భారీ మెజార్టీ లక్ష్యంగా బీఆర్ఎస్ అభ్యర్థులు ఎన్నికల సమరంలో దూసుకుపోతున్నారు. అన్ని పార్టీల కంటే ముందుగానే సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించడంతో అభ్యర్థులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ గెలుపు వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. కాలనీ, అసోసియేషన్ సంఘాలతో సమావేశమవుతూ ప్రజలతో మమేకమవుతున్నారు. రంగారెడ్డి జిల్లాలో ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లోనూ గులాబీ జెండా ఎగురవేసే దిశగా ఓటర్ల మద్దతును కూడగట్టుకుంటున్నారు. ఇప్పటికే ఎంపీ రంజిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి చేవెళ్ల, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాలకు ఇన్చార్జీలుగా నియమితులుకాగా.. వారు అభ్యర్థులు, పార్టీ కార్యకర్తలు, నాయకులతో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తూ గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
మిగతా నియోజకవర్గాలకూ త్వరలోనే ఇన్చార్జీలను నియమించనున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులు ఏ ప్రాంతానికెళ్లినా అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు పలుకుతూ మళ్లీ గెలిపిస్తామని హామీ ఇస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరుతుండగా.. పార్టీ తిరుగులేని శక్తిగా అవతరిస్తున్నది. ఈ నేపథ్యంలో గులాబీ పార్టీ అభ్యర్థుల గెలుపు ఖాయమైనట్లేననే చర్చ జరుగుతున్నది. కాగా, బీఆర్ఎస్ ఎన్నికల పోరులో జోరు పెంచగా, ప్రత్యర్థి పార్టీల్లో మాత్రం నేటికి అయోమయ పరిస్థితి నెలకొన్నది. వర్గపోరు, కుమ్ములాటలతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో గందరగోళం నెలకొన్నది. కొన్ని నియోజకవర్గాల్లో కనీసం అభ్యర్థులు కూడా దొరక్క ఆ రెండు పార్టీలు తర్జనభర్జన పడుతున్నాయి.
-రంగారెడ్డి, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లాలో ఎనిమిది అసెంబ్లీ స్థానాల గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ అన్ని వ్యూహాలను సిద్ధం చేస్తున్నది. కాంగ్రెస్, బీజేపీలను దీటుగా ఎదుర్కొంటూ ఓటర్ల మద్దతును కూడగట్టుకునేందుకు అవసరమైన ప్రచారానికి సంబంధించిన ప్రణాళికలను రూపొందిస్తున్నది. బీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఎంపీ రంజిత్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డిని చేవెళ్ల, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాలకు ఇన్చార్జీలుగా బాధ్యతలను అప్పగించారు. మిగతా నియోజకవర్గాలకు త్వరలోనే ఇన్చార్జీలను నియమించనున్నారు. ఓ వైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు పార్టీ కార్యకర్తలు, నాయకులతో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు సీఎం కేసీఆర్ ఈ నెల 15న హుస్నాబాద్ వేదికగా ఎన్నికల శంఖారావాన్ని పూరించనుండడంతో బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రచారం మరింత హోరెత్తించనున్నది.
ఇన్చార్జీల నేతృత్వంలో విస్తృతంగా..
చేవెళ్ల నియోజకవర్గానికి ఎంపీ రంజిత్రెడ్డిని, ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డిని ఇన్చార్జీలుగా అధిష్టానం నియమించింది. ఇక నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జీల ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల విజయానికి అవసరమైన కార్యాచరణను పక్కాగా అమలు చేయనున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు ఇన్చార్జీలు తమ బాధ్యతలను సంపూర్ణంగా నిర్వర్తించనున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసెంబ్లీ ఇన్చార్జీలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఈ మేరకు అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందుకున్న ప్రతి ఒక్కరితో మమేకమయ్యేలా పార్టీ కార్యక్రమాలను చేపట్టనున్నారు. పదేండ్లలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని, అందించిన సంక్షేమ పథకాలను ఇంటింటికీ వెళ్లి వివరించనున్నారు. ఓ వైపు పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాలను నిర్వర్తిస్తూనే.. మరోవైపు బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం కార్యక్షేత్రంలో శ్రమించనున్నారు.
బీఆర్ఎస్కు సానుకూల వాతావరణం
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచీ దూకుడు ప్రదర్శిస్తున్నది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకమునుపే అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసి జిల్లా మంత్రి సబితా ఇంద్రారెడ్డితోపాటు, ఎమ్మెల్యేలంతా నియోజకవర్గాలను చుట్టివచ్చారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నేతలతో విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ శ్రేణుల్లో కదనోత్సాహాన్ని నింపుతున్నారు. కాలనీల అసోసియేషన్ కార్యవర్గాలతోనూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తున్నది. సిట్టింగ్లకే మళ్లీ అవకాశం ఇచ్చి వారిపై సీఎం కేసీఆర్ పెట్టుకున్న నమ్మకానికి అనుగుణంగా
ప్రజానీకం సైతం ఆదరిస్తున్నది.
మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇప్పటికే నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఐదోసారి బరిలో నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు. తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు విస్తృతంగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. పార్టీ శ్రేణులతో విస్తృత స్థాయి సమావేశాలు, కాలనీల అసోసియేషన్లతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. వీరంతా మరోసారి గెలుపు కోసం నిత్యం ప్రజలతో మమేకమవుతున్నారు. ఈ సందర్భంగా సబ్బండ వర్గాలు సైతం మద్దతు పలికి రానున్న ఎన్నికల్లో మళ్లీ గెలిపిస్తామని హామీ ఇస్తున్నారు. అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తుండడంతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తున్నది. కాంగ్రెస్, బీజేపీల నుంచి చేరికలు సైతం భారీగా ఉంటుండడంతో బీఆర్ఎస్ అభ్యర్థుల ఘన విజయం ఖాయమన్న భావన ప్రతి ఒక్కరిలో కలుగుతున్నది.