రంగారెడ్డి, జూలై 4(నమస్తే తెలంగాణ) ;నాడు తండాలంటే.. సమస్యల లోగిళ్లు.. తాగునీటి కోసం అరిగోస.. కరెంటు లేక.. పట్టించుకునే వారు లేక వారి కష్టాలు అన్నీ ఇన్నీ కావు… కానీ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో తండాల ముఖచిత్రమే మారిపోయింది. దానికి నిదర్శనమే రంగారెడ్డి జిల్లాలోని మారుమూలలో ఉన్న పటేల్చెరువు తండా.. సీఎం కేసీఆర్ చొరవతో గ్రామ పంచాయతీగా మారడంతో నిధుల వరద పారింది. ఇంటింటికీ మిషన్ భగీరథ తాగు నీరు సరఫరా అవుతున్నది..రేషన్ సరుకుల కోసం ఎక్కడికో వెళ్లాల్సిన బాధ తప్పింది. కంపోస్టు యార్డుతో చెత్త లేకుండా వీధులన్నీ పరిశుభ్రంగా మారాయి. తండా వరకూ తారు రోడ్డు వచ్చింది..హరితహారం కార్యక్రమంతో దారులు పచ్చని చెట్లతో స్వాగతం పలుకుతున్నాయి.. ఎల్ఈడీ లైట్ల కాంతుల్లో రాత్రి వేళల్లోనూ తండాలో అభివృద్ధి వెలుగు లు విరజిమ్ముతున్నాయి. ఇక్కడ ఎవరినీ కదిలించినా గత తొమ్మిదేండ్లలో జరిగిన అభివృద్ధినే చెబుతున్నారు. ఇంటింటికీ చేరుతున్న సంక్షేమ పథకాలు.. గడపగడపకూ అందుతున్న అభివృద్ధి ఫలాలతో అందరి మోముల్లో ఇప్పుడు చిరునవ్వే కనిపిస్తున్నది.
అది రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల సరిహద్దున ఉన్న ఓ మారుమూల తండా. దూరంగా విసిరేసినట్లుగా ఉన్న పటేల్చెర్వు తండాలో అన్ని తండాలలాగే ఒకప్పుడు సమస్యలు కోకొల్లలు. గుక్కెడు నీటి కోసం ఇక్కడి గిరిజనం కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యవసాయ బోర్లను ఆశ్రయించాల్సిన దుస్థితి. నీటి సమస్యతో యువకులకు పిల్లను ఇచ్చేందుకు సైతం అమ్మాయి తల్లిదండ్రులు వెనుకాడే పరిస్థితి. తండాకు వెళ్లేందుకు సరైన దారి ఉండేది కాదు. వీధులన్నీ పశువుల మలమూత్రాలు, మురుగునీటితో అపరిశుభ్రంగా ఉండి కంపు కొట్టేవి. తండాలను గ్రామ పంచాయతీలుగా చేయకముందు పటేల్చెర్వు తండాలో ఉన్న అవస్థలు ఇవి. స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు తండాలు, గూడేలకు గ్రామ పంచాయతీల హోదా కల్పించారు. ఈ పంచాయతీలకు పాలకులుగా స్థానిక గిరిజనులే సర్పంచ్లు అయ్యారు. ‘మన తండా.. మన పాలన’ అన్న నినాదంతో సాగిన స్వపరిపాలనలో పటేల్చెర్వు తండా అభివృద్ధి ఫలాలను అందుకున్నది. సెల్ సిగ్నల్ దరిచేరని ఈ తండాకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలన్నీ గడపగడపను చేరాయి. నేడు అభివృద్ధి పథంలో ఆదర్శంగా నిలుస్తున్నది.
‘గిరిజన తండాలు అనగానే అందరిలోనూ ఒకరకమైన భావన. కనీస సదుపాయాలు కూడా ఉండవని.. పరిసరాలు సైతం అపరిశుభ్రంగా ఉంటాయని అనేక అపోహలు. కానీ, రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని పటేల్చెర్వు తండాను చూస్తే మాత్రం ఆ భావనను మార్చుకోవాల్సిందే. మూడున్నరేండ్లలో ఈ పంచాయతీ పరిధిలో రూ.5కోట్లకు పైగా నిధులతో అభివృద్ధి జరిగింది.
ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి
ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి కన్పిస్తుంది. వీధుల్లో చెత్తను పారవేయకుండా ప్రతి ఇంటికీ చెత్త బుట్టలను పంపిణీ చేసి ఎప్పటికప్పుడు చెత్తను సేకరించి పంచాయతీ ట్రాక్టర్లో డంపింగ్యార్డుకు తరలిస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా హరితహారం మొక్కల సొగసు.. రాత్రి, ఉషోదయాన తండా శోభను ఇనుమడింపజేసే ఎల్ఈడీ లైట్ల కాంతులు.. ఇలా ఒక్కటని కాదు అనేక రంగాల్లో ప్రత్యేకతను సొంతం చేసుకున్నది. వైకుంఠధామం, డంపింగ్యార్డు ఇలా.. పల్లె ప్రగతి పనులన్నింటినీ పూర్తి చేసుకొని ఇతర పంచాయతీలకు స్ఫూర్తిగా నిలుస్తున్నది. మూడున్నరేండ్ల కాలంలోనే అద్భుతమైన అభివృద్ధిని సొంతం చేసుకున్న తండా జిల్లాలోనే ప్రత్యేకతను చాటుకుంటున్నది.
అభివృద్ధి, సంక్షేమం
తెలంగాణ ప్రభుత్వం ప్రతి నెలా రూ.1.59లక్షల చొప్పున ఇప్పటివరకు అందించిన రూ.36లక్షలు, 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.31.92లక్షలు, నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి విడుదలైన రూ.కోటి, పన్ను రూపేణా పంచాయతీకి వచ్చిన ఆదాయం రూ.7.51లక్షలతో పంచాయతీలో ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయి. రూ.2.50కోట్లతో పటేల్చెర్వు తండా నుంచి జనగామ వరకు నిర్మించిన తారు రోడ్డుతో రవాణా సౌకర్యం మెరుగుపడింది.
హిట్.. కేసీఆర్ కిట్
పటేల్చెర్వు తండాతోపాటు దీని పరిధిలోని ముచ్చర్ల కుంటతండాలో యేటా రైతుబంధు కింద 231 మంది రైతులకు రూ.87.49లక్షల సాయం అందుతున్నది. ఒకప్పుడు తండాల్లోనే ప్రసవాలు జరిగి పురిట్లోనే పసికందుల ప్రాణాలు గాలిలో కలిసిపోగా.. కేసీఆర్ కిట్లు వచ్చాక ఆ పరిస్థితులు కనుమరుగై పోయాయని ఆశ కార్యకర్త మంగ చెబుతున్నది. ప్రసవం కోసం హైదరాబాద్ కోఠి ప్రసూతి దవాఖానకు వెళ్తున్నారు. ఇంటి నుంచి దవాఖానకు తీసుకెళ్లడంతోపాటు ప్రసవం తర్వాత ఇంటికి క్షేమంగా చేర్చేవరకు 108 వాహనం, అమ్మ ఒడి వాహనాలు ఇతోధికంగా సేవలు అందిస్తున్నాయి.
దూప తీర్చిన భగీరథ
పటేల్ చెర్వు తండాలో పాతాళంలో ఉన్న భూగర్భజలాలు బోర్లు వేసినా అంతంతమాత్రమే నీళ్లు పడేవి . అరకొరగా పోసే బోర్లతో దాహార్తి తీరక గిరిజనం కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యవసాయ బావులను ఆశ్రయించక తప్పని పరిస్థితి. కొన్ని సందర్భాల్లో చెలిమె నీళ్లే దిక్కైన దుస్థితి. మిషన్ భగీరథ పథకం తండావాసుల తాగునీటి కష్టాలను తీర్చింది. తండాకు సురక్షిత నీటిని అందించేందుకు ప్రభుత్వం రూ.70.40లక్షలను వెచ్చించింది. రెండు ట్యాంకులను, ఒక సంపును నిర్మించి తండాలోని 350 గడపలకు నల్లా కనెక్షన్లు ఇచ్చి తాగునీటిని అందిస్తున్నది. తండాలో నీటి కష్టాలు తెలిసిన వాళ్లు ఇక్కడి వాళ్లతో పెండ్లి సంబంధం కుదుర్చుకోవాలంటేనే భయపడేవాళ్లని అప్పటి రోజులను గుర్తు చేశాడు తండాకు చెందిన నేనావత్ పీరి. ఏండ్లనాటి ఆడబిడ్డల కష్టాలు తీర్చిన తెలంగాణ గవర్నమెంట్కు చేతులెత్తి దండం పెట్టాల్సిందేనని ఆమె చెబుతున్నది.
చెలిమె బాధలు పోయినయ్
తండావాసులు ఎన్నో ఏండ్ల సంది చెలిమె నీళ్లే తాగి బతికినరు. కొన్నాళ్లకు వ్యవసాయ బోర్లే మాకు దిక్కైనయ్. దూరాన కారడివిలో చిట్టచివరన ఉన్నది మా తండే. భగీరథ నీళ్లొచ్చినంక గిప్పుడు గడప ముందర నీళ్లు బట్టుకునే పరిస్థితిని చూస్తున్నం. ఆ నీళ్లను చూస్తుంటే సంతోషం కల్గుతున్నది. గిట్ల మంచి రోజులు వస్తయని ఎన్నడూ అనుకోలే.
– మెగావత్ శాంతి, తండావాసి
సమష్టిగా అభివృద్ధి చేసుకున్నం
మా తండాను ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయడంతో సర్పంచుగా సేవ చేసే అవకాశం వచ్చింది. గ్రామాభివృద్ధిలో మాకు ప్రాధాన్యం కల్పించిన సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం. మా పంచాయతీ పాలకులమంతా గిరిజనులమే కావడం వల్ల సమస్యలను పరిష్కరించుకోవడం సులువయ్యింది. ఇన్నాళ్లుగా అభివృద్ధికి నోచుకోని తండాను స్వయంపాలనలో సమష్టిగా మూడున్నరేండ్లలోనే అభివృద్ధి చేసుకున్నాం.
– మెగావత్ రాజు నాయక్, సర్పంచ్
సాయం రాకుంటే ఆగమయ్యేటోళ్లం
ఉన్న రెండకరాల భూమిలో పంటలు పండిద్దామంటే పెట్టుబడులకు పైసలు లేక ఇబ్బందులు పడ్డం.అప్పు తెచ్చే ధైర్యం కూడా లేదు. కేసీఆర్ సార్.. రైతుబంధు సాయంతో పెట్టుబడి అందిస్తున్నరు. ఎవ్వరి దగ్గర చేయి చాపే అవసరం లేదిప్పుడు. సాయం డబ్బులు రాకుంటే ఆగమయ్యేటోళ్లమే.
– వర్త్యా గన్న, గిరిజన రైతు
పింఛన్తోని ఆదుకుంటున్నరు
నాకు ముసలోళ్ల పైసలు 2వేలు వస్తున్నయ్. నా భార్యకు దివ్యాంగుల పింఛన్ వస్తున్నది. పింఛన్ డబ్బులు మమ్మల్ని ఆదుకుంటున్నయి. ఇంటి అవసరాలు తీరుతున్నయి. రోగమొస్తే.. మందు బిళ్లలు కొనేందుకు పైసలు ఉండకపోయేవి. పింఛన్ డబ్బులు చేతికొచ్చినాక ఆ ఇబ్బందులు తీరినయ్. సీఎం కేసీఆర్ సార్కు రుణపడి ఉంటం.
– మెగావత్ పంతు, ద్వాలీ దంపతులు