Revanth Reddy | వికారాబాద్, జూలై 1 : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పగటి కలలు కంటున్నారని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. శనివారం కొడంగల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రేవంత్రెడ్డిపై విమర్శనాస్ర్తాలు సంధించారు. ఎమ్మెల్యేగా గెలువని రేవంత్రెడ్డి సీఎం ఎలా అవుతారని ఎద్దేవా చేశారు. కొడంగల్లో 9 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న నీవు కొడంగల్కు చేసింది శూన్యమని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో పీకన్నా మించిన వాళ్లు ఉన్నారని, సీఎం కుర్చీ కోసం పోట్లాడుకుంటున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్కు పట్టుమని పది సీట్లు కూడా రావన్నారు. కాంగ్రెస్ జిమ్మిక్కులు, గారడీ మాటలను నమ్మేరోజులు పోయాయని, నీవేంటో.. నీవైనమేంటో కొడంగల్ ప్రజలు గుర్తించారన్నారు.
సాధించిన తెలంగాణ రాష్ర్టాన్ని సంపన్న రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు బంధు రూ.15వేలు, ఇంటి నిర్మాణానికి 5లక్షలు ఇస్తామని గొప్పలు చెబుతున్నాడని తెలిపారు. ప్రస్తుతం కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని.. రైతు బంధు, రైతు బీమా, 24గంటల ఉచిత విద్యుత్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి గొప్ప పథకాలు అక్కడ అమలు చేయించి ఇక్కడ మాట్లాడాలని హితవు పలికారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత పథకాలు అందించేది దేవుడెరుగుకాని.. కర్ణాటకలో తెలంగాణలో ఏర్పాటు చేసిన పథకాలను ఏర్పాటు చేస్తే అప్పుడు నమ్ముతామని పేర్కొన్నారు.
రాష్ర్టాన్ని అభివృద్ధి చేయాలనే అవగాహన లేకపోయిందా
గత 40 సంవత్సరాలు కాంగ్రెస్, 15 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వాలు తెలంగాణలో అధికారాన్ని చెలాయించారని, కాని ఇలాంటి గొప్ప పథకాలు ఎందుకు చేయలేక పోయాయని విమర్శించారు. అప్పటి కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలకు ప్రజలకు ఏమి కావాలో తెలుసుకునే సోయి లేదా..? లేక తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధి చేయాలనే అవగాహన లేకపోయిందా అని ఎద్దేవా చేశారు. ఖమ్మం మీటింగుకు తెలంగాణ ప్రజలు రారని తెలుసుకున్న నీవు.. చంద్రబాబు, షర్మిలను కలిసి ఆంధ్ర జనాలను పోగుచేస్తున్నావని అన్నారు. అప్పట్లో సోనియా గాంధీని దెయ్యం, భూతం అని తిట్టావు.. ఇప్పుడు ఆమె దేవత అని పూజిస్తున్నావని అవహేళన చేశారు.
నీ హయాంలో కొడంగల్ నియోజకవర్గం అధోగతి
దమ్ముంటే కొడంగల్ నుంచి పోటీ చేయాలని కొడంగల్ ఎమ్మెల్యే నరేందర్రెడ్డి రేవంత్రెడ్డికి సవాల్ విసిరారు. లేదంటే ఎక్కడి నుంచి పోటీ చేస్తావో చెప్పు.. అక్కడి నుంచి నేను కూడా పోటీ చేస్తా.. సవాల్కు సిద్ధమైతే రేపటి లోగా సమాధానం చెప్పాలన్నారు. తొమ్మిదేండ్లు కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్న నీవు.. నియోజకవర్గాన్ని అధోగతి చేశావని.. నీవు మాత్రమే బాగుపడ్డావని.. ప్రజలకు చేసిందేమీ లేదని పేర్కొన్నారు. గురునాథ్రెడ్డి లేకుంటే గెలువననే భయం రేవంత్కు పట్టుకుందని, దీంతో గురునాథ్రెడ్డిని కలిసి కాళ్లు పట్టుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. కొడంగల్లోనే కాదు.. రేవంత్ ప్రాతినిథ్యం వహిస్తున్న మల్కాజిగిరిలోనూ పరిస్థితి ఆయనకు వ్యతిరేకంగా ఉందని, ముందు ఆ సంగతి చూసుకొమ్మని కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే రేవంత్ను హెచ్చరించన విషయం అందరికీ తెలుసన్నారు. గతంలో పీసీసీ ప్రెసిడెంటును నేనే.. సీట్లు కేటాయిస్తానని అన్నావు.. మళ్లీ ఇప్పుడు ప్లేట్ ఫిరాయించి సర్వేల ప్రకారమే సీట్లు కేటాయింపు అంటున్నావని తెలిపారు. గత ఎన్నికల్లో హెలికాప్టర్ల ద్వారా ప్రచారం చేశారని.. దీనికిగాను కొడంగల్ ప్రజలు రేవంత్ను గాలిలో కలిపారని అన్నారు. సింగపూర్, మలేషియాలలో బినామీ పేర్లతో నడుస్తున్న వ్యాపారాలను బట్టబయలు చేస్తానని ఎమ్మెల్యే హెచ్చరించారు.
సీఎం కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు
సీఎం కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని రాష్ర్టాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నది సీఎం కేసీఆర్ మాత్రమేనని పేర్కొన్నారు. మంచి పరిపాలన నిర్వహిస్తున్న సీఎం కేసీఆర్కు నీవు సరికావని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మోహన్రెడ్డి, మధుసూదన్రావు యాదవ్, విష్ణువర్ధన్రెడ్డి, భీములు, సలీం, నరోత్తంరెడ్డి, రాంరెడ్డి, ఫకీరప్ప, గోవింద్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.