ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దౌల్తాబాద్ మండలం గుండెపల్లి గ్రామంలో సోమవారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని, సీఎం కేసీఆర్ సుపరిపాలనలో గ్రామాలు, పట్టణాలు ప్రగతిపథంలో దూసుకెళ్తున్నాయన్నారు. కొడంగల్ నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో బీజేపీ, కాంగ్రెస్ నాయకులు అసత్య ప్రచారం, అర్థంలేని ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు ఏకమై ప్రతిపక్షాల కుట్రలు, కుతంత్రాలను తిప్పికొట్టాలన్నారు. పార్టీకి కార్యకర్తలే పట్టుగొమ్మలన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా మళ్లీ బీఆర్ఎస్ పార్టీనే విజయం సాధిస్తుందన్నారు.
కొడంగల్/దౌల్తాబాద్, మార్చి 20 : పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలని, పార్టీ పటిష్టతకు ప్రతిఒక్కరూ పాటుపడాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి తెలిపారు. సోమవారం నియోజకవర్గంలోని దౌల్తాబాద్ మండలం గుండెపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇదివరకు నియోజకవర్గపరిధిలోని కొడంగల్, బొంరాస్పేట మండలాలతోపాటు దౌల్తాబాద్ మండలంలోని కొన్ని గ్రామాల్లో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. మిగిలిన గ్రామాల్లో నేడు సమావేశాన్ని ఏర్పాటు చేసినటుల చెప్పారు. ప్రజా సమస్యలపై స్పందించినప్పుడే నాయకులు, కార్యకర్తలకు ప్రజల్లో అభిమానం, గౌరవ మర్యాదలు అందుతాయని పేర్కొన్నారు. పార్టీని మరింతగా బలోపేతం చేసేందుకు ప్రతి వంద మంది ఓటర్లకు ఒక ఇన్చార్జిని నియమించినట్లు తెలిపారు.
కోట్లాది నిధులతో అభివృద్ధి
బీఆర్ఎస్ ప్రభుత్వం కోట్లాది నిధులతో నియోకవర్గంలోని అన్ని మండలాల్లోని గ్రామాల్లో 75 శాతం వరకు అభివృద్ధి పనులు పూర్తయ్యాయని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. గతంలో నియోజకవర్గ పరిస్థితి ఏవిధంగా ఉండేది, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత సంక్షేమం, అభివృద్ధితో ప్రస్తుతం నియోజకవర్గం ఏవిధంగా ఉందో ప్రజలకు వివరించాలని సూచించారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో కల్లబొల్లి మాటలు చెప్పేవారు ప్రజల్లోకి వస్తున్నారని, అటువంటి వారి మాటలను పట్టించుకోకుండా తిప్పికొట్టే ప్రయత్నం చేయాలని సూచించారు.
పార్టీ శ్రేణులు ప్రజల్లోకి వెళ్లాలి
గతంలోని పరిస్థితి, బీఆర్ఎస్ పార్టీ గెలిచిన తరువాత ప్రజల నాడి, పార్టీ పటిష్టతకు కారణాలు, ఇంకా ఏం చేస్తే మరింతగా సేవలు అందించినవారమవుతామనే అంశాలపై గ్రామాలవారీగా సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని చర్చించుకోవాలని ఎమ్మెల్యే చెప్పారు. మనలో ఎటువంటి లోపాలు ఉన్నా వాటిని సమన్వయంగా సర్దుకుందామని, మన వల్ల పార్టీకి ఎటువంటి నష్టం వాటిల్లకుండా పాటుపడదామని పిలుపునిచ్చారు. త్వరలో ఎన్నికల సీజన్ ప్రారంభం అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ప్రతి కార్యకర్త పూర్తిస్థాయిలో అలర్ట్గా ఉండి ప్రజల్లోకి వెళ్లాలని తెలిపారు. అనంతరం గ్రామాలవారీగా నాయకులతో ప్రత్యేకంగా సమావేశమై గ్రామాల్లో నెలకొని ఉన్న సమస్యలపై ఎమ్మెల్యే ఆరా తీశారు. గ్రామాల్లో ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి, ఇంకా చేయాల్సిన పనులు, ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి, బీఆర్ఎస్ కార్యకర్తల్లో సమన్వయం వంటి అంశాలపై చర్చించారు.
బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యం
బీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యపడుతుందని, గడిచిన 4 సంవత్సరాల్లోనే కొడంగల్ ప్రజలు గుర్తించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. కొడంగల్ నియోజకవర్గంలోని 181 గ్రామ పంచాయతీల్లో ప్రస్తుతం 110 గ్రామాల్లో గ్రామపంచాయతీల నిర్మాణాలకు శ్రీకారం చుట్టామన్నారు. అదేవిధంగా 2 మున్సిపాలిటీలు కోట్లాది నిధులతో కొత్తదనాన్ని సంతరించుకుంటున్నట్లు పేర్కొన్నారు. కొడంగల్ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిద్దేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో ఎంపీపీ విజయ్కుమార్, వైస్ ఎంపీపీ మహిపాల్రెడ్డి,మాజీ జడ్పీటీసీలు మోహన్రెడ్డి, కేశవరెడ్డి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు భగవంతు, నియోజకవర్గ అధికార ప్రతినిధులు శ్రీను, ఫకీరప్ప, సర్పంచ్లు శ్రీకాంత్రెడ్డి, నరోత్తంరెడ్డి, భీములు, మున్సిపల్ కౌన్సిలర్ మధుసూదన్రావు పాల్గొన్నారు.
బీఆర్ఎస్తోనే అభివృద్ధి : మహిపాల్, జడ్పీటీసీ, దౌల్తాబాద్
బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 8 సంవత్సరాల్లో తెలంగాణ అభివృద్ధితో దేశానికి దిక్సూచిగా మారింది. తెలంగాణలో అమలవుతున్న ఎన్నో అద్భుత పథకాలను ఇతర రాష్ర్టాలు కాపీ కొడుతున్నాయి. కొడంగల్ ఎమ్మెల్యేగా గెలిచిన నరేందర్రెడ్డి.. 4 సంవత్సరాల్లో కొడంగల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోని గ్రామాలు అభివృద్ధిపథంలో దూసుకెళుతున్నాయి. ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు, సీసీ రోడ్లు, ప్రజలకు అన్నింటా సంక్షేమ ఫలాలు అందుతున్నాయి.
కలిసికట్టుగా శ్రమిద్దాం.. పార్టీని, ఎమ్మెల్యేను కాపాడుకుందాం
– రెడ్డి శ్రీనివాస్, నియోజకవర్గ అధికార ప్రతినిధి, దౌల్తాబాద్
అప్పట్లో అడిగినా పెట్టే నాథుడు లేడు. ప్రస్తుతం ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి నియోజకవర్గంలోని ప్రతి వీధిలో పర్యటించి స్వయంగా ప్రజా సమస్యలను గుర్తించి పరిష్కరిస్తున్నారు. సీఎం కేసీఆర్కు నియోజకవర్గ సమస్యలను వివరించి కోట్లాది నిధులతో కొడంగల్కు కొత్తదనాన్ని తీసుకొచ్చారు. అడిగిన వెంటనే ప్రభుత్వం అన్నింటా సౌకర్యాలను అందిస్తున్నది. ఇటువంటి బీఆర్ఎస్ పార్టీని, పిలిస్తే పలికే ఎమ్మెల్యేను కాపాడుకుందాం. అసత్య ప్రచారానికి ఒడికట్టేవారిని తరిమికొడదాం.