విజ్ఞానాన్ని అందించే ల్రైబ్రరీల ఆధునీకరణపై ప్రభుత్వం దృష్టి సారించింది. మరుగునపడిన, శిథిలావస్థకు చేరిన లైబ్రరీలను పునరుద్ధరించి ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నది. డిజిటల్ లైబ్రరీలను ఏర్పాటు చేస్తున్నది. రంగారెడ్డి జిల్లాలో ఒక జిల్లా గ్రంథాలయంతోపాటు 24 శాఖ, 7 గ్రామీణ లైబ్రరీలు ఉన్నాయి. ఇంకా జిల్లాలో మండలానికో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. అదేవిధంగా రూ.8.5కోట్లతో గ్రంథాలయాలకు నూతన భవనాలను నిర్మించనున్నది. ఈ నెల 20 వరకు గ్రంథాలయ వారోత్సవాలు జరుగనుండగా.. పఠనాలయాల ప్రాముఖ్యత తెలిపేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
రంగారెడ్డి, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ) : గ్రంథాలయాల వారోత్సవాల్లో భాగంగా రంగారెడ్డి జిల్లాలోని పలు గ్రంథాలయాలను ప్రభుత్వం తీర్చిదిద్దుతున్నది. జిల్లావ్యాప్తంగా సుమారు 1500 జనాభా కలిగిన ప్రతి గ్రామంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ద్వారా గ్రంథాలయం ఏర్పాటు, ప్రతి మండల కేంద్రంలో డిజిటల్ గ్రంథాలయ సేవలను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది. శిథిలావస్థలో ఉన్న పురాతన గ్రంథాలయ భవనాలు ఇరుకైన గదుల్లో ఉన్నాయి. అవి పాఠకులకు అసౌకర్యంగా ఉండి అనుకూలంగా లేక, అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. వాటిని ప్రభుత్వం తీర్చిదిద్దుతూ, పాఠకులు చదువుకునేలా సౌకర్యాలు కల్పిస్తున్నది. గ్రంథాలయాల్లో ఆహ్లాదకర వాతావరణం ఉండి విజ్ఞానాన్ని పంచే పుస్తకాలు పాఠకులను ఆకర్షించేలా, వారు చదువుకునేందుకు ప్రేరణ కలిగించేలా గ్రంథాలయాలను ప్రభుత్వ యంత్రాంగం ఆధునీకరిస్తున్నది.
జిల్లాలో రూ.8.5కోట్ల నిధులతో నూతన భవనాలు
జిల్లాలో పాడుబడ్డ గ్రంథాలయాల భవనాల స్థానంలో కొత్త భవనాలు రానున్నాయి. మరికొన్ని చోట్ల నూతన భవన నిర్మాణాలకు శంకుస్థాపనలు జరుగనున్నాయి. రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా ఒక జిల్లా కేంద్ర గ్రంథాలయం, 24 శాఖా గ్రంథాలయాలు, ఏడు గ్రామీణ గ్రంథాలయాలు కొనసాగుతున్నాయి. జిల్లావ్యాప్తంగా ఉన్న గ్రంథాలయ భవనాల్లో శిథిలావస్థకు చేరిన షాద్నగర్, శంషాబాద్, ఆమనగల్లు, మంచాల, కొత్తూరు, షాబాద్లలో గ్రంథాలయ సంస్థ నిధులు రూ.8.5 కోట్లతో నూతన భవనాలను నిర్మిస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం షాద్నగర్ భవన నిర్మాణం పూర్తై ప్రారంభానికి సిద్ధంగా ఉంది. శంషాబాద్, ఆమనగల్లు భవన నిర్మాణాలు చివరి దశలో ఉన్నాయి. బడంగ్పేటలో అర ఎకరం స్థలంలో అధునాతన హంగులతో రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా మూడంతస్తుల భవనాన్ని నిర్మించి పాఠకులకు అందుబాటులోకి తెచ్చింది.
పోటీ పరీక్షలకు పలు రకాల పుస్తకాలు అందుబాటులో..
