షాబాద్, డిసెంబర్ 27: తెలంగాణ ప్రభుత్వ హయాంలో గ్రామ పంచాయతీలన్నీ అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయి. పల్లెప్రగతితో గ్రామాలను, తండాలను అభివృద్ధి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇక కొత్త పంచాయతీ భవనాలను నిర్మించనున్నది. వాటిలో కొత్తగా ఏర్పాటు చేసిన జీపీలతో పాటు శిథిలావస్థకు చేరిన పాత భవనాల స్థానంలో కొత్తవి ఏర్పాటు కానున్నాయి. ప్రజలకు పరిపాలన సౌలభ్యం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగేండ్ల్ల క్రితం 500 జనాభా కలిగిన చిన్న పల్లెలు, గిరిజన తండాలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేశారు. వీటికి 2019లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. అప్పటి నుంచి కొత్త పంచాయతీ భవనాలు లేకపోవడంతో అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాల భవనాలు, ఇతర అద్దె భవనాల్లో పంచాయతీ కార్యాలయాలు కొనసాగుతున్నాయి. వీటితో పాటు పాత పంచాయతీ భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తాజాగా కొత్త పంచాయతీ భవనాలు మంజూరు చేసింది. ఒక్కో భవనానికి రూ.20లక్షల నిధులతో ఆధునిక హంగులతో పక్కా భవనాలు నిర్మించనుంది. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాగానే పనులు ప్రారంభించనున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో జిల్లాలోని ఆయా గ్రామాల సర్పంచులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రంగారెడి ్డజిల్లా వ్యాప్తంగా చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, ఆమనగల్లు (కల్వకుర్తి), రాజేంద్రనగర్ నియోజకవర్గాల పరిధిలోని 25 మండలాల్లో మొత్తం 558 పంచాయతీలున్నాయి. వీటిలో పాత, కొత్త పంచాయతీలు కలిపి మొత్తం 123 పంచాయతీ భవనాలను ప్రభుత్వం ఇటీవలే మంజూరు చేసింది. ఒక్కో భవనానికి రూ.20లక్షల చొప్పున రూ.24.60కోట్లు నిధులు విడుదల చేయనుంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పల్లెప్రగతితో గ్రామాల రూపురేఖలు మారిపోతున్నాయి. గ్రామాలకు ప్రతినెలా ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుంది. తడి, పొడి చెత్త సేకరించి కంపోస్ట్యార్డుకు తరలిస్తున్నారు. హరితహారంలో నాటిన మొక్కలకు నీరుపోసి సంరక్షిస్తున్నారు. భవనాలు లేకపోవడంతో అద్దె భవనాలు, శిథిలావస్థకు చేరుకున్న భవనాల స్థానంలో కొత్త పంచాయతీ భవనాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిధులు విడుదల కాగానే పంచాయతీ భవనాల నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు.
ఏళ్ల తరబడిగా పంచాయతీ భవనాలు లేకపోవడంతో శిథిలావస్థకు చేరుకున్న భవనాల్లో పంచాయతీ కార్యాకలాపాలు నిర్వహిస్తున్నారు. కొత్త భవనాలు మంజూరు చేయాలని గతంలో ఉన్న ప్రభుత్వాలకు పలుమార్లు విన్నవించిన పట్టించుకోలేదు. గ్రామ పంచాయతీల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త పంచాయతీ భవనాలు మంజూరు చేయడం హర్షణీయమని పలువురు ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. నూతనంగా ఏర్పాటు చేయనున్న జీపీ భవనాలు ఆధునిక హంగులతో నిర్మించనున్నారు. కొత్త భవనాల ఏర్పాటుతో ఇబ్బందులు తప్పనున్నాయని సర్పంచులు చెబుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పంచాయతీ భవనాలు మంజూరు చేయడం సంతోషకరం. మా గ్రామంలో పంచాయతీ భవనం శిథిలావస్థకు చేరి పూర్తిగా కూలిపోయింది. ప్రస్తుతం పంచాయతీ కార్యాలయాన్ని డ్వాక్రా భవనంలో నిర్వహిస్తున్నాం. పల్లెప్రగతితో గ్రామాల రూపురేఖలు మారుస్తున్న సీఎం కేసీఆర్, కొత్త జీపీ భవనాలు మంజూరు చేయడం గొప్ప పరిణామం. ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. – పి.కేతనరమేశ్యాదవ్, సర్పంచ్, కుమ్మరిగూడ
మా గ్రామం కొత్త పంచాయతీగా ఏర్పడింది. గత నాలుగేండ్లుగా నేను సర్పంచ్గా ప్రజలకు సేవలందిస్తున్నాను. పంచాయతీకి సొంత భవనం లేకపోవడంతో అంగన్వాడీ భవనంలో కార్యాలయాన్ని కొనసాగి స్తున్నాం. దీంతో ఇబ్బందిగా మారింది. ప్రభుత్వం కొత్త పంచాయతీ భవనం మంజూరు చేయడం సంతోషంగా ఉంది. నిధులు విడుదల కాగానే ఆధునిక హంగులతో కొత్త భవనాన్ని నిర్మిస్తాం.
– కుమ్మరి దర్శన్, సర్పంచ్, సంకెపల్లిగూడ