు నిర్వహించనున్న వేడుకలకు శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ వేడుకలకు కలెక్టర్తో పాటుగా స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, ఉద్యోగులు పాల్గొననున్నారు.