పెద్దేముల్, డిసెంబర్ 6 : మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయంలో కూడా కొత్త కొత్త ఒరవడులు సృష్టిస్తూ వ్యవసాయాన్ని చేస్తూ వివిధ రకాల పంటలపై లక్షల రూపాయలను సంపాదిస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం రుద్రారం గ్రామానికి చెందిన రైతు ద్యావరి నారాయణ సేంద్రియ వ్యవసాయంలో భాగంగా సేంద్రియ కంది సాగును చేస్తూ లక్షల రూపాయలను సంపాదిస్తున్నాడు.
ముఖ్యంగా 2016వ సంవత్సరంలో తాండూరు నియోజకవర్గంలోని జిన్గుర్తి సమీపంలోగల ఏకలవ్య ఫౌండేషన్లో రైతులకు కల్పించిన అవగాహనలో భాగంగా రైతు ద్యావరి నారాయణ పద్మారము మనోహరచారి 14 సంవత్సరాలుగా చేస్తున్న సేంద్రియ వ్యవసాయానికి ఆకర్షితులై మహారాష్ట్రకు చెందిన సుభాష్ పాలేకర్ సుమారు 9 రోజులపాటు శంషాబాద్లోని ముచ్చింతల్లో సుమారు 3వేల మంది రైతులకు సేంద్రియ వ్యవసాయంలో ఇచ్చిన శిక్షణతో ఆయన చెప్పిన మాట ‘ఒక ఆవు ఉంటే 6 ఎకరాల పంట సాగు సేంద్రియ వ్యవసాయంతో చేయవచ్చనే మాటకు ఆకర్షితులై రైతు ద్వావరి నారాయణ అప్పటి నుంచి మొదలు పెట్టి సుమారు కొన్ని సంవత్సరాలుగా సేంద్రియ వ్యవసాయంలో భాగంగా 15 ఎకరాల్లో కంది పంటను సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తున్న లక్షలు గడిస్తున్నాడు.
వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం రుద్రారం గ్రామానికి చెందిన ద్యావరి నారాయణ డిగ్రీ పూర్తి చేయకుండానే 1982 నుంచి 2022 వరకు సుమారు 40సంవత్సరాలుగా వ్యవసాయాన్నే నమ్ముకొని జీవనం కొనసాగిస్తున్నాడు. నారాయణకు 7 సంవత్సరాలు గణపతి షుగర్స్ ఫ్యాక్టరీ, 5 సంవత్సరాలు ఉత్తర్ప్రదేశ్లోని త్రివేణీ షుగర్ ఇండస్ట్రీస్లో పనిచేసిన అనుభవం ఉంది. నారాయణకు మొత్తం 9 ఎకరాల పొలంతో పాటు 7 ఆవులు, 8 కోడదూడలు, ఒక ట్రాక్టర్ ఉన్నది. నారాయణ తనకున్న మొత్తం 9 ఎకరాల్లో సేంద్రియ కందిసాగును చేస్తూ అందులో అంతర పంటలు పెసర, మినుములను సాగు చేస్తున్నాడు.
వ్యవసాయంలో అనేక సార్లు నష్టాల్లో కూరుకుపోవడంతో రైతు నారాయణ వ్యవసాయంలో నూతన ఒరవడిని సృష్టించాలని నిర్ణయించుకొన్నాడు. అందుకు అనుగుణంగా అనేక రైతు అవగాహన సదస్సులకు హాజరై వ్యవసాయ మెళకువలను తెలివిగా తెలుసుకొన్నాడు. ఆ దిశగా తన వ్యవసాయ పొలంలో సేంద్రియ పద్ధతులలో కంది పంటను సాగు చేసి అనేక రకాలుగా లాభాలను పొందుతున్నారు.
సేంద్రియ పద్ధతులలో భాగంగా సుభాష్ పాలేకర్ పద్ధతులతో ఉండే వ్యవసాయ సాగు పద్ధతులను రైతు నారాయణ ఆకర్షితుడై వాటిని అవలంబించాడు. ఈ మేరకు నూతన యాజమాన్య పద్ధతులను పాటిస్తూ సేంద్రియ పద్ధతిలో సుమారు 15 ఎకరాల్లో కంది పంటను సాగు చేస్తున్నాడు. అందులో 7 ఎకరాల్లో టీడీఆర్జీ59 రకాన్ని, 5 ఎకరాల్లో ఐసీపీఎల్ 87119, మరో 3 ఎకరాల్లో బీఎస్ఎంఆర్ 736 అనే మూడు రకాల విత్తన వంగడాలను ఎంపిక చేసుకొని కంది పంటను సాగు చేస్తున్నాడు. ఇందులో ఇక్రిశాట్ వారు ఇచ్చిన విత్తనాలు ఆశ (ఐసీపీఎల్ 87119)ను సాగుచేస్తే అధిక మొత్తంలో దిగుబడి వస్తుంది. దీనిని పప్పును చేసుకోవడానికి సులువుగా ఉంటుందని ఉపయోగిస్తున్నాడు. సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్న 15 ఎకరాలు కందిలో మినుములు, పెసర్లు, అల్లం తదితర అంతర పంటలను సాగుచేస్తున్నాడు.
