వికారాబాద్ మున్సిపాలిటీ రూపురేఖలు మారనున్నాయి. చేపట్టాల్సిన అభివృద్ధి పనుల వివరాలను మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించారు. దీంతో ఎంపీ రంజిత్ రెడ్డి ప్రత్యేక చొరవతో రూ.250 కోట్లతో అభివృద్ధి పనులకు ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం వికారాబాద్ కలెక్టరేట్లో నిర్వహించిన అధికారుల సమావేశంలో అభివృద్ధి పనులపై చర్చించడంతో పాటు ఎమ్మెల్యే ఆనంద్, మంత్రి కేటీఆర్ ఓఎస్డీ మహేందర్ రెడ్డి, సీడీఎంఏ సత్యనారాయణతో కలిసి చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి మున్సిపాలిటీలో చేపట్టే పనులను పరిశీలించారు. పట్టణంలో శిథిలావస్థకు చేరిన రైల్వే బ్రిడ్జి స్థానంలో నూతన బ్రిడ్జి నిర్మించేందుకు సుమారు రూ.100 కోట్లను విడుదల చేసేందుకు మంత్రి కేటీఆర్ గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు ఎమ్మెల్యే, ఎంపీ తెలిపారు. మన్నెగూడ నుంచి వికారాబాద్ పట్టణం మీదుగా అనంతగిరి ఆలయం వరకు నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని శివసాగర్ చెరువు వద్ద మినీ ట్యాంక్బండ్గా తీర్చిదిద్ది, బోటింగ్ కూడా ఏర్పాటు చేయనున్నారు. వికారాబాద్ మున్సిపాలిటీలోని పలు అభివృద్ధి పనులకుగాను ప్రణాళికలను రూపొందించి ప్రభుత్వానికి అందజేయగానే మున్సిపాలిటీ సమగ్రాభివృద్ధికి భారీగా నిధులు మంజూరు కానున్నాయి.
వికారాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ) : వికారాబాద్ జిల్లా సమగ్రాభివృద్ధికి సీఎం కేసీఆర్, మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే తాండూరు నియోజకవర్గ అభివృద్ధికి ఇటీవల రూ.170 కోట్ల నిధులను మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా వికారాబాద్ను కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధిలోకి తీసుకువచ్చేందుకు చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి ప్రత్యేక చొరవ చూపి, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకుపోవడంతో గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. వికారాబాద్ మున్సిపాలిటీని అన్ని విధాలుగా ప్రగతి పథంలోకి తీసుకువచ్చేందుకు చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై మంత్రి కేటీఆర్ ఓఎస్డీ మహేందర్రెడ్డి, సీడీఎంఏ సత్యనారాయణ ఇతర అధికారులతో కలిసి వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, ఎంపీ రంజిత్రెడ్డి చర్చించారు. వికారాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధికి వెంటనే నిధులు విడుదల చేసేందుకు మంత్రి కేటీఆర్ పచ్చజెండా ఊపడంతో నూతన బ్రిడ్జి నిర్మాణంతోపాటు రోడ్లు, పార్కుల అభివృద్ధికి సంబంధించి వారం రోజుల్లోగా ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వికారాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధిపై ప్రభుత్వానికి ప్రతిపాదనలను అందజేసే ప్రక్రియ పూర్తైతే, ఈ నెలాఖరులోగా వికారాబాద్ మున్సిపాలిటీ సమగ్రాభివృద్ధికి భారీగా నిధులు మంజూరు కానున్నాయి.
వికారాబాద్ మున్సిపాలిటీకి రూ.250 కోట్లు
వికారాబాద్ మున్సిపాలిటీలో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి జరుగనుంది. అభివృద్ధిపై పలుమార్లు ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగా.. ఎంపీ రంజిత్రెడ్డి ప్రత్యేక చొరవతో భారీగా నిధులు మంజూరు చేసేందుకు మంత్రి కేటీఆర్ సుముఖత వ్యక్తం చేశారు. వెంటనే అభివృద్ధి పనులకు సంబంధించి ప్రతిపాదనలను అందజేయాలని ఆదేశించారు. ఏయే అభివృద్ధి పనులు చేపట్టాలనే దానిపై ప్రజాప్రతినిధులు, అధికారులతో చర్చించిన అనంతరం రూ.250 కోట్లతో ప్రతిపాదనలను సిద్ధం చేసేందుకు నిర్ణయించారు. ఇందులో ప్రధానంగా వికారాబాద్ పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న శిథిలావస్థకు చేరిన రైల్వే బ్రిడ్జి స్థానంలో నూతన బ్రిడ్జి నిర్మించేందుకు ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ఆనంద్ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగా కొత్త బ్రిడ్జి నిర్మాణం కోసం సుమారు రూ.100 కోట్లను విడుదల చేసేందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు.
