వారణాసి: ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో గల లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం నాడు ఒక ప్రయాణికునికి చెందిన లైసెన్స్ పిస్టల్ అనుకోకుండా పేలడంతో ఏఏఐ కార్గో లాజిస్టిక్ అండ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్కు చెందిన ఇద్దరు స్క్రీనర్లు గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఈ ఘటన ఉదయం 9:30 గంటల ప్రాంతంలో జరిగింది. ముంబై వెళ్లే ప్రయాణికుడు తన భార్యతో కలసి ప్రయాణిస్తూ, విమానంలో ఆయుధాలు తీసుకెళ్తున్నట్లు అధికారులు నిర్ధారించారు. ఆజమ్గఢ్కు చెందిన ప్రయాణికుడు ముంబై వెళ్లే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానంలో ప్రయాణించేందుకు విమానాశ్రయానికి వచ్చారు. స్క్రీనర్లు పిస్టల్ను తనిఖీ చేస్తుండగా అది అకస్మాత్తుగా పేలింది. ఈ ఘటనలో ఒకరి చేతికి గాయం కాగా, మరొకరికి మోకాలి పైభాగంలో గాయం అయ్యింది. ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ పునీత్ గుప్తా ఒక ప్రకటనలో ఈ ఘటనను నిర్ధారిస్తూ, గాయపడిన ఇద్దరినీ చికిత్స నిమిత్తం ట్రామా సెంటర్కు తరలించామని తెలిపారు. పోలీసులకు సమాచారం అందించామని, దర్యాప్తు జరుగుతున్నదని పేర్కొన్నారు.