న్యూఢిల్లీ, ఆగస్టు 16: యూజీసీ-నెట్ 2026 పరీక్షకు సంబంధించి 84 సబ్జెక్టుల తాత్కాలిక సమాధానాల పత్రాలను ఎన్టీఏ ఆదివారం విడుదల చేసింది. ఈమేరకు ‘ఎక్స్’ వేదికగా ఎన్టీఏ ఒక ప్రకటన విడుదల చేస్తూ, సమాధానాలపై అభ్యంతరాలు తెలిపే ప్రక్రియ ప్రారంభమైందని, ఇది ఈనెల 16 నుంచి 18వ తేదీ రాత్రి 11.59 గంటల వరకు అందుబాటులో ఉంటుందని తెలిపింది. అభ్యంతరాలు తెలిపే ప్రతి ప్రశ్నకూ రూ.200 ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నది.
మూడు పేపర్లకు రీటెస్ట్
యూజీసీ నెట్లోని మూడు పేపర్లలో పలు పొరపాట్లు ఉన్నాయంటూ ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఇంగ్లిష్, కామర్స్, సోషియాలజీ పేపర్లకు మళ్లీ పరీక్ష నిర్వహించనున్నట్లు ఎన్టీఏ ఆదివారం తెలిపింది. ఇంగ్లిష్ పేపర్ సెప్టెంబర్ 9న ఉదయం 9న గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు షిప్ట్ వన్లో, అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు షిఫ్ట్ 2లో కామర్స్ పరీక్ష జరుగుతుంది. అలాగే సోషియాలజీ పేపర్ సెప్టెంబర్ 10న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు షిఫ్ట్ వన్లో నిర్వహించనున్నారు.