వికారాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు జిల్లా ఎన్నికల యంత్రాంగం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నది. జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ నియోజకవర్గాలకు సరిపడా ఈవీఎంలను జిల్లా కేంద్రంలోని ఈవీఎం స్ట్రాంగ్రూం నుంచి పోలీస్ కాన్వాయ్తో ప్రత్యేక వాహనంలో తరలించారు. వికారాబాద్ సెగ్మెంట్కు సంబంధించిన ఈవీఎంలను జిల్లా కేంద్రంలోని మేరీనాట్ స్కూల్లో, పరిగి సెగ్మెంట్ ఈవీఎంలను పరిగిలోని మినీస్టేడియంలో, తాండూరు సెగ్మెంట్ ఈవీఎంలను సెయింట్ మార్క్స్ స్కూల్లో, కొడంగల్ నియోజకవర్గ ఈవీఎంలను ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ల్లో భద్రపరిచారు.
ఈవీఎంల మొదటి దశ పరిశీలన ప్రక్రియ అనంతరం మొదటి దశ ర్యాండమైషన్ ప్రక్రియను ఆయా పార్టీల ప్రతినిధుల సమక్షంలో జిల్లా యంత్రాంగం పూర్తి చేసింది. మొదటి దశ ఈవీఎంల ర్యాండమైజేషన్ ప్రక్రియలో నియోజకవర్గాల వారీగా ఈవీఎంలను కేటాయించగా, తుది దశ ర్యాండమైజేషన్ ప్రక్రియలో పోలింగ్ కేంద్రాల వారీగా ఈవీఎంలను కేటాయించనున్నారు. ఈ ప్రక్రియను పోలింగ్కు మూడు రోజుల ముందు పూర్తి చేయనున్నారు. అయితే జిల్లాకు అదనంగా అవసరమైన 275 ఈవీఎంలను కొత్తగా పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు ఈసీఐఎల్ సంస్థ నుంచి జిల్లాకు తీసుకొచ్చారు.
పార్లమెంట్ ఎన్నికల షెడ్యూలు విడుదల కావడంతో సిబ్బంది నియామకం, శిక్షణ, ఈవీఎంలను సిద్ధం చేసే ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారులు పూర్తి చేశారు. ఇప్పటికే ఓటరు తుది జాబితాతోపాటు ఈవీఎంల ఫస్ట్ లెవల్ చెక్ (ఎఫ్ఎల్సీ) ప్రక్రియ అన్ని రాజకీయ పార్టీల సమక్షంలో పూర్తి కాగా.. రెండో దశ ఈవీఎంల పరిశీలన, ర్యాండమైజేషన్ను పూర్తి చేసి సోమవారం ఆయా నియోజకవర్గాలకు ఈవీఎంలను తరలించారు. ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు తలెత్తితే వెంటనే మరో ఈవీఎంను ఏర్పాటు చేసేందుకు ప్రతి పోలింగ్ కేంద్రానికీ 25 శాతం అదనంగా బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, 40 శాతం అదనంగా వీవీ ప్యాట్లను సిద్ధం చేసి తరలించారు.
పరిగి నియోజకవర్గంలో 305 పోలింగ్ కేంద్రాలకు 381 కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్లు, 427వీవీ ప్యాట్లను తరలించారు. వికారాబాద్లో 284 పోలింగ్ కేంద్రాలకు 355 సీయూలు, బీయూలు, 397 వీవీ ప్యాట్లు, తాండూరు నియోజకవర్గంలో 277 పోలింగ్ కేంద్రాలకు 346 సీ యూలు, బీయూలు, 397 వీవీ ప్యాట్లు, కొడంగల్ నియోజకవర్గంలో 282 పోలింగ్ కేంద్రాలకు 352 సీయూలు, బీయూలు, 394 వీవీ ప్యాట్లను తరలించారు.
పీవో, ఏపీవోల వివరాలు ఎంట్రీ మరోవైపు చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల విధుల్లో పాల్గొనే పీవో, ఏపీవో, ఓపీవోల వివరాలను పొందుపర్చారు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా 5,028 మంది పీవో, ఏపీవో, ఓపీవోలకు శిక్షణ ఇచ్చారు. వీరిలో 1,257 మంది పీవోలు, 1,257 మంది ఏపీవోలు, 2514 మంది ఓపీవోలున్నారు. అలాగే అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పార్లమెంట్ ఎన్నికకు ఓటర్ల సంఖ్య పెరిగిన దృష్ట్యా పోలింగ్ కేంద్రాల సంఖ్యను పెంచాలని నిర్ణయించారు. తాండూరు నియోజకవర్గంలో 8, కొడంగల్ నియోజకవర్గంలో 7 పోలింగ్ కేంద్రాలు పెరుగనున్నాయి. జిల్లాలో ప్రస్తుతం 1,133 పోలింగ్ కేంద్రాలున్నాయి. కేంద్రాల పెంపునకు ఈసీ ఆమోదం తెలిపితే వీటి సంఖ్య 1.148కి చేరనున్నది.
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా కొత్త ఓటరుగా యువత తమ పేర్లను నమోదు చేయించు కునేందుకు ఎన్నికల సంఘం ఈ నెల 15 వరకు గడువు ఇచ్చింది. మీసేవ లేదా ఆన్లైన్ ద్వారా కొత్త ఓటరుగా నమోదు చేసుకోవచ్చని సంబంధిత అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని వికారాబాద్, పరిగి, కొడంగల్ తాండూరు నియోజకవర్గాల్లో మొత్తం 9,84,068 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుషులు 4,86,109 మంది, మహిళలు 4,97,920 మంది, ఇతరులు 39 మంది ఉన్నారు.
జిల్లాలో అత్యధికంగా పరిగి నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,66,273 మంది ఉండగా.. వారిలో పురుషులు 1,33, 625 మంది, మహిళలు 1,32,639 మంది, ఇతరులు 9 మంది.. వికారాబాద్ సెగ్మెంట్ లో మొత్తం ఓటర్లు 2,31,679 మంది ఉండగా.. వారిలో పురుషులు 1,15,019 మం ది, మహిళలు 1,16,647 మంది, ఇతరులు 13 మంది.. తాండూరు సెగ్మెంట్లో మొత్తం ఓటర్లు 2,43,849 మంది ఉండగా పురుషులు 1,18,228 మంది, మహిళలు 1,25,614 మంది, ఇతరులు ఏడుగురు.. కొడంగల్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,42,267 మంది ఉండగా.. వారిలో పురుషులు 1,19,237 మంది, మహిళలు 1,23,020 మంది, ఇతరులు 10 మంది ఉన్నారు.