మొదట బ్రిడ్జి మరమ్మతులకు నిధులు కోరగా వెంటనే ప్రభుత్వం రూ.12 కోట్ల నిధులను విడుదల చేసింది. చాలా ఏండ్ల క్రితం బ్రిడ్జిని నిర్మించిన దృష్ట్యా కొత్త బ్రిడ్జి ఏర్పాటుకు విజ్ఞప్తి చేయగా.. మంత్రి కేటీఆర్ గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. మన్నెగూడ నుంచి వికారాబాద్ పట్టణం మీదుగా అనంతగిరి ఆలయం వరకు నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. మరోవైపు వికారాబాద్ మున్సిపాలిటీలోని ఎన్టీఆర్ జంక్షన్, బీజేఆర్ జంక్షన్, అంబేద్కర్ జంక్షన్ల అభివృద్ధితోపాటు పార్కుల అభివృద్ధి, వైకుంఠధామం, కొత్తగడి వరకు పలు అభివృద్ధి పనులను చేపట్టనున్నారు. బ్లాక్ గ్రౌండ్లో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు, వాలీబాల్ కోర్టు, బీచ్లను అభివృద్ధి చేయనున్నారు. మరోవైపు వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని శివసాగర్ చెరువు వద్ద మినీ ట్యాంక్బండ్ను ఏర్పాటు చేయడంతోపాటు శివసాగర్ చెరువులో బోటింగ్ కూడా ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు.
అభివృద్ధి పనుల పరిశీలన
వికారాబాద్ మున్సిపాలిటీలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించి శివసాగర్ చెరువుతోపాటు రైల్వే బ్రిడ్జి, అనంతగిరి ఆలయం వరకు చేపట్టే పనులకు సంబంధించి మంత్రి కేటీఆర్ ఓఎస్డీ మహేందర్రెడ్డి, సీడీఎంఏ సత్యనారాయణ, జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్శర్మతో కలిసి చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ పరిశీలించారు. వీరితోపాటు వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ చిగుళ్లపల్లి మంజుల, వికారాబాద్ మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్లు అనంత్రెడ్డి, పుష్పలతారెడ్డి, టీఆర్ఎస్ నేతలు ఉన్నారు.
కలెక్టరేట్లో అధికారులతో సీడీఎంఏ సమావేశం
వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలో చేపట్టే అభివృద్ధి పనులపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం వికారాబాద్ కలెక్టర్ నిఖిల, అదనపు కలెక్టర్ రాహుల్శర్మ, పబ్లిక్ హెల్త్ ఈఎన్సీ, ఎస్ఈలతో కలిసి అధికారులతో సీడీఎంఏ సత్యనారాయణ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలో రోడ్డు వెడల్పు పనులతోపాటు సెంట్రల్ లైటింగ్, జంక్షన్ల అభివృద్ధి, డివైడర్లు, రైల్వే బ్రిడ్జి, అర్బన్ పార్కు ఏర్పాటుపై ప్రతిపాదనలను తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. శివసాగర్ చెరువు వద్ద మినీ ట్యాంక్బండ్ను ఏర్పాటు చేయడంతోపాటు వికారాబాద్ పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దనున్నట్లు ఆయన వెల్లడించారు. జిల్లాలో ఇంకా అసంపూర్తిగా ఉన్న వైకుంఠధామాలు, సమీకృత మార్కెట్ యార్డులను ఫిబ్రవరి నెలాఖరు వరకు పూర్తి చేయాలన్నారు. సమావేశంలో ఇన్చార్జి డీఆర్వో అశోక్కుమార్ పాల్గొన్నారు.
త్వరలో మారనున్న వికారాబాద్ మున్సిపాలిటీ రూపురేఖలు
– చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి
త్వరలో వికారాబాద్ మున్సిపాలిటీ రూపురేఖలు మారిపోయేలా అభివృద్ధి పనులను చేపట్టనున్నాం. వికారాబాద్ మున్సిపాలిటీలో సుమారు రూ.250 కోట్లతో పలు అభివృద్ధి పనులను చేపట్టేందుకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలో చేపట్టే పనులకు సంబంధించి వెంటనే ప్రతిపాదనలను అందజేయాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. కొత్త రైల్వేబ్రిడ్జి, మన్నెగూడ-అనంతగిరి వరకు నాలుగు లేన్ల రోడ్డు, పలు జంక్షన్ల అభివృద్ధితోపాటు పలు అభివృద్ధి పనులను చేపట్టేందుకు చర్చించాం.
అభివృద్ధి పనులపై చర్చించాం
– వికారాబాద్ ఎమ్మెల్యే అనంద్
వికారాబాద్ మున్సిపాలిటీలో ఏయే అభివృద్ధి పనులు చేపట్టాలనే దానిపై అధికారులు, ప్రజాప్రతినిధులతో చర్చించాం. వికారాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధికి నిధులు కేటాయించాలని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించి వెంటనే ఓఎస్డీతోపాటు సీడీఎంఏను పంపించారు. అనంతగిరి ఆలయం మొదలుకొని శివారెడ్డిపేట్ చెరువు, బ్లాక్ గ్రౌండ్ తదితర ప్రాంతాలను పరిశీలించి ఏయే అభివృద్ధి పనుల చేపట్టవచ్చనేది పరిశీలించాం. స్టేడియం ఏర్పాటుకు కేటాయించిన 5 ఎకరాల స్థలాన్ని పరిశీలించి ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దానిపై సమాలోచనలు చేశాం. అధికారులు డీపీఆర్ తయారు చేసినట్లయితే ప్రభుత్వానికి అందజేస్తాం. మరోవైపు వెంటనే స్పందించిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్తోపాటు ప్రత్యేక చొరవ చూపి ముందుండి నడిపిస్తున్న ఎంపీ రంజిత్రెడ్డికి ధన్యవాదాలు.