హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేయడంతో సరికొత్త సమస్యలకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపింది. పల్లెలను స్వయంప్రతిపత్తి దిశగా నడిపించేలా బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నది. గ్రేటర్ చుట్టూ ఉన్న 51 గ్రామాలను మున్సిపాలిటీల్లో విలీనం చేయడంతో పాలనాపరమైన ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది. గ్రామాల్లో తెల్లకాగితం మీద దరఖాస్తు ఇస్తే సమస్య పరిష్కరించుకునే అవకాశం పోనున్నది. ఏదైనా ప్రభుత్వ శాఖలకు దరఖాస్తు చేసుకోవాలంటే ఆన్లైన్ సెంటర్లను ఆశ్రయించాల్సిందే. గ్రామాల్లోనూ ఈ గవర్నెన్స్ సేవలు ప్రారంభమైనప్పటికీ.. ఇంటర్నెట్ ఆధారిత మౌలిక వసతుల లోపం కారణంగా ఆఫ్లైన్ ద్వారా కూడా సేవలు పొందే వెసులుబాటు ఉంది. కానీ మున్సిపాలిటీల్లోకి మారిన తర్వాత ఏ పని కోసమైనా ఆన్లైన్ దరఖాస్తు తప్పనిసరి. గ్రామాల నుంచి మున్సిపాలిటీలో చేరగానే గుడ్డెద్దు చేనులో పడినట్టుగా పాలనా వ్యవహారాలు మారిపోనున్నాయి. బలవంతంగానే జరుగుతున్న విలీన ప్రక్రియతో ఇంకెక్కడి ప్రజాపాలన అనే విమర్శలు వస్తున్నాయి.
బలహీనంగా ఈ గవర్నెన్స్..
గ్రామాలకు ఇంటర్నెట్ ఫలాలను అందించాలనే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ-గవర్నెన్స్ బలోపేతంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. గత ప్రభుత్వం కూడా అందుకు అనుగుణంగానే టీ ఫైబర్ పాలసీని రూపొందించి మిషన్ భగీరథ తరహాలో ప్రతి ఇంటికి ఇంటర్నెట్ అందేలా కృషి చేసింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ ఆ దిశగా అడుగులు వేయలేదు. గ్రామ్ స్వరాజ్ పేరిట గ్రామాల్లో అందే సత్వర సేవలకు మున్సిపాలిటీల్లో కలపడంతో వీల్లేకుండా పోనుంది. గ్రామాల విలీనంతో ఈ వ్యవస్థ నిర్వీర్యం కానుండగా.. మున్సిపాలిటీల్లో అందించే సేవల కోసమైన ఆన్లైన్ సెంటర్లు, మీ సేవా కేంద్రాల వెంబడి తిరగాల్సిన దుస్థితి రానున్నది.
విలీనం ఒప్పుకోం అంతా ఆన్లైన్లోనే..
పింఛన్ కోసం సర్పంచుకో, గ్రామ సెక్రటరీకో దరఖాస్తు చేస్తే మరుసటి నెల నుంచి పింఛన్ పైసలు ఇంటికే వచ్చేది. విలీన గ్రామాల ప్రజలకు ఆ సౌకర్యం లేదు. కనీసం గల్లీలో మోరీ పారుతుందని చెప్పుకునే పరిస్థితి కూడా లేదు. అధికార వికేంద్రీకరణతోనే స్థానికంగా సేవలు అందించాల్సింది పోయి… గ్రామాలను మున్సిపాలిటీల్లో విలీనం చేసి ఇబ్బందులకు గురి చేసేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకున్నది. ప్రభుత్వం నుంచి ఏదైనా సేవలు పొందాలంటే గతంలో గ్రామ సచివాలయానికి వెళితే సరిపోయేది. ఇకపై ఆయా గ్రామాల ప్రజలు దూరంలో ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల కార్యాలయాలకు వెళ్లాల్సిన దుస్థితి రానుంది. మున్సిపాలిటీల్లో చేరిన తర్వాత ప్రతిదీ ఆన్లైన్ సెంటర్లు, మీ సేవ కేంద్రాలను ఆశ్రయించి, దరఖాస్తుల పేరిట జేబులు ఖాళీ చేసుకుంటే గానీ సాధ్యం కాదు.