1 ఎకరాకు 10 క్వింటాళ్లు, క్వింటాల్ కందులు రూ.16వేలు.. ఎకరాకు రూ.1 లక్ష.., 15ఎకరాలకు రూ.15లక్షల ఆదాయం వస్తుంది. మాములు కందులు క్వింటాల్ ధర రూ.6,600 వందలు అయితే సేంద్రియ కందులు క్వింటాల్ ధర రూ.16 వేలు ఉంది. ఇదే ప్రధానమైనతేడా. సేంద్రియ కంది సాగు చేయడానికి విత్తనం వేసిన నుంచి సుమారు 180 రోజుల్లో పంట చేతికి వస్తుంది. కాగా కంది సాగులో భాగంగా 180 రోజుల్లో జీవామృతాన్ని 3, 5 సార్లుగా, ఘణ జీవామృతాన్ని 1 టన్ను, వేస్ట్ డీ కంపౌజర్ను పంట కలుపు తీసేందుకు ఉపయోగిస్తూ సాగు మొదలు పెడతారు. మాములుగా కంది సాగులో ఎకరాకు 4,6 క్వింటాళ్లు పండిస్తే .. సేంద్రియ కంది సాగులో 180 రోజులకు 1ఎకరాకు 10, 11 క్వింటాళ్ల కందులను పండించవచ్చు. ఈ విధంగా సేంద్రియ సాగులో ఒక ఎకరా రూ.20 వేలు ఖర్చు పెడుతూ ఎకరాకు 10, 11 క్వింటాళ్ల కందులు పండిస్తూ సుమారు రూ.9 లక్షల వరకు సంపాదిస్తూ మిగతా రైతులకు నారాయణ ఆదర్శంగా నిలుస్తున్నాడు.
ద్యావరి నారాయణ సేంద్రియ వ్యవసాయ రంగంలో రాణించడానికి ప్రధానంగా జిన్గుర్తిలో ఉన్న ఏకలవ్య ఫౌండేషన్, ఏఆర్ఎస్ (తాండూరు వ్యవసాయ పరిశోధనా సొసైటీ), డాట్ సెంటర్, రైతునేస్తం అనే ప్రధానమైన సంస్థలు సహకరిస్తున్నాయి. నారాయణ పండించిన కందులు ప్రస్తుతం ‘తెలంగాణ కంది-3 టీడీఆర్జీ-59 రకంగా మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చి రైతులకు మంచి దిగుబడిని ఇచ్చే విత్తనాలుగా మనుగడలో ఉన్నాయి.
సేంద్రియ వ్యవసాయంలో కంది సాగు పద్ధతులలో ముందుగా ఏప్రిల్ మాసంలో పెద్ద నాగళ్లతో నేలను చదును చేయాలి. ఎరువులను నేలలో చల్లి మే మాసంలో బెడ్స్ను సిద్ధం చేసుకోవాలి. జూన్ నెల మొత్తాన్ని జంటసాళ్ల పద్ధతిలో సాగుచేయడానికి ఏర్పాట్లు చేసుకోవాలి. విత్తనాలు, బీజామృతం, టైకో డెర్మాతో శుద్ధిచేసిన తర్వాత ప్రతి సాలు సాలుకు కనీసం 9 మీటర్లు మొక్క మొక్కకు 1మీటరు ఉండేలా చూసుకొని భూమిని విత్తాలి. ఈ పద్ధతిలో సాగు చేయడానికి రైతుకు ప్రతి ఎకరాకు 1.5 కిలోల కంది విత్తనాలు అవసరవుతాయి. విత్తన అనంతరం ఎండుతెగుళ్లు రాకుండా ఉండేందుకు ట్రైకో డెర్మా విరిడిని కలిపి విత్తుకోవాలి. పంట చిన్న వయస్సులో ఉన్నప్పుడు వేపనూనెను పిచికారీ చేస్తే సరిపోతుంది. కందపంట పెరిగిన తరువాత మొదటి 60 రోజుల్లో కత్తెరతో తలలు తుంచాలి. పంటకాలం 90 రోజులు అయిన రెండోసారి కంది మొక్కల తలలను తుంచేస్తే పక్క కొమ్మల పెరుగుదల అధికంగా ఉంటుంది. ఈ పద్ధతుల్లో ఏ పద్ధతిలో కూడా నిర్లక్ష్యం వహించకుండా దశలవారీగా రైతులు అందుకు తగు జాగ్రత్తలను తప్పకుండా తీసుకోవాలి.
భూసారాన్ని పెంచడానికి సుమారు మూడు రకాల ద్రావణాలను వాడాలని నారాయణ సూచిస్తున్నారు. అవి : 1. జీవామృతం 2. ఘణ జీవామృతం 3. వేస్ట్ డీ కంపౌజర్.