ప్రస్తుతం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగుల కోసం గ్రంథాలయ సంస్థ నిధులు రూ.10లక్షలతో పలు రకాల పుస్తకాలను జిల్లా గ్రంథాలయ సంస్థ అందుబాటులో ఉంచింది. త్వరలో రూ.30లక్షలతో జనరల్ పుస్తకాలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేపడుతున్నది. చేవెళ్ల, శేరిలింగంపల్లి, తారానగర్, వనస్థలిపురం, కొందుర్గులో నూతన భవనాలను నిర్మించేందుకు ప్రభుత్వ యంత్రాంగం స్థల సేకరణకు కసరత్తు చేపట్టింది. ఇంకా సంస్థ నిధులు, మంత్రి సబితారెడ్డి సహకారంతో పౌర పఠన మందిరాలు అధిక జనాభా కలిగిన గ్రామాల్లో ప్రారంభించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. జిల్లా గ్రంథాలయ సంస్థ ప్రస్తుతం ప్రయోగాత్మకంగా బాలాపూర్ మండలంలోని జిల్లెలగూడ, మీర్పేట, కందుకూరు మండలంలోని తిమ్మాపూర్, మాదాపూర్, మహేశ్వరం మండలంలోని మంఖాల్, రావిర్యాలలో పబ్లిక్ రీడింగ్ గదులను ఈ వారోత్సవాల్లో అధికార యంత్రాంగం ప్రారంభించనున్నది.
ప్రతి ఒక్కరికీ పుస్తక పఠనం తప్పనిసరి
– సబితారెడ్డి, విద్యాశాఖ మంత్రి
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆధునిక పోకడలు సంతరించుకుంటున్నాయి. తరాలు మారుతున్నాయి. అందుకు తగినట్లుగానే జిల్లాలో లైబ్రరీలు కూడా రూపం మార్చుకుంటున్నాయి. మన సమాజం విజ్ఞానదాయక సమాజంగా ఎదగాలంటే గ్రంథాలయాలు అవసరమని, గ్రంథాలయాలను మనం కాపాడుకోవడం మన అందరి సామాజిక బాధ్యత అన్న సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆలోచనలు, మనోభావాల మేరకు జిల్లావ్యాప్తంగా పఠనాలయాల పురోగతికి అడుగులు పడుతున్నాయి. తెలంగాణ ప్రజలు, ఉద్యోగార్థులు, నిరుద్యోగులు, విద్యార్థులు ప్రగతి పథంలో నడవాలంటే పుస్తక పఠనం తప్పనిసరి. అందుకే విజ్ఞాన భాండగారాలైన గ్రంథాలయాలను తీర్చిదిద్దుకుంటున్నాం. జిల్లా ప్రతి మండలానికి ఓ డిజిటల్ లైబ్రరీ ఉండేలా, దాని సేవలు ప్రజలకు అందేలా తెలంగాణ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటున్నది.
పుస్తక పఠనం ప్రాముఖ్యత తెలిపేలా ఉత్సవాలు
– కప్పాటి పాండు రంగారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్
జిల్లాలో గ్రంథాలయాల ప్రాముఖ్యతను తెలిపేలా వారోత్సవాలను నిర్వహిస్తున్నాం. గత పాలకుల వివక్ష వల్ల గ్రంథాలయాలు మరుగున పడిపోయాయి. సీఎం కేసీఆర్ నేతృత్వంలో మంత్రి కేటీఆర్ ఆలోచనకు అనుగుణంగా, పాఠకుల అభిరుచికి తగినట్లుగా అనేక నూతన గ్రంథాలయాల నిర్మాణం, ప్రాచీన గ్రంథాలయాలను ఆధునీకరించాం. కరోనా ఎన్నికల నిబంధనలతో మూడేండ్ల నుంచి వారోత్సవాలు జరుపుకోలేదు. ఈ నెల 20 వరకు జరిగే వారోత్సవాల్లో విద్యార్థులు, పాఠకులు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలి.