మొదటినుంచి తెలంగాణపై సవతిప్రేమ చూపిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ రాజ్యసభలో మన రాష్ట్రంపై మరోసారి విషం కక్కారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రసంగించిన ప్రధాన మంత్రి ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడటంపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉద్యమకారులు, ప్రజలు భగ్గుమన్నారు. ప్రధానమంత్రి హోదాలో ఉండి కూడా బాధ్యతారహితంగా మాట్లాడటంపై అన్నివర్గాల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతున్నది. అన్ని కేటాయింపుల్లోనూ రాష్ర్టానికి అన్యాయం చేయడమే కాకుండా రాష్ట్ర విభజనపై ఇష్టారీతిన మాట్లాడటం ఎంతవరకు సబబు అని తెలంగాణవాదులు ప్రశ్నిస్తున్నారు. బీజేపీ నేతలు ఈ వ్యాఖ్యలపై సమాధానం చెప్పకుంటే బయట తిరుగనివ్వబోమంటూ హెచ్చరిస్తున్నారు. ఏడేండ్ల నుంచి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉన్నా విభజన హామీలు నెరవేర్చకుండా, తగిన నిధులు కేటాయించకుండా చోద్యం చూస్తున్న మాట వాస్తవం కాదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నిలువెల్లా విషం నింపుకున్న ప్రధాని తెలంగాణపై అక్కసు వెళ్లగక్కడం మానకుంటే ఆ పార్టీకి పుట్టగతులుండవని హెచ్చరిస్తున్నారు.
– రంగారెడ్డి, ఫిబ్రవరి 8(నమస్తే తెలంగాణ)
ప్రధాని మోదీ మరోసారి తెలంగాణపై విషం చిమ్మారు. విభజన అంశంలో ఏ ఒక్కదాన్ని కూడా పట్టించుకోని మోదీ, విభజన తీరు సరిగ్గా జరుగలేదంటూ చేసిన వ్యాఖ్యలతో మరోసారి తెలంగాణ వ్యతిరేకి అని నిరూపించుకున్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు. మోదీ వ్యాఖ్యలపై జిల్లా టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పట్టించుకోకుండా బీజేపీ విస్మరించిందన్నారు. 2004లోనే తెలంగాణ ప్రత్యేక రాష్ర్టాన్ని ఇచ్చుంటే విద్యార్థులు అమరులయ్యేవారా అని ప్రశ్నించారు. బీజేపీ ఓట్ల కోసం కొత్త డ్రామాలాడుతుందని, ఎన్నో ఏండ్ల పోరాట ఫలితంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంపై విషం చిమ్మి
జిమ్మిక్కులు చేస్తున్న బీజేపీకి తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా, ఐటీఐఆర్ తెలంగాణకు ఇచ్చిన హామీలను పట్టించుకోని ప్రధాని మోదీకి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై మాట్లాడే హక్కులేదన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమయం వచ్చినప్పుడల్లా తెలంగాణ మీద విషం కక్కుతున్నారు. మంగళవారం రాజ్యసభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ తలుపులు వేసి తెలంగాణ ఇచ్చారని, రాష్ర్టాన్ని బలవంతంగా విడగొట్టారంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని లేపుతున్నాయి. మోదీ వ్యాఖ్యల పట్ల తెలంగాణ ప్రజలు మండిపడుతున్నారు. అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. తెలంగాణ సమాజానికి ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమంటూ చేసిన వ్యాఖ్యలు సరికావంటున్నారు. ఏ స్ఫూర్తితో, ఎవరిని అడిగి తెలంగాణలోని 7 మండలాలు, లోయర్ సీలేరు ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్లో కలిపారని పలువురు ప్రశ్నిస్తున్నారు. సీఎం కేసీఆర్ పరిపాలన దక్షతతో అతి తక్కువ కాలంలోనే రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతున్నది. మరోవైపు సంక్షేమ రంగంలోనూ దేశంలోనే నంబర్ వన్గా నిలుస్తున్నది. అన్ని రంగాల్లో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుండగా, ఇందుకుగాను కేంద్ర ప్రభుత్వం సాయం చేయకపోగా తెలంగాణను అపహాస్యం చేస్తూ మాట్లాడడం సరికాదంటున్నారు. వందలాది మంది ప్రాణాలు పోవడానికి కారణం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలని అంటున్నారు. రాష్ట్ర విభజన చట్టంలో చెప్పిన అంశాలు అమలు చేయలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. తెలంగాణ వచ్చిందని ప్రజలు సంతోషపడుతుండగా ప్రధానమంత్రి అక్కసు వెళ్లగక్కడం విడ్డూరంగా ఉందంటున్నారు.
– పరిగి, ఫిబ్రవరి 8:
తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతున్నది. తెలంగాణ రాష్ట్రం సాధించడానికి వందలాది మంది విద్యార్థుల ఆత్మబలిదానాలతోనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వచ్చిన తెలంగాణ రాష్ర్టానికి నిధులు ఇచ్చి అభివృద్ధి చేయాల్సిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పద్ధతి ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడలేదనే వ్యాఖ్యలు చేయడం సరికాదు. ప్రధానమంత్రి స్థాయిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలి.
– గుండుమల్ల నర్సింహులు, దళిత సంఘాల సలహాదారు, కులకచర్ల
రాష్ట్ర విభజన సరిగ్గా జరుగలేదుని రాజ్యసభలో ప్రధానమంత్రి మాట్లాడటం అమానుషం. ప్రధానమంత్రి స్థాయిలో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడటం, అమరవీరులను హేళన చేయడమే. తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడానికి చాలా ఏండ్లు పట్టింది. రాష్ర్టాన్ని సాధించడానికి వందలాది మంది విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకున్నారు. వారి ఫలితమే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. – మందిపల్ వెంకట్, పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర కార్యదర్శి, కులకచర్ల
ఎన్నో పోరాటాలు, ఎంతోమంది త్యాగాల ఫలితంగా ఆవిర్భవించిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం పట్ల ప్రధానమంత్రి నరేంద్రమోదీ అనుచిత వ్యాఖ్యలు చేయటం సరైన పద్ధతి కాదు. ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి, నాటి ఉద్యమ రథసారథి, ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో సాధించుకున్న తెలంగాణ నేడు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నది. అదిచూసి ఓర్వలేకనే బీజేపీ ప్రభుత్వం చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నది.
– బోడ చంద్రప్రకాశ్, ఉద్యమ నాయకులు (ఇబ్రహీంపట్నం)
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు. నాటి ఉద్యమంలో చావు అంచుల వరకు వెళ్లి పోరాడిన ముఖ్యమంత్రి కేసీఆర్తోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. పేదరికంలో ఉన్న తెలంగాణాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేని నరేంద్రమోదీ అనవసర రాజకీయాలు చేయటం సరైంది కాదు. దేశ ప్రధానిగా ఉండి కూడా ఇలాంటి మాటలు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది.
– బర్ల జగదీశ్యాదవ్, ఉద్యమ నాయకుడు (ఇబ్రహీంపట్నం)
తెలంగాణ ఏర్పాటు సమయంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంట్ తలుపులు మూసి ఏకపక్షంగా తెలంగాణ బిల్లుకు ఆమోద ముద్ర వేసిందని వ్యాఖ్యానించడం ప్రధానికి తగదు. కేంద్రానికి అధికశాతం పన్నులు తెలంగాణ నుంచే వెళుతున్నాయి. రాష్ర్టానికి రావాల్సిన నిధుల గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం కేంద్రాన్ని నిలదీయడం వల్లే ప్రధాని మోదీ రాష్ట్రంపై అక్కసు వెళ్లగక్కుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించకుండా, రాష్ర్టానికి రావాల్సిన ట్రైబల్ యూనివర్సిటీని ఇవ్వకపోగా, రావాల్సిన నిధులు రానివ్వకుండా తీరని అన్యాయం చేస్తున్నారు.
– రాంబల్నాయక్, రాష్ట్ర టీఆర్ఎస్ నాయకుడు
రాష్ట్ర విభజనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజ్యసభలో ప్రస్తావించిన తీరు సిగ్గుచేటుగా ఉంది. మతాలను రెచ్చగొట్టే బీజేపీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును ఓర్వలేక పోతున్నది. అన్ని రంగాల్లో తెలంగాణ ఆదర్శంగా ఉంటే మోదీకి నచ్చడం లేదు. ఏ అధికారంతో ఏడు మండలాలను ఏపీలో కలిపారు. సీలేరు పవర్ ప్లాంట్ను దుర్మార్గంగా ఆంధ్రకు అప్పగించలేదా..? కేంద్ర సర్కార్ రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం ఇవ్వకపోగా, నోటికి వచ్చినట్లు మాట్లాడడం పద్ధతి కాదు.
– దత్తాత్రేయ , తెలంగాణ ఉద్యమకారుడు, తాండూరు
తెలంగాణ, ఆంధ్ర విభజనపై ప్రధాని విషం కక్కినట్లు మాట్లాడడం పద్ధతి కాదు. తెలంగాణలో టీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేని బీజేపీ రాష్ట్రంపై ఆరోపణలో చేయడం మానుకోవాలి. ఏడేండ్ల పాలనలో బీజేపీ రాష్ర్టానికి ఏమి ఇచ్చింది..? దేశానికి ఏం చేసింది..? నిరుద్యోగుల కోసం మోదీ ఎప్పుడూ మాట్లాడలేదు. యువకుల గోస పట్టదా..?అభివృద్ధిలో తెలంగాణ గుజరాత్ను దాటుతుందనే మోదీకి అక్కసు.
– నీరజ, టీఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిలర్, తాండూరు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి తీరని అన్యాయం జరిగింది. ఏ పార్టీ.. ఏ ప్రభుత్వం.. తెలంగాణ రాష్ర్టాన్ని ఉట్టిగనే ఇయ్యలేదు. ఏండ్లుగా ప్రభుత్వంతో కొట్లాడి, ఉద్యమాలు చేసి ప్రత్యేక రాష్ర్టాన్ని తెచ్చుకున్నం. ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ ప్రజల కల. రాష్ట్రంలో వందల మంది అమరుల ప్రాణ త్యాగ ఫలం. రాస్తారోకోలు, ధర్నాలు, ఉద్యమాల ఫలితం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు అమానుషం. తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నవి. మోదీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి.
– జొల్లు బాలయ్యయాదవ్, తెలంగాణ ఉద్యమకారుడు. కొత్తూరు మండలం
తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికీ తెలంగాణ విభజన అంశంపై రాజ్యసభలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్యబద్ధం కాదు. తెలంగాణ రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టగా బీజేపీ ఎంపీలు సంపూర్ణ మద్దతు తెలిపిన విషయం ప్రధానమంత్రి నరేంద్రమోదీకి తెలియదా..? తెలంగాణ రాష్ట్ర విభజన న్యాయబద్ధంగా జరగలేదని ఏడేండ్ల తరువాత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి గుర్తుకు వస్తుందా..? బీజేపీ నేతలు తెలంగాణ అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదు. ప్రధాని ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై తెలంగాణ బీజేపీ నేతలు తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు సమాధానం చెప్పాలి.
– జె.స్వప్న, తెలంగాణ ఉద్యమ నాయకురాలు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై రాజ్యసభలో ప్రధాని చేసిన వ్యాఖ్యలు సరికాదు. 14ఏండ్ల సుదీర్ఘ పోరాటం చేసి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించిన గొప్ప ఉద్యమ నాయకుడు కేసీఆర్. అభివృద్ధిలో తెలంగాణ ఇతర రాష్ర్టాల కంటే ముందు వరుసలో నిలువడం జీర్ణించుకోలేక ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదు. తెలంగాణ అభివృద్ధికి సహకరించకుండా లేనిపోని ఆరోపణలు చేస్తే కేంద్ర ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు.
– మద్దూరు మల్లేశ్, ఉద్యమకారుడు, షాబాద్
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడడం బీజేపీకి ఇష్టంలేదు. దీనికి నిదర్శనమే రాజ్యసభలో ప్రధాని తెలంగాణపై చేసిన వ్యాఖ్యలు. అభివృద్ధిలో తెలంగాణ.. గుజరాత్ రాష్ర్టానికి కంటే వేగంగా ముందుకు సాగుతుండడంతో బీజేపీకి మింగుడు పడడం లేదు. ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. రానున్న రోజుల్లో సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణగా అభివృద్ధి చెందడం ఖాయం.
– కుమ్మరి దర్శన్, ఉద్యమకారుడు, షాబాద్
ఎంతో మంది త్యాగాలు, పోరాటాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ర్టాన్ని రాజ్యసభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం తగదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును బీజేపీ ప్రభుత్వం వ్యతిరేకించడమంటే యావత్తు తెలంగాణ ప్రజానీకాన్ని అవమానించడమే. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం సీఎం కేసీఆర్ సారథ్యంలో పోరాడి సాధించుకున్న తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాతే.. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమానికి అనేక పథకాలను అమలు చేస్తున్నారు.
-చందోజీ, ఉద్యమకారుడు, కడ్తాల్ మండలం
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సరైన విధంగా చేయలేదని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలు చేయడం సరైంది కాదు. రెండు రాష్ర్టాల మధ్య గొడవలు పెట్టేలా మాట్లాడారు. రెండుసార్లు దేశ ప్రధానమంత్రిగా ఉంటూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నిధులు కేటాయించలేదు. నరేంద్రమోదీ తెలుగు రాష్ర్టాల్లో తన పార్టీని బలోపేతం చేసుకునేందుకే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలను ఉద్యమకారులుగా మేము పూర్తిగా ఖండిస్తున్నాం.
-టి.రాజేందర్, పూడూరు మండలం, తెలంగాణ ఉద్యమకారుడు
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నుంచి కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతూనే ఉంది. ఎన్నో ఉద్యమాలు చేసి జైలుపాలై కొట్లాడి తెలంగాణ రాష్ర్టాన్ని తెచ్చుకున్నాం. రాష్ట్రం ఏర్పాటుపై ప్రధానమంత్రి వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నది. ప్రధాని తన స్థాయిని మరిచి దిగజారే వ్యాఖ్యలు చేసిండ్రు.
-ఎండి సజ్జుపాషా, తెలంగాణ ఉద్యమకారుడు
తలకొండపల్లి మండలం