1) జీవామృతం : జీవామృతం తయారీలో ముందుగా పప్పు ధాన్యాల పిండి 2 కేజీలు(సోయ, వేరుశనగ పిండి లేకుండా), బెల్లం 2 కేజీలు, 10 కేజీల ఆవు పేడ, దోషెడు పుట్టమన్నును సుమారు 200 లీటర్ల నీటిలో బాగా కలిపితే జీవామృతం తయారు అవుతుంది. ఇది సుమారు 15 రోజులపాటు నిల్వ ఉంటుంది.
2)ఘణ జీవామృతం: ఘణాజీవామృతం తయారీలో ముందుగా 100 కేజీల ఆవుపేడ, 2కేజీల పప్పు ధాన్యాలు, 2 కేజీల బెల్లం, 10 లీటర్ల ఆవుమూత్రం, దోషెడు పుట్టమన్నులను బాగా కలిపితే ఘణ జీవామృతం తయారు అవుతుంది.
3)వేస్ట్ డీ కంపోజర్: వేస్ట్ డీ కంపోజర్లోతయారీలో భాగంగా 200 వందల లీటర్ల నీటిలో 2 కేజీల బెల్లం వేసి, మదర్ కల్చర్ అనే వేస్ట్ డీ కంపోజర్తో బాగా కలిపి తయారు చేసుకోవాలి. వేస్ట్ డీ కంపోజర్ సుమారు 15 రోజుల పాటు నిల్వ ఉంటూ 45 రోజుల్లో కీటకాలు, ఇతర పురుగులు, రోగాలను కుళ్ల పెడుతుంది. పై మూడు పదార్థాలను తయారు చేసుకోవడానికి గాను ప్రతి రైతుకు జీవామృతానికి రూ.200, ఘణ జీవామృతానికి రూ.200, వేస్ట్ డీ కంపౌజర్కు రూ.70 రూపాయల చొప్పున మొత్తం ఈ ఎరువుల తయారీకి రూ.470 రూపాయలు రైతుకు ఖర్చు అవుతుంది.
సేంద్రియ విధానంలో రైతులు పంటలను సాగుచేస్తే తక్కువ పెట్టుబడులతో ఎక్కువ లాభాలను పొందే అవకాశాలు మెండుగా ఉంటాయి. కంది పంటను సాగు చేయడానికి ముందుకు వచ్చే రైతులకు విత్తనాలను అందించేందుకు వ్యవసాయ శాఖ తరఫున మేము సిద్ధంగా ఉన్నాం. రైతులకు సేంద్రియ పద్ధతులపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు సూచనల, సలహాల మేరకు రైతులు తమ పంటలను సాగు చేసుకొని అధిక లాభాలను పొందాలి.
– షేక్ నజీరొద్దీన్, మండల వ్యవసాయ అధికారి, పెద్దేముల్ మండలం
ఇంటి దగ్గర ఆవు ఉన్న ప్రతి రైతు సేంద్రియ వ్యవసాయాన్ని, సేంద్రియ కంది సాగుతోపాటు ఇతర పంటలను సాగు చేయవచ్చు. దీంతో పెట్టుబడులు తగ్గడమే కాకుండా రైతుల ఆదాయాలు పెరుగుతాయి. నాణ్యమైన పంటలనే రైతులు పండించాలి. అందుకు ప్రతి రైతు విత్తనాల ఎంపికలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొంటూ పంటలను పండించుకోవాలి. త్వరలో చిరుధాన్యాలు, కూరగాయాల సాగులను కూడా సేంద్రియ పద్ధతిలో సాగు చేయాలని నా ఆకాంక్ష. త్వరలో ఆ పనిని కూడా మొదలు పెడతాను.
– ద్యావరి నారాయణ, రైతు, రుద్రారం, పెద్దేముల్ మండలం
సేంద్రియ కంది సాగులో ద్యావరి నారాయణ చేస్తున్న కృషి, రైతులను అనునిత్యం చైతన్యపరుస్తున్న నేపథ్యంలో ఇటీవల రాష్ట్రస్థాయిలో ద్యావరి నారాయణకు 20 నవంబర్ 2022న రైతు నేస్తం 18వ వార్షికోత్సవంలో భాగంగా పద్మశ్రీ ఐ.వి.సుబ్బారావు రైతు నేస్తం పురస్కారాన్ని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతులమీదుగా శంషాబాద్లోని ముచ్చింతల్, స్వర్ణభారత్ ట్రస్టులో ఘనంగా శాలువాలతో సన్మానించి అందించారు. అదే విధంగా 3 సెప్టెంబర్ 2020, జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయంలో పీ.జె.టి.ఎస్.ఏ.యూ అభ్యుదయ రైతు పురస్కారాన్ని కూడా అందించారు. అదే విధంగా 2020లో హైదరాబాద్లో మహాన్యూస్ వారి ఆధ్వర్యంలో ఆర్గానిక్ అవార్డును అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి చేతులమీదుగా అవార్డును అందుకున్నారు.