కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నది. వలసలను నివారించేందుకు.. స్థానికంగా ఉపాధిని కల్పించేందుకు అప్పటి యూపీఏ ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. తెలంగాణలో ఉపాధి పనులు బాగా జరిగి పలు అవార్డులు సైతం రాష్ర్టానికి వచ్చాయి. అయితే బీజేపీ ప్రభుత్వం ఈ స్కీమ్ అమల్లో కొర్రీలు పెడుతూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నది. ఇప్పటికే పలు ఆంక్షలు విధించి పథకం అమల్లో రాష్ర్టాలను ఇబ్బందులకు గురిచేస్తుండగా.. తాజాగా ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో ఈ పథకానికి మోదీ సర్కారు భారీగా నిధులను తగ్గించింది. తద్వారా ఈ పథకాన్ని పూర్తిగా రద్దు చేయాలనే కుట్రకు తెరతీసినట్లు స్పష్టమవుతున్నది. దీంతో పేదలు ఉపాధి కోల్పోయి మళ్లీ వలసబాట పట్టే అవకాశం ఉన్నది. ఏటేటా బడ్జెట్లోనూ నిధులను తగ్గిస్తుండటంతో ఈ పథకం పూర్తిగా నీరుగారి పోయే ప్రమాదం ఉన్నది.
ఈ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలన్న డిమాండ్, విజ్ఞప్తులను కూడా కేంద్రం పెడచెవిన పెట్టింది. కాగా వికారాబాద్ జిల్లాలో 1,81 లక్షల కుటుంబాలకు జాబ్ కార్డులుండగా.. 3,71 లక్షల మంది కూలీలున్నారు. వీరికి ఈ ఆర్థిక సంవత్సరంలో 50.11 లక్షల పనిదినాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్న అధికారులు ఇప్పటివరకు 49.48 లక్షల పని దినాలు కల్పించారు. ఉపాధి హామీ నిధుల్లో కోతపై గ్రామీణ ప్రాంతాల్లోని కూలీల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. శుక్రవారం దుద్యాల మం డల కేంద్రంలో సీపీఎం నాయకులు, ఉపాధి కూలీలు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఉపాధి హామీ పథకానికి నిధులను తగ్గించడంవల్ల గ్రామాల్లోని నిరుపేదలు పనుల్లేక మళ్లీ వలసపోయే పరిస్థితులు వస్తాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
-బొంరాస్పేట, ఫిబ్రవరి 3
బొంరాస్పేట, ఫిబ్రవరి 3 : కూలీల కడుపు నింపే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి గ్రామీణ హామీ పథకం (ఎంఎన్ఆర్ఈజీఏ)పై కేంద్రం కక్ష సాధింపునకు దిగింది. గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలను ఆదుకోవడంలో ఈ పథకం కీలక భూమిక పోషిస్తున్నది. కరోనా సమయంలో కోట్ల సంఖ్యలో అభాగ్యుల ఆకలిని తీర్చిన పథకమిది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులు తగ్గిస్తూ ఈ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నది. తాజాగా ఈ నెల ఒకటో తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఈ ఏడాది బడ్జెట్లో ఉపాధి హామీ పథకానికి అరకొర నిధులనే కేటాయించింది. 2020-21 బడ్జెట్లో రూ.73 వేల కోట్లు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో రూ.13 వేల కోట్ల కోత విధించింది. ఇప్పటికే నిధులను తగ్గించడంతో గ్రామాల్లో కూలీలకు ఉపాధి కరువైంది. తాజా కేటాయింపులతో కూలీలకు పని దొరకడం కష్టమయ్యే అవకాశం ఉంది.
వంద రోజులు కాదు.. 48 రోజులే..
ఉపాధిహామీ పథకం కింద పేరు నమోదు చేసుకున్న ప్రతి ఒక్క కూలీకి ఏడాదిలో వంద రోజు పని కల్పించాలి. పని కల్పించని పక్షంలో నిరుద్యోగ భృతి ఇవ్వాలని చట్టంలో పేర్కొన్నారు. కానీ ఇవేవీ అమలు కావడం లేదు. బీజేపీ ప్రభుత్వం ఈ పథకాన్ని పట్టించుకోకపోవడంతో 2015-20 మధ్య కాలంలో ఒక్కొక్కరికీ సగటున ఏడాదిలో 48 రోజులే పని దక్కినట్లు తేలింది. ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలన్న డిమాండ్ను, విజ్ఞప్తులను కేంద్రం పట్టించుకోలేదు. రైతుల మేలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి నిధులతో పంట కల్లాల నిర్మాణం చేపడితే కేంద్రం నోటీసులు ఇచ్చి తన రైతు వ్యతిరేకతను చాటుకుంది. ఉపాధికి నిధుల కోతపై గ్రామీణ ప్రాంతాల్లోని కూలీల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. వికారాబాద్ జిల్లా దుద్యాల మండల కేంద్రంలో శుక్రవారం సీపీఎం ఆధ్వర్యంలో ఉపాధి కూలీలు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఉపాధి హామీ పథకానికి నిధులను తగ్గించడంతో గ్రామాల్లో నిరుపేదలకు చేసుకోవడానికి పని దొరకక మళ్లీ వలసలు అధికమయ్యే అవకాశం ఉందని కూలీలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్రం బడ్జెట్ అంచనాలను సవరించి ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచాలని కోరుతున్నారు.
నిబంధనలు కఠినతరం
రాష్ర్టాల ప్రమేయం లేకుండా ఉపాధిహామీ పథకాన్ని కేంద్రం పూర్తిగా తన అధీనంలోకి తీసుకున్నది. ఈ పథకాన్ని నిర్వీర్యం చేయాలనే ఆలోచనతో ఏటేటా నిధుల కేటాయింపును తగ్గిస్తున్నది. గ్రామాల్లో జరిగే పనుల్లో ఎక్కువగా కూలీలు భాగస్వాములవుతున్నారు. ప్రభుత్వం విధించిన కొత్త నిబంధనలతో కూలీలు రోడ్డున పడుతున్నారు. పని ప్రారంభించాక, పని ముగిసిన తర్వాత అక్కడే ఉండే కూలీల గ్రూప్ ఫొటో తీసి అప్లోడ్ చేస్తేనే వారికి కూలి చెల్లిస్తున్నారు. ప్రతి పనినీ సాంకేతిక ప్రక్రియ ద్వారా చేస్తేనే కూలీల హాజరు నమోదవుతుంది. అలాగే మెటీరియల్ కంపోనెంట్తో చేపట్టే పనుల విషయానికొస్తే నిబంధనలు కఠినతరం చేసింది. ప్రస్తుతం ఒక పనిని మంజూరు చేయాలంటే గ్రామసభ తీర్మానం చేయాలి. దాదాపు 29 రకాల పేపర్లు సబ్మిట్ చేయాలి. కమిటీ సమావేశమై ఆ పనిని మంజూరు చేయాలా వద్దా అని పరిశీలింలి ఆమోదం పొందిన తర్వాతే పని ప్రారంభించాల్సి ఉంటుంది. ఇలాంటి నిబంధనలతో గ్రామాల్లో సీసీ రోడ్లు, ఇతర పనులు చేపట్టాలంటే నానా ఇబ్బంది పడుతున్నారు.
నీరుగారిన లక్ష్యం
వికారాబాద్ జిల్లాలో ఉపాధిహామీ పథకం పనులు చేయడానికి 1.81 లక్షల కుటుంబాలకు జాబ్ కార్డులు ఉన్నాయి. వీరిలో 3.71 లక్షల మంది కూలీలు నమోదై ఉన్నారు. 1.31 లక్షల యాక్టివ్ జాబ్ కార్డులకు 2.47 లక్షల మంది యాక్టివ్ కూలీలు ఉన్నారు. వీరికి ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 50.11 లక్షల పనిదినాలు కల్పించాలన్నది లక్ష్యం కాగా ఇప్పటివరకు 49.48 లక్షల పనిదినాను అధికారులు కల్పించారు. ఉపాధి హామీ పథకంలో ఈ ఏడాది ఇప్పటివరకు రూ.126.61 కోట్లు ఖర్చు చేశారు.
కేంద్ర విధానాలతో రైతుకు నష్టం
ఉపాధిహామీ పథకంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో గ్రామాల్లో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. బడ్జెట్లో నిధులను తగ్గించడంతో గ్రామాల్లోని రైతుల పొలాల్లో చేపట్టే కల్లాలు, వాలు కట్టలు తదితర పనులకు నిధుల్లో కోత పడుతున్నది. అలాగే సీసీ రోడ్ల విషయంలో ప్రభుత్వ నిబంధనలతో మెటీరియల్ కాంపోనెంట్ పనులు చేయలేకపోతున్నాం. కేంద్రం ఉపాధి పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నది.
– శేరి నారాయణరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ, బొంరాస్పేట
పని దొరకడం లేదు
గ్రామాల్లో వంద రోజుల పని దొరకడం కష్టమైనది. జాబ్కార్డు ఉన్నా చేయడానికి పనిలేదు. ఎప్పుడైనా పని చేసినా వెంటనే కూలి రావడం లేదు. పేరుకే వంద రోజుల పని అంటున్నారు. కానీ 30 రోజులు కూడా పని కల్పించడం లేదు.
– కుమ్మరి బాలమ్మ, ఉపాధి కూలీ, దుద్యాల
వంద రోజుల పని కల్పించాలి
గ్రామాల్లో నిరుపేద కూలీలకు ఉపాధి కల్పించాలి. వంద రోజులు పని కల్పిస్తేనే పేదల ఆకలి తీరుతుంది. రానురాను ఉపాధి పనులు తగ్గుతున్నాయి. పనులు దొరకక కూలీలు ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. కేంద్రం వంద రోజుల పనికి ఎక్కువ నిధులు ఇవ్వాలి.
– కందనెల్లి భారతమ్మ, చౌదర్పల్లి, బొంరాస్పేట మండలం
పేదలకు ఉపాధిని దూరం చేసే కుట్ర
కేంద్ర ప్రభుత్వం రూ.45 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టినా ఉపాధిహామీకి, ఆహార సబ్సిడీకి, రైతులకు ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీలపై భారీగా కోత విధించింది. ఉపాధిహామీ పథకానికి నిధుల కోత పెట్టడంతో ఈ పథకాన్ని పేదలకు దూరం చేసే కుట్రలో భాగమే. దీంతో నిరుపేద కూలీలకు పని దొరకక తీవ్రంగా నష్టపోతారు. తక్షణమే బడ్జెట్ కేటాయింపులపై కేంద్రం పునరాలోచన చేయాలి.
– బుస్స చంద్రయ్య, సీపీఎం జిల్లా నాయకుడు