సిటీబ్యూరో, డిసెంబర్ 18(నమస్తే తెలంగాణ) : పోషకాహార లోపం, డయాబెటిస్, ఒబెసిటీ వంటి దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి జాతీయ పోషకాహార సంస్థ(ఎన్ఐఎన్) బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రెండేండ్లపాటు దేశంలోని అన్ని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ అధ్యయనం సాగనున్నది. సమస్యాత్మకంగా మారుతున్న అనారోగ్య సమస్యల పరిష్కారానికి సులభంగా పాలసీలను రూపొందించడానికి ఈ అధ్యయనం సహాయపడుతుందని ఎన్ఐఎన్ పరిశోధకులు తెలిపారు. అన్ని రాష్ర్టాల వారీగా ఆహారపు అలవాట్లు, వండిన ఆహారంలో ఉన్న పోషకాలు, శరీరానికి కావాల్సిన పోషక విలువలు, పోషకాహార లోపంతో వచ్చిన రుగ్మతలపై అధ్యయనం చేయడమే లక్ష్యంగా డైట్ అండ్ బయోమేకర్ సర్వే ఇన్ ఇండియా పేరిట ఎన్ఐఎన్ సర్వే చేయనున్నది.
ఈ అధ్యయనంలో డైట్, న్యూట్రీషియన్, ఆరోగ్య లక్షణాలు, ఎనిమియా, ఒబెసిటీ, డయాబెటిస్ వంటి రుగ్మతలతో బాధపడుతున్న ప్రాంతాలను గుర్తించి, నియంత్రణ చర్యలు చేపట్టనున్నది. అదేవిధంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల వారీగా పోషకాహారంపై అవగాహన, పాలసీ రూపకల్పన మధ్య ఉన్న అంతరాన్ని భర్తీ చేసే విధంగా సర్వే చేయనున్నట్లు తెలిపారు. వండిన ఆహార పదార్థాల్లోని పోషక విలువలను తొలిసారిగా ఈ సర్వే ద్వారా ఎన్ఐఎన్ వెల్లడించనున్నది. దేశంలో పెరుగుతున్న డయాబెటిస్, ఒబెసిటీ వంటి కీలకమైన అనారోగ్య సమస్యల నియంత్రణకు అమలు చేయాల్సిన వ్యూహాలను ఈ సర్వే ద్వారా రూపొందించడానికి వీలు ఉంటుందని ఎన్ఐఎన్ డైరెక్టర్ డాక్టర్ హేమలత తెలిపారు. అయితే గతంలోనూ మాల్ న్యూట్రీషియన్, ఎనిమియా వంటి రుగ్మతల స్థితిగతులను ఎన్ఐఎన్ అధ్యయనం చేసింది. కరోనా తర్వాత జాతీయ స్థాయిలో తొలిసారి సాగనున్న ఈ సర్వేను పూర్తిగా డిజిటల్ రూపంలోనే చేయనున్నారు. ఆన్లైన్ వేదికగా సాగే అధ్యయనంతో విశ్లేషణ సులభంగా పూర్తి చేయనున్